Christian controversy in AP Legislative Council: శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
Council: అచ్చెన్నాయుడు చేసిన క్రిస్టియన్ వ్యాఖ్యలు మండలిలో వివాదం రేపాయి. మండలి చైర్మన్ ను క్రిస్టియన్ గా అచ్చెన్న సంబోధించారు. అయితే తాను హిందువునని మోషేన్ రాజు స్పష్టం చేశారు.

Atchannaidu Christian comments spark controversy in the council: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై జరిగిన చర్చ తీవ్ర ఉత్కంఠకు, అనూహ్య పరిణామాలకు దారితీసింది. శాసన మండలిలో కల్తీ నెయ్యి అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ సభ్యుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో జరుగుతున్న చర్చను వైసీపీ సభ్యులు అడ్డుకోవడంపై ఆయన ఆవేదన చెందారు. తాను ఇక్కడ మంత్రిగా కంటే, ఒక సామాన్య వేంకటేశ్వర స్వామి భక్తునిగా మాట్లాడుతున్నానని, కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని రాజకీయం చేయడం తగదని ఆయన పేర్కొన్నారు.
ఎవరి మతాలను వారు గౌరవించుకోవడంలో తప్పు లేదన్న అచ్చన్న
ఈ క్రమంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఇతర మతాలను గౌరవించాలని హితవు పలికారు. నేను హిందువును, జగన్ మోహన్ రెడ్డి , చైర్మన్ మోషేన్ రాజు క్రిస్టియన్లు.. ఎవరి మతం వారి ఇష్టం, ఎవరైనా ఏ మతాన్నైనా అనుసరించవచ్చు అని వ్యాఖ్యానించారు. అయితే, ఈ వ్యాఖ్యలు సభలో ఒక్కసారిగా కలకలం రేపాయి. తనను క్రిస్టియన్గా అభివర్ణించడంపై మండలి చైర్మన్ మోషేన్ రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
తాను హిందువునని ప్రకటించిన మోషేన్ రాజు
మంత్రి వ్యాఖ్యలకు స్పందించిన చైర్మన్ మోషేన్ రాజు తాను క్రిస్టియన్ను కాదని, హిందువునని సభలో స్పష్టమైన ప్రకటన చేశారు. తన పేరులో మోషేన్ ఉన్నంత మాత్రాన మతం మార్చుకున్నట్టు కాదని ఆయన వివరించారు. చైర్మన్ నుంచి వచ్చిన ఈ స్పష్టీకరణతో మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే స్పందించి, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తెలియక చేసిన పొరపాటుగా భావించాలని కోరారు. మంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నప్పటికీ, వైసీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించడం ఆపలేదు. అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
అయినా వైసీపీ సభ్యులు నిరసనలు ఆపకపోవడతో సభ వాయిదా
ఈ తరుణంలో చైర్మన్ మోషేన్ రాజు వైసీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వివరణతో తాను సంతృప్తి చెందానని, వ్యక్తిగతంగా తనకే లేని అభ్యంతరం మీకు ఎందుకని ఆయన వైసీపీ సభ్యులనే ప్రశ్నించారు. అయినా వైసీపీ సభ్యులు ఆందోళనలు కొనసాగించారు. లడ్డూ కల్తీపై జరగాల్సిన చర్చ కాస్తా మతపరమైన అంశాల చుట్టూ తిరగడం సభలో చర్చనీయాంశమైంది. అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం, చైర్మన్ స్వయంగా జోక్యం చేసుకుని సభ్యులను వారించడంతో గొడవ సద్దుమణిగింది.























