APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్ సర్వీసులు - ఈ నగరాల నుంచే
దసరా పండుగ కోసం విజయవాడలోని కనకదుర్గ ఆలయానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.
దసరా పండక్కి సొంతూళ్లకి వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను రెడీ చేస్తోంది. ఈ సారి దసరా కోసం సాధారణ రోజులతో పోల్చితే 5,500 వరకూ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లుగా ప్రకటించింది. ఈ స్పెషల్ బస్సులు అక్టోబర్ 13వ తేదీ నుంచి 26వ దాకా ఉంటాయని వివరించింది. అంతేకాకుండా, ఈ స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని, సాధారణ ఛార్జీలే ఉంటాయని ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది.
దసరా పండుగ కోసం విజయవాడలోని కనకదుర్గ ఆలయానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఏపీకి పొరుగున ఉన్న తెలంగాణతో పాటుగా, కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తుంటారు. దుర్గమ్మ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుందనే అంచనాల మేరకు.. ఇంకా సెలవుల్లో ప్రజల సొంతూరి ప్రయాణాల వల్ల కూడా అదనపు బస్సుల్ని వేస్తున్నట్లుగా ఆర్టీసీ అధికారులు తెలిపారు. తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్తో పాటు, కర్ణాటకలో బెంగుళూరు, చెన్నై లాంటి అంతర్రాష్ట్ర నగరాల నుంచి వచ్చే ప్రయాణికులకు కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. అలాగే విజయవాడ నుంచి అన్ని ప్రధాన ప్రాంతాలకు బస్సుల్ని నడుపుతామని అధికారులు తెలిపారు.
దసరాకు ముందు 2,700 బస్సులు
ఈ నెల 13 నుంచి 22 దాకా దసరా ముందు రోజుల్లో 2,700 స్పెషల్ బస్సు సర్వీసుల్ని, అలాగే, పండుగ రోజుల్లో, పండుగ ముగిశాక 23వ తేదీ నుంచి 26 దాకా మరో 2,800 బస్సుల్ని నడిపించనున్నారు. ఒక్క హైదరాబాద్ నుంచే 2,050 బస్సులు, బెంగుళూరు నుంచి 440 బస్సులు, చెన్నై నుంచి 153 బస్సులను ఏపీలోని వివిధ ప్రాంతాలకు నడిపించనున్నారు.
విశాఖపట్నం నుంచి 480 బస్సులు, రాజమండ్రి నుంచి 355 బస్సులు, విజయవాడ నుంచి 885 బస్సులు, ఇతర జిల్లాల నుంచి వివిధ ప్రాంతాలకు, నగరాలకు 1,137 ప్రత్యేక బస్సులను నడుపుతూ రద్దీని తగ్గిస్తున్నట్లుగా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. బస్సుల ట్రాకింగ్, 24/7 సమాచారం కోసం కాల్ సెంటర్ నెంబర్ 149 లేదా 08662570005 అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే తమ ధ్యేయమంటూ ఏపీఎస్ఆర్టీసీ ఓ ప్రకటన విడుదల చేసింది.
చిల్లర సమస్య లేకుండా ఆన్లైన్ పేమెంట్లు
అటు ఆన్లైన్ పేమెంట్స్తో ప్రయాణికులకు సమస్య లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. ముఖ్యంగా ఆర్టీసీకి చిల్లర సమస్యలు ఉండనివ్వబోమని చెప్పారు. ప్రయాణికులు బస్సెక్కిన తర్వాత ఫోన్ పే, గూగుల్ పే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, క్రెడిట్, డెబిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా కూడా టిక్కెట్లు తీసుకుని ప్రయాణం చేయొచ్చని చెప్పారు. ముందస్తు రిజర్వేషన్లకు కూడా అవకాశం ఉందని తెలిపారు. అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకుంటే బస్సు ప్రయాణ ఛార్జీలో 10 శాతం రాయితీ ఉంటుందని చెప్పారు.
Before You Go
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















