Andhra Pradesh Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్లో ఈడీ సంచలనం - రూ.442 కోట్ల ఆస్తుల జప్తు - ఎవరెవరివి అంటే?
ED in AP liquor: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సంచలన నిర్ణయం తీసుకుంది. నిందితుల ఆస్తులను జప్తు చేసింది.

ED in AP liquor scam seized Rs 442 crore: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నిందితుల ఆస్తులను జప్తు చేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి ప్రధాన నిందితులుగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బూనేటి చాణక్య, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డికి చెందిన బంధువులు, అనుబంధ సంస్థల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద సుమారు 441.63 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో బ్యాంక్ బ్యాలెన్స్లు, ఫిక్స్డ్ డిపాజిట్లతో పాటు పలు భూములు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కేంద్రంగా జరిగిన భారీ అవకతవకలపై ఈడీ లోతైన దర్యాప్తు చేపట్టింది. మద్యం సరఫరా, సేకరణ , విక్రయాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల గండి కొట్టారనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా సిండికేట్లుగా ఏర్పడి, డిజిటల్ చెల్లింపులను పక్కన పెట్టి కేవలం నగదు రూపంలోనే లావాదేవీలు నిర్వహించడం ద్వారా భారీ ఎత్తున నల్లధనాన్ని ఆర్జించినట్లు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. ఈ అక్రమ సంపాదనను వివిధ సంస్థల పేరుతో స్థిరాస్తులుగా మార్చినట్లు ఆధారాలు లభించాయి.
ఈ కేసులో కీలక వ్యక్తులైన రాజశేఖర రెడ్డి, వాసుదేవ రెడ్డిలు గత ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన హోదాల్లో ఉండి, మద్యం పాలసీని తమకు అనుకూలంగా మార్చుకున్నారని దర్యాప్తు సంస్థ పేర్కొంది. నిర్దేశిత కంపెనీలకే మద్యం సరఫరా కాంట్రాక్టులు దక్కేలా చేయడం, తక్కువ నాణ్యత గల మద్యాన్ని అధిక ధరలకు విక్రయించడం ద్వారా వచ్చిన కమిషన్లను బినామీ కంపెనీల ద్వారా మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అటాచ్ చేసిన 442 కోట్ల రూపాయల ఆస్తులు ఈ అక్రమ మార్గాల్లో సంపాదించినవేనని ప్రాథమికంగా నిర్ధారించారు.
ED, Hyderabad has attached movable and immovable properties worth Rs. 441.63 Crore belonging to Kessireddy Rajasekhara Reddy, his family members & related entities; Booneti Chanakya & his related entities; relatives & entities of Donthireddy Vasudeva Reddy; and other persons &… pic.twitter.com/9NSOUiCALD
— ED (@dir_ed) March 6, 2026
తాజా జప్తులతో ఏపీలో మద్యం మాఫియా మ, దానికి సహకరించిన అధికారుల చుట్టూ ఈడీ ఉచ్చు బిగిసినట్లయింది. ఈ ఆస్తుల అటాచ్మెంట్ కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న మరికొందరు రాజకీయ నేతలు, అధికారులపై కూడా చర్యలు ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే అరెస్టయిన నిందితులను ప్రశ్నించడం ద్వారా లభించిన సమాచారం ఆధారంగా మరిన్ని ఆస్తులను గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థ నిమగ్నమైంది.























