Amaravati Construction Status 2026: డీజిల్ కొరత, మండే ఎండలతో కార్మికుల వలస - నిర్మాణాలు స్లో - అమరావతి గ్రౌండ్ రియాలిటీ ఇదే !
Fuel Shortage in Amaravati: అమరావతి నిర్మాణ పనులు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం అంతా సవ్యంగా సాగుతోందని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి.

AP Capital Works Ground Reality: అమరావతి పనులు జోరుగా సాగుతున్నాయి.కానీ గతంలో ఉన్నంత జోరు లేదు. తగ్గింది. దానికి కారణం డీజిల్ కొరత. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సాగుతున్న పనులకు ప్రస్తుతం ఇంధన కొరత పెద్ద అడ్డంకిగా మారింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రస్తుతం ఒక కీలక దశలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం బయట ప్రపంచానికి అంతా సవ్యంగా సాగుతోందని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి.
డిజిల్ పెద్ద సమస్య
రాజధాని ప్రాంతంలో వినియోగిస్తున్న భారీ యంత్రాలలో దాదాపు 60 శాతం డీజిల్ కొరత కారణంగా షెడ్లకే పరిమితమయ్యాయి . ఎర్త్ మూవర్స్, టిప్పర్లు, క్రేన్లు నడవడానికి అవసరమైన ఇంధనం సకాలంలో అందకపోవడంతో పనుల వేగం గణనీయంగా తగ్గింది. కాంట్రాక్టు సంస్థలకు నేరుగా బంకుల నుంచి బల్క్ గా డీజిల్ కేటాయించేలా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కేంద్రం అందుకు అంగీకరించలేదు. వర్షాకాలం రాకముందే కీలకమైన మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వానికి ఇది పెద్ద తలనొప్పిగా మారింది.
కేవలం ఇంధన కొరతే కాదు, పెరుగుతున్న ఎండలు కూడా అమరావతి నిర్మాణాన్ని కుదిపేస్తున్నాయి. 45 డిగ్రీల పైచిలుకు ఉష్ణోగ్రతలు , దానికి తోడు వీస్తున్న వడగాల్పుల వల్ల మధ్యాహ్నం వేళ పనులు చేయడం అసాధ్యంగా మారింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వేల సంఖ్యలోని వలస కూలీలు ఈ తీవ్రమైన వేడిని భరించలేక స్వగ్రామాలకు తిరిగి వెళ్తున్నారు. కూలీల కొరత కారణంగా ప్రాజెక్టులు డెడ్ లైన్ లోపు పూర్తవుతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణ ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం ఏర్పాటు చేసిన లేబర్ క్యాంపుల్లో కనీస వసతులు లేవనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాగునీరు, సరైన విద్యుత్ సౌకర్యం, వేడి నుంచి రక్షణ పొందేందుకు తగిన షెడ్లు లేకపోవడంతో కార్మికులు అనారోగ్యం పాలవుతున్నారు. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ఇటీవల కొన్ని క్యాంపులను తనిఖీ చేసి, కాంట్రాక్టు సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో మార్పులు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.
అమరావతి నిర్మాణానికి నిధులు సమకూరుస్తున్న ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు కూడా ఇటీవల క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు కార్మికుల కొరత , మందకొడిగా సాగుతున్న పనులపై ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రాజెక్ట్ గడువును పెంచడం వల్ల వ్యయం పెరిగే అవకాశం ఉందని, దీనిని అరికట్టడానికి వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని వారు సూచించినట్లు తెలుస్తోంది. గ్రీన్ ఫీల్డ్ రాజధాని పర్యావరణ సమతుల్యత పాటిస్తూనే నిర్మాణాలను వేగవంతం చేయడం ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా మారింది. ప్రభుత్వం ఇంధన సరఫరాను అత్యవసర సేవ గా గుర్తించాలని ప్లాన్ చేస్తోంది. కార్మికులకు మెరుగైన భోజనం, వసతి కల్పించాలని కాంట్రాక్టర్లకు డెడ్ లైన్లు విధిస్తోంది. ప్రభుత్వం గ్రౌండ్ లెవల్ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం కనిపిస్తోంది.
Before You Go
Amaravathi - Vijayawada Steel Bridge | విజయవాడ - అమరావతికి ఈజీ రూట్ సిద్ధం.. స్టీల్ బ్రిడ్జ్లు రెడీ
ట్రెండింగ్ వార్తలు






















