Rashid Latif on Ind vs Pak Future | భవిష్యత్తులోనూ భారత్తో ఆడం: రషీద్ లతీఫ్
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో ( ICC T20 World Cup 2026 ) భాగంగా లీగ్ స్టేజ్ లో భారత్ తో జరిగే మ్యాచ్ ను ఆడమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board ) ప్రకటించింది. ఈ విషయంపై పెద్ద చర్చే జరుగుతుంది. అయితే ఇది ఈ ఒక్క మ్యాచ్తోనే ఆగిపోదని, భవిష్యత్తులో కూడా భారత్తో జరిగే మ్యాచ్లను పాకిస్థాన్ బహిష్కరిస్తుందని పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ( Rashid Latif ) అన్నాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో గ్రూప్-ఏలో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ను బాయ్కట్ చేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ వ్యవహారంపై రషీద్ లతీఫ్ మాట్లాడుతూ.. ఐసీసీ ఎన్ని ఆంక్షలు విధించినా పీసీబీ భయపడబోదని స్పష్టం చేశాడు. 'భారత్, పాకిస్థాన్ మ్యాచ్ల నుంచి ఐసీసీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు భారీ లాభాలు వస్తాయి. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో బంగ్లాదేశ్ జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకుంది. దాంతో పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి.
భద్రతా కారణాలతో బంగ్లాదేశ్, భారత్ రావడానికి నిరాకరించినప్పుడు ఐసీసీ తేలికగా తీసుకుంది. కానీ ఇప్పుడు రాజకీయ వాతావరణం మారిపోయింది. గతంలోలా కాకుండా బంగ్లాదేశ్కు పాకిస్థాన్ అండగా నిలుస్తోంది. భవిష్యత్తులో కూడా భారత్తో మ్యాచ్లను పాకిస్థాన్ బహిష్కరించనుంది. ఐసీసీ ఆంక్షలు, మ్యాచ్ ఓటమి గురించి పీసీబీ ఆందోళన చెందడం లేదు. సాధారణంగా పీసీబీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోదు అని స్పష్టం చేసారు రషీద్ లతీఫ్.























