Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
Telangana Investments: దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణకు భారీగా పెట్టుబడులు సమకూరాయి. ఒకేరోజు రూ.56,300 కోట్ల పెట్టుబడులతో సరికొత్త రికార్డు నెలకొల్పింది.

WEF Companied Agreed To Heavy Investments In Telangana: దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (World Economic Forum) వేదికపై తెలంగాణ (Telangana) మరో కొత్త రికార్డు నమోదు చేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజు భారీ పెట్టుబడులను సమీకరించింది. ముఖ్యంగా 3 కంపెనీల ద్వారా రాష్ట్రానికి రూ.56,300 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా రాష్ట్ర యువతకు దాదాపు 10,800 ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. దేశంలో ఇంధన రంగంలో పేరొందిన సంస్థ 'సన్ పెట్రో కెమికల్స్' రాష్ట్రంలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజీ, జల విద్యుత్తు, సోలార్ విద్యుత్తు ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై (ఎంవోయూ) సంతకం చేసింది.
ఈ జిల్లాల్లో..
నాగర్కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో మూడు చోట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులను నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టుల మొత్తం ఇంధన సామర్థ్యం 3,400 మెగావాట్లు. వీటికి 5,440 మెగావాట్ల సామర్థ్యముండే సోలార్ విద్యుత్తు ప్లాంట్లను అనుసంధానం చేస్తుంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణ దశలోనే దాదాపు 7000 ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటివరకు దావోస్ వేదికపై తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే. సన్ పెట్రో కెమికల్స్ ఎండీ దిలీప్ సాంఘ్వీతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ ఒప్పందంపై కీలక చర్చలు జరిపారు. పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి, ఇన్వెస్టిమెంట్స్ ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఎం సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు.
సుస్థిరమైన ఇంధన వృద్ధి సాధించే తెలంగాణ లక్ష్య సాధనలో ఈ ఒప్పందం మైలురాయిగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చిన సన్ పెట్రో కెమికల్స్ ప్రతినిధులను అభినందించారు. ఈ ఒక్క ఒప్పందంతో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గత ఏడాది దావోస్లో సాధించిన రూ.40 వేల కోట్ల పెట్టుబడుల రికార్డును సమం చేసిందని అన్నారు. భవిష్యత్తు ఇంధన అవసరాల దృష్ట్యా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. హరిత ఇంధన ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. సన్ పెట్రో కెమికల్స్ భాగస్వామ్యంతో భవిష్యత్తులో డిమాండ్కు అనుగుణంగా ఇంధన వనరులు సమకూరుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలతో పాటు నాగర్కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాలు పారిశ్రామికంగా వృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.
ఏఐ డేటా సెంటర్
మరోవైపు, తెలంగాణలో మరో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ అందుబాటులోకి రానుంది. రూ.10 వేల కోట్లతో దీనిని నెలకొల్పేందుకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ దావోస్లో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ కంపెనీ 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ నెలకొల్పుతుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 3,600 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
అటు, రాష్ట్రంలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ స్థాపించనున్నట్లు జేఎస్డబ్ల్యూ సంస్థ ప్రకటించింది. అమెరికాకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ అనుబంధంతో ఈ యూనిట్ నెలకొల్పనుంది. దాదాపు రూ.800 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీనికి సంబంధించి దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో జేఎస్డబ్ల్యు డిఫెన్స్ అనుబంధ సంస్థ అయిన జేఎస్డబ్ల్యు యూఏవీ లిమిటెడ్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో దాదాపు 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు క్రియాశీలంగా మారనుంది. ఐటీ, ఫార్మాతో పాటు అన్ని రంగాల పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయని, ఈ ఒప్పందంతో రక్షణ రంగంలో కీలక ఆవిష్కరణలతో పాటు డ్రోన్ టెక్నాలజీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం రక్షణ రంగంలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

