Errabelli emotion: తొర్రూరులో చేజారిన మున్సిపల్ పీఠం - భావోద్వేగంతో ఎర్రబెల్లి కన్నీరు
Errabelli Dayakar Rao: ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీరు పెట్టుకున్నారు. పూర్తి మెజార్టీ ఉన్నా ..మున్సిపల్ చైర్మన్ పీఠం చేజారిపోయిందని ఆయన ఆవేదన చెందారు.

Errabelli emotion: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికలు మంగళవారం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ముగిశాయి. సుదీర్ఘ కాలం పాటు ఈ నియోజకవర్గంలో ఆధిపత్యం చలాయించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఈ ఫలితం కోలుకోలేని దెబ్బ తీసింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక కౌన్సిలర్ అనూహ్యంగా చివరి నిమిషంలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో సమీకరణాలన్నీ మారిపోయాయి. తన కేడర్ను కాపాడుకోవడానికి ఎర్రబెల్లి క్యాంపు స్థలాలను మారుస్తూ విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ, ఫలితం మాత్రం కాంగ్రెస్ పక్షాన నిలిచింది. లాటరీ పద్ధతిలో కాంగ్రెస్ కౌన్సిలర్ తూనం శ్రవణ్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు.
లాటరీ పద్దతిలో కాంగ్రెస్కు తొర్రూరు మున్సిపల్ పీఠం
తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా భారత రాష్ట్ర సమితి 9 సీట్లు గెల్చుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఏడు వచ్చాయి. కేవలం వార్డు సభ్యుల సంఖ్యను చూస్తే BRS స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. ఎక్స్ అఫీషియో ఓట్లతో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో ఇరు పార్టీల బలం సమానం కావడంతో, అధికారులు లాటరీ పద్ధతిని అనుసరించారు. ఈ లాటరీలో అదృష్టం కాంగ్రెస్ పార్టీని వరించింది. దీంతో తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది.
కన్నీటి పర్యంతమైన ఎర్రబెల్లి - రాజకీయ సన్యాసంపై వ్యాఖ్యలు
ఈ రాజకీయ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా ముందు బహిరంగంగానే కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అసహ్యం కలిగిస్తున్నాయని, విలువలు లేని రాజకీయాల్లో తానూ కొనసాగాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. రాజ్యాంగ విరుద్ధంగా అధికార యంత్రాంగాన్ని వాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు. రాత్రింబవళ్లు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు తాను ఏ సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని చెబుతూ ఆయన బావోద్వేగానికి లోనయ్యారు.
బ్రేకింగ్ న్యూస్
— Tharun Reddy (@Tarunkethireddy) February 17, 2026
కంటతడి పెట్టిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
నేను రాజకీయాల్లో ఉండాలా పోవాలా అంటూ ఏడ్చిన దయాకర్ రావు pic.twitter.com/VrAxSGYR7d
పోలీస్ స్టేషన్లో ఉద్రిక్తత- అండగా నిలిచిన నేతలు
మున్సిపల్ ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు ఎర్రబెల్లి దయాకర్ రావును అదుపులోకి తీసుకుని నర్సింహులపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయం తెలియగానే మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ తమ మద్దతుదారులతో కలిసి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ పోలీసుల తీరుపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రబెల్లిని పరామర్శించిన నేతలు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించడం తగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
























