Vijayawada to Hyderabad Traffic Diversions: విజయవాడ- హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు.. ఇలా వెళ్తే ట్రాఫిక్ సమస్యకు చెక్
సంక్రాంతి పండగ జరుపుకుని ఏపీ నుంచి హైదరాబాద్ తిరిగొస్తున్న వాహనాలకు దారి మళ్లింపులు సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తే ట్రాఫిక్ సమస్య ఉందని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.

National Highway 65 | నల్గొండ: సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సొంతూళ్లకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణం అవుతున్నారు. పండుగ పూర్తి చేసుకొని హైదరాబాద్ నగరానికి భారీగా వాహనాలు వస్తున్నాయి. అయితే నేషనల్ హైవే- 65 (హైద్రాబాద్- విజయవాడ రహదారి) పై చిట్యాల, పెద్ద కాపర్తి వద్ద ప్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నందున, ట్రాఫిక్ జామ్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నందున ట్రాఫిక్ దారి మళ్లింపు చర్యలు చేపట్టినట్లు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.
ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా, ప్రయాణికులకు సురక్షితమైన, సాఫీగా ప్రయాణం జరగాలన్న ఉద్దేశంతో నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ట్రాఫిక్ దారి మళ్లింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు న ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని నల్గొండ ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
దారి మళ్లింపు వివరాలు
1) గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు :
గుంటూరు నుంచి మిర్యాలగూడ మీదుగా హాలియా - కొండమల్లేపల్లి - చింతపల్లి - మాల్ మీదుగా హైదరాబాద్.
2) మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు :
మాచర్ల నుంచి నాగార్జునసాగర్ మీదుగా పెద్దవూర - కొండపల్లేపల్లి - చింతపల్లి-మాల్ మీదుగా హైదరాబాద్.
3) నల్లగొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు :
నల్లగొండ నుంచి మార్రిగూడ బై పాస్ మీదుగా మునుగోడు - నారాయణపూర్- చౌటుప్పల్ (ఎన్.హెచ్ 65) మార్గంలో హైదరాబాద్.
4.) విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు..
కోదాడ నుంచి హుజూర్నగర్- మిర్యాలగూడ- హాలియా- చింతపల్లి- మాల్ మీదుగా హైదరాబాద్.
5) నేషనల్ హైవే 65 (విజయవాడ -హైదరాబాద్ ) రహదారి పై చిట్యాల, పెద్దకాపర్తిలో ప్లై ఓవర్ నిర్మాణం జరుగుతున్నందున ట్రాఫిక్ జామ్ అయితే కనుక చిట్యాల నుండి భువనగిరి మీదుగా హైద్రాబాద్ మళ్లింపులు
ఈ మార్గాల ద్వారా వెళ్లడం వల్ల ప్రధాన రహదారి విజయవాడ, హైద్రాబాద్ పై (నేషనల్ హైవే 65 ) ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి, ప్రయాణికులు ఇబ్బంది లేకుండా గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చని పోలీసులు తెలిపారు.
ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు..
ఈ సందర్భంగా నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. “సంక్రాంతి పండగ పూర్తి చేసుకున్న ప్రజలు తిరిగి హైదరాబాద్కు పయనం అవుతున్నారు. ఏపీలోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వాహనాలలో తిరిగి ప్రయాణం అవుతున్నారు. అయితే ప్రయాణికులు ఏ ఇబ్బంది లేకుండా తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలన్నదే పోలీస్ శాఖ లక్ష్యం. ట్రాఫిక్ రద్దీ కారణంగా అసౌకర్యం తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో దారి మళ్లింపు చర్యలు చేపట్టాం. వాహనదారులు పోలీస్ శాఖ సూచించిన మార్గాలను అనుసరించి, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ప్రయాణించాలి. రోడ్డు భద్రతలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంటేనే ప్రయోజనం ఉంటుంది” అని తెలిపారు. సంక్రాంతి పండగ రోజులలో ట్రాఫిక్ పోలీసులు కీలక జంక్షన్ల వద్ద విధులు నిర్వహిస్తున్నారు. డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ నిఘాతో ట్రాఫిక్ సరళిని ఎప్పటికప్పుడు నల్గొండ పోలీసులు పర్యవేక్షిస్తున్నారని జిల్లా ఎస్పీ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వాహనదాులు డయల్ 100 ని సంప్రదించాలని సూచించారు.






















