Chandrababu: ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి - నారా వారి పల్లెలో చంద్రబాబు పిలుపు
AP CM: ప్రతి ఒక్కరూ తమ స్థోమతకు తగ్గట్టుగా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నారా వారి పల్లెలో మీడియాతో మాట్లాడారు.

Golden Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ సందర్భంగా తన స్వగ్రామమైన నారావారిపల్లిలో పర్యటించి, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ పలు కీలక అంశాలను వెల్లడించారు. మనం పుట్టిన ఊరిని ఎన్నటికీ మరువకూడదని, ప్రతి ఒక్కరూ తమ స్థోమతకు తగ్గట్టుగా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. సంక్రాంతి రైతులు ఆనందంగా ఉండే పండుగ అని, ఈ సందర్భంగా కోడిపందేలు, జల్లికట్టు వంటి వినోద క్రీడలు ఆహ్లాదాన్ని ఇస్తాయని ఆయన గుర్తు చేసుకున్నారు. 2047 నాటికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ - వికసిత్ భారత్ లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని, ప్రజల జీవన ప్రమాణాలు, తలసరి ఆదాయం పెరగడమే తన ధ్యేయమని స్పష్టం చేశారు.
గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పి4 విధానం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని, ఇప్పటికే 10 లక్షల కుటుంబాలను ఈ పథకం కింద దత్తత తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. స్వర్ణ నారావారిపల్లి ప్రాజెక్టులో భాగంగా కందులవారిపల్లి, రంగంపేట, నారావారిపల్లి గ్రామాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా 147 మంది నిరుపేదలకు ఏడాదిలోగా ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థను కల్పిస్తామని హామీ ఇచ్చారు. మూలపల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రాంతీయ తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి వనరుల నిర్వహణపై హర్షం వ్యక్తం చేస్తూ, ప్రస్తుతం అన్ని రిజర్వాయర్లలో 950 టీఎంసీల నీరు ఉండటం సంతోషకరమని చంద్రబాబు పేర్కొన్నారు. 2026 చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టును ప్రారంభిస్తామని, దీనిని మొట్టమొదటిసారిగా నారావారిపల్లి నుంచే శ్రీకారం చుట్టామని వెల్లడించారు. వీటితో పాటు సోలార్ పవర్ సిస్టమ్, ప్రకృతి సేద్యం, యువతకు ఉపాధి కల్పించే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. 2027 నాటికి రాష్ట్రంలో భూ సమస్యలు లేకుండా పరిష్కరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
నారావారిపల్లెలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి గ్రామ దేవతలు దొడ్డి గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకముందు టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ వేంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందించారు.… pic.twitter.com/YV3fiQvIfL
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) January 15, 2026
తిరుపతి నగరాన్ని విజయవాడ, విశాఖపట్నం తరహాలో మెగా సిటీ గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపి, ప్రపంచస్థాయి సౌకర్యాలతో ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, సాంకేతిక నైపుణ్యాలను పెంచడం ద్వారా ఆర్థిక అసమానతలను తొలగించి రాష్ట్రంలో సంపదను సృష్టిస్తామని చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో ఆశాభావం వ్యక్తం చేశారు.





















