Minister Ponguleti: ఫోన్ ట్యాపింగ్ ఇంకా కొనసాగుతోంది- మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు!
Ponguleti : బీఆర్ఎఎస్ ఇంకా ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పెద్దల వద్ద ఇంకా ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఉన్నాయన్నారు.

Minister Ponguleti allegations on phone tapping:తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఫోన్ ట్యాపింగ్ అంశం పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య చిచ్చు రేపుతున్నాయి. తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంకా ముగిసిపోలేదని, ప్రస్తుతం కూడా ట్యాపింగ్ కొనసాగుతోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ అగ్రనేతల వద్ద ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఉన్నాయని, వాటి ద్వారా వారు ప్రస్తుత ప్రభుత్వ కార్యకలాపాలను, మంత్రుల కదలికలను నిఘా పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఇలాంటి చర్యలకు పాల్పడటం అత్యంత దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.
తనపై కూడా నిఘా కొనసాగుతోందని చెప్పడానికి మంత్రి పొంగులేటి ఒక ఉదాహరణను ప్రస్తావించారు. ఇటీవల తాను కొంతమంది కార్పొరేటర్లతో నిర్వహించిన అత్యంత రహస్యమైన కాన్ఫరెన్స్ కాల్ను కూడా ట్యాపింగ్ చేశారని ఆయన ఆరోపించారు. ఆ కాల్లో తాను ఏం మాట్లాడానో, ఎవరికి ఎలాంటి సూచనలు ఇచ్చానో ప్రతిపక్ష నేతలు విన్నారని, ఆడియో రికార్డింగ్లు కూడా వారి వద్ద ఉన్నాయని పొంగులేటి పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తనకే రక్షణ లేకపోతే, సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ పరికరాలు గతంలో పోలీస్ అధికారుల అదుపులో ఉండేవని, కానీ ప్రభుత్వం మారాక వాటిని బీఆర్ఎస్ పెద్దలు తమ సొంత నివాసాలకు లేదా రహస్య ప్రాంతాలకు తరలించారని మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. సదరు పరికరాల ద్వారా ఇప్పటికీ సమాచారాన్ని సేకరిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ట్యాపింగ్ కేసులో ఇప్పటికే కొందరు అధికారులు జైలులో ఉన్నప్పటికీ, అసలు సూత్రధారులు బయటే ఉన్నారని, వారందరి జాతకాలు త్వరలోనే బయటపడతాయని హెచ్చరించారు.
Phone tapping is still ongoing & BRS leaders still have the equipment - Minister Ponguleti
— Naveena (@TheNaveena) February 10, 2026
Even his conference call with corporators was tapped and listened to which proves the equipment is still there
Govt will probe where the equipment has been hidden in which farmhouses or… pic.twitter.com/w6Hx4hgVaH
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతికతను వాడుకుని ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న ట్యాపింగ్పై లోతైన విచారణ జరిపిస్తున్నామని, దీనికి బాధ్యులైన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఈ కేసులో కీలక మలుపులు చోటుచేసుకుంటాయని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.























