Darshanam Mogulayya KTR: దర్శనం మొగులయ్యకు భరోసా - ఇంటి స్థలం , కంటి చికిత్స బాధ్యత తీసుకున్న కేటీఆర్
Darshanam Mogulaiah: పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య కేటీఆర్ను కలిశారు. సమస్యలను పరిష్కరిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.

KTR assures Darshanam Mogulaiah: పద్మశ్రీ అవార్డు గ్రహీత, దర్శనం మొగులయ్యకు భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మొగులయ్య కేటీఆర్ నివాసంలో ఆయనను కలిసి తన సమస్యలు చెప్పుకున్నారు. మొగులయ్య ఆరోగ్యం, యోగక్షేమాల గురించి కేటీఆర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా మొగులయ్య తన కంటిచూపు మందగించిందని, చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన కేటీఆర్, మొగులయ్యకు హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్లో పూర్తి చికిత్సను అందించే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వం తనకు హయత్ నగర్ మండలంలో కేటాయించిన 600 గజాల స్థలం విషయంలో కొంతమంది వ్యక్తుల నుండి ఎదురవుతున్న ఇబ్బందులు, కోర్టు కేసుల వివరాలను కేటీఆర్కు వివరించారు. గత ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన భూమిని తనకు ఉచితంగా అందిస్తే దీన్ని కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని మొగులయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తాను కట్టుకున్న గోడలను ఇంటిని కూడా కూలగొట్టారని, కోర్టు కేసులు వేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు గత ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని కాపాడాలని కేటీఆర్ కి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంలో అనేక సార్లు కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లిన తనకు పరిష్కారం దొరకలేదని, తనకు అండగా నిలవాలని కోరారు.
దీనిపై తక్షణమే స్పందించిన కేటీఆర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. మొగులయ్యకు గతంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం కేటాయించిన భూమి విషయంలో కొందరు వ్యక్తులు కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని కలెక్టర్కు తెలిపారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి, మొగులయ్యకు న్యాయం చేయాలని కోరారు. అలాగే, మొగులయ్య ఆ స్థలంలో కట్టుకున్న గదిని కూడా కొంతమంది కూల్చివేసిన పరిస్థితి ఉందని మొగులయ్య చెప్పారని పేర్కొన్నారు. మొగులయ్య భూమికి, ఆయన కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని కలెక్టర్కు కేటీఆర్ సూచించారు. అవసరమైతే, మొగులయ్యకు ఎదురవుతున్న న్యాయపరమైన కేసులను ఎదుర్కొనేందుకు కూడా సహాయం అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఒకప్పుడు లింగాల అడవుల్లో 12 మెట్ల కిన్నెర వాయించుకునే తనకు అప్పటి ముఖ్యమంత్రి కె.సి.ఆర్. ప్రేమతోనే గుర్తింపు దక్కిందని మొగులయ్య అన్నారు. కేసీఆర్ తనను గుర్తించి ఉగాది పురస్కారం ఇచ్చి గౌరవించడం వల్లనే తన కళ ప్రపంచం దృష్టికి చేరిందని, తదనంతరం పద్మశ్రీ అవార్డు కూడా దక్కిందని పేర్కొన్నారు. కేసీఆర్ తమ కుటుంబం కోసం చేసిన సహాయానికి, తమ కష్టాలన్నీ తీర్చినందుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు.





















