బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని, వాటిని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఈ బంద్కు పిలుపునిచ్చాయి.
Telangana Bandh: బీసీ సంఘాలకు మద్దతుగా కదలిన రాజకీయ పార్టీలు- ఎవరి అజెండాతో వాళ్లు ఐక్య పోరాటం
Telangana Bandh: తెలంగాణలో బీసీ సంఘాలు నిర్వహించిన బంద్ విజయవంతంగా సాగుతోంది. పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. పార్టీలన్నీ తమ ప్రత్యేక అజెండాతో బంద్కు సంపూర్ణంగా మద్దతు ప్రకటించాయి

Telangana Bandh: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని చేపట్టిన బంద్ కొనసాగుతోంది. బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపునకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించడంతో జనజీవనం స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ప్రైవేటు క్యాబ్, ఆటోలు మాత్రమే రోడ్లపై తిరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు పాల్గొని బంద్కు మద్ధతుగా నిలిచారు. ఆర్టీసీ బస్లు పూర్తిగా డిపోలకే పరిమితం అయ్యాయి. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. వాణిజ్య సంస్థలను కూడా పూర్తిగా బంద్ చేశారు. వ్యాపారాలు ఆగిపోయాయి.
బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన రాజకీయ పార్టీలు తమ ప్రత్యేక అజెండాలను బయట పెట్టాయి. తమ వాదన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాయి. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్గౌడ్ బీసీ కాంగ్రెస్ నేతలతో కలిసి నిరసనల్లో పాల్గొన్నారు. కేంద్రం తీరుపై, బీజేపీ నాయకుల వ్యవహార శైలిపై మండిపడ్డారు. అదే టైంలో బీఆర్ఎస్ నేతల విమర్శలకు కూడా కౌంటర్ ఇచ్చారు. పీసీసీ చీఫ్తోపాటు పలు ప్రాంతాల్లో మంత్రులు కూడా బంద్లో పాల్గొన్నారు.
బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా బీసీ బంద్ జరిగిందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ఆర్టీసీక్రాస్ రోడ్ పక్కన ముషీరాబాద్ డిపో2 వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారాయన. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అనిల్ కుమార్ యాదవ్,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. బీసీ 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పని బిల్లులను కేంద్రం వెంటనే ఆమోదం తెలిపి 9th షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. సత్తుపల్లిలో బీసీ రిజర్వేషన్ల కోసం జరుగుతున్న బంద్ లో పాల్గొన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆయన కూడా కేంద్రంపై మండిపడ్డారు.
బిసిల బంద్లో బీఆర్ఎస్ తరఫున మాజీమంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ రోడ్లపైకి వచ్చారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ధర్నాలో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణలో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరికీ బీసీల పట్ల చిత్తుద్ధి లేదని ఆరోపించారు. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకొని బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ చెప్పారని విమర్శించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. అన్నీ తెలిసి కూడా బీసీలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడు మాత్రమే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసిందని అభిప్రాయపడ్డారు. పెరియార్ మొదలు అనేక గొప్ప ఉద్యమాలు జరిగాయని గుర్తు చేశారు. 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో రెండేళ్ల పాటు బీసీల ఆర్థిక, సామాజిక, విద్య అన్ని రంగాలపై సమగ్ర సర్వే చేసి.. ఆ రిపోర్ట్ తో రాజ్యాంగంలో 9 వ షెడ్యూల్ లో చేర్చారని తెలిపారు. తెలంగాణలో కూడా కేసీఆర్ ఒకసారి సర్వే చేశారని, బీసీ కమిషన్ వేశారన్నారు. ఎన్ని వేసిన నిజాయితీ లేదు కాబట్టి అమలు కాలేదని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం కూడా పేరుకు కమిషన్లు వేసిందే తప్ప నిజాయితీ లేదని ఆరోపించారు. తీసిన లెక్కలు కూడా తప్పులు తడకలుగా ఉన్నాయని 52 శాంతం ఉంటే 42 శాతం అని కాకి లెక్కలు చెప్తున్నారని మండిపడ్డారు.
తాను చెప్పేవన్నీ అబద్ధం అయితే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్ చేశారు ఈటల. వీటిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు. బీసీలు మేమెంతో మాకంత కావాలి అనే నినాదం చేస్తున్నారని యాచించే స్థాయిలో కాదు శాసించే స్థాయిలో ఉన్నామని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నంత కాలం ఆ కుటుంబం వారికే అధికారం దక్కుతుందని ఆ కుటుంబానికే మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్క బీసీ, ఒక ట్రైబల్ ముఖ్యమంత్రి కాలేక పోయారన్నారు. ఈ రాష్ట్రంలో బీసీలు 8 మంది మంత్రులుండాలని కానీ ముగ్గురే ఉన్నారని ఎత్తి చూపారు. వారికి కూడా చిన్న శాఖలు ఇచ్చారని విమర్శించారు. తెలంగాణలో బీసిని సీఎం చేస్తా అని మోదీ ప్రకటించారని... ఆయన మంత్రిమండలిలో 27 మంది OBCలు ఉన్నారని తెలిపారు.
బీజేపీ నిజాయితీని ఎవరు శంకించలేరన్నారు ఈటల. మాదిగ రిజర్వేషన్ చేస్తామని మాట ఇచ్చి అమలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ అనికొనియాడారు. ఈ బంద్కి పిలుపు ఇచ్చింది బీసీ జెఎసి అని కానీ ఇందులో అన్ని పార్టీలు పాల్గొనాల్సిన పరిస్థితి కల్పించారన్నారు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని, బీసీ బంద్ విజయవంతం కావడం తొలిసారని వివరించారు. 42 శాతం రిజర్వేషన్ల స్థానిక సంస్థల్లో మాత్రమే కాదు..
చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు వచ్చే వరకు ఆగదని తెలిపారు.
ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం జరిగింది. ఇందులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. గంటపాటు ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం చేపట్టారు. ఇక్కడ కవిత మాట్లాడుతూ... బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారని పేర్కొన్నారు. " రిజర్వేషన్లు ఇచ్చే పార్టీలే బంద్కు మద్దతు ప్రకటించటం నవ్వులాటగా ఉంది. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీ బందకు మద్దతు పేరుతో డ్రామాలు చేస్తున్నాయి. హంతకులే వచ్చి నివాళులు అర్పించినట్లు వ్యవహరిస్తున్నారు. బీసీ బిడ్డలను పదే పదే మోసం చేస్తున్నారు.స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి బీసీలను మోసం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం మాదిరిగా మరో బీసీ ఉద్యమాన్ని చేపడతాం. తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశానికి ఆదర్శంగా నిలవాలి. యూనైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో జాగృతి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. బీసీ బంద్ ను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. బీసీల రిజర్వేషన్లు అమలు చేసేలా టెక్నికల్ గా ప్రభుత్వాలు సరైన వాదనలు వినిపించటం లేదు. ఈ కారణంగానే బీసీలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తీర్పులు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రూల్స్ ప్రకారం జనగణన నిర్వహించలేదు. జీవో 9 విషయంలో కూడా కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు. అందుకే కోర్టు జీవో ను కొట్టేసింది. బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీలకు చిత్తశుద్ధి లేదు. " అని అన్నారు.
ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరగాల్సినంత తొందర ఏముందని కవిత ప్రశ్నించారు. "మహారాష్ట్ర, తమిళనాడు లో 5 ఏళ్ల వరకు ఎన్నికలు జరగలేదు. బీసీలకు రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలి. సర్పంచ్ లకు బిల్లులు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ వారిని ఇబ్బంది పెడుతోంది." బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన పార్టీలు చిత్తశుద్ధి పనిచేయాలని కవిత డిమాండ్ చేశారు.
ఇలా బీసీ సంఘాలు పిలుపునిచ్చిన బంద్లో తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీలు భాగమయ్యాయి. ఈ పార్టీల్లో అధికారంలో ఉన్న వారు కూడా ఉండటం జనాలను ఆశ్చర్యపరుస్తోంది. చట్టాలు చేసి బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బంద్లో పాల్గొనడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన వాళ్లే రోడ్డుపైకి వస్తే అసలు బంద్ ఉద్దేశం ఏంటని అయోమయంలో పడుతున్నారు.
Frequently Asked Questions
బీసీలకు 42% రిజర్వేషన్ల డిమాండ్తో తెలంగాణలో బంద్ ఎందుకు జరిగింది?
ఈ బంద్కు ఏయే రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి?
బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపునకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వంటి ప్రధాన రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి.
బంద్ కారణంగా ప్రజల జీవనం ఎలా ప్రభావితమైంది?
బంద్ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది, ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి.
రాజకీయ నాయకులు బంద్ గురించి ఏమన్నారు?
కొందరు నాయకులు కేంద్ర ప్రభుత్వంపై, మరికొందరు కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ బంద్ ఉద్యమం ఎక్కడ వరకు కొనసాగుతుందని నాయకులు అంటున్నారు?
స్థానిక సంస్థల్లోనే కాకుండా చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు వచ్చే వరకు ఈ ఉద్యమం ఆగదని నాయకులు తెలిపారు.





















