Revanth Reddy: భారత లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్.. 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
Telangana News | లైఫ్ సైన్సెస్ రంగంలో దేశంలో ఉత్పత్తయ్యే వాటిలో 40 శాతం తెలంగాణ నుంచే జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Eli Lilly Tech And Innovation centre | హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే చేసిన ప్రయత్నాల ఫలితంగానే నేడు హైదరాబాద్ ప్రపంచ స్థాయి గ్లోబల్ జీసీసీ రాజధానిగా ఎదిగిందని, నేటి ఈ కార్యక్రమమే అందుకు నిదర్శనం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ ఎకానమిగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం, 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతాం అన్నారు. ఎలీ లిల్లీ(Eli Lilly) గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది Telangana Rising 2047 దిశగా మేం వేసిన మరొక ముఖ్యమైన అడుగు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో ఈరోజు చరిత్రక మైలురాయిగా నిలిచిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధి, దృష్టికోణం, కృషి ఫలితంగా ఇది సాధ్యమైంది. ఈ విజయం సాధించడంలో అహర్నిశలు శ్రమించిన మంత్రి శ్రీధర్ బాబుకి, జయేష్ రంజన్ కి, ఇందులో పాలుపంచుకున్న అధికారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఎలీ లిల్లీ (Eli Lilly) సంస్థ నాయకత్వాన్ని, ఉద్యోగులను హైదరాబాద్ నగరానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తెలంగాణపై నమ్మకం ఉంచి, అండగా నిలిచి అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్నందుకు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, కార్పొరేషన్లకు, కంపెనీలకు ధన్యవాదాలు.
భారత లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్
ఈ రోజు ప్రారంభమైన ఎలీ లిల్లీ నూతన కేంద్రం ఆ సంస్థ గ్లోబల్ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి దోహదం చేస్తుంది. ఈ టెక్నాలజీ, ఇన్నొవేషన్ సెంటర్ ప్రపంచ వ్యాప్తంగా రోగుల సమస్య పరిష్కారాల కోసం పరిశోధనలో కీలక పాత్ర పోషించనుంది. ఎలీ లిల్లీ సంస్థను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయడమంటే ఈ సిటీ ఘనతను ప్రపంచానికి చాటి చెప్పినట్లే. హైదరాబాద్ నగరంలో టాలెంట్, లీడర్షిప్, విజన్ ఉంది. ఇక్కడ మంచి పాలసీలు, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అందుకే ఎలీ లిల్లీ లాంటి గ్లోబల్ సంస్థకు హైదరాబాద్ అనుకూలమైన కేంద్రంగా మారింది. భారత లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్ ఇప్పటికే గుర్తింపు పొందింది. ఇక్కడ 2000కు పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఉన్నాయి. 200కి పైగా అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ నుంచి తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.
తెలంగాణలోనే 40 శాతం ఉత్పత్తి
భారత్లో ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిలో తెలంగాణలోనే సుమారు 40 శాతం జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ప్రతి 3 వ్యాక్సిన్లలో ఒకటి హైదరాబాద్లో అభివృద్ధి చేయడం, లేదా తయారు కావడం రాష్ట్రానికి గర్వకారణం. హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీ, భారతదేశంలోని అతిపెద్ద లైఫ్ సైన్సెస్ పరిశోధన డెవలప్మెంట్ సముదాయంగా నిలిచింది. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ సంస్థలు హైదరాబాద్ నగరాన్ని అత్యంత ప్రాధాన్యత కలిగిన గమ్యస్థానంగా భావిస్తున్నాయి.
ఎలీ లిల్లీ సంస్థ రాకతో లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ మరో మెట్టుకు చేరుకుంది. మధుమేహం (Diabetes), ఆంకాలజీ, ఇమ్యునాలజీ, న్యూరోసైన్స్ రంగాలలో ఎలీ లిల్లీ సంస్థ చేస్తున్న కృషి గేమ్ ఛేంజర్ గా నిలిచిపోతుంది. ఆ సంస్థ కృషి మిలియన్ల మంది జీవితాలను రక్షించడానికి తోడ్పడింది. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ప్రభుత్వ పారదర్శకత విధానాలతో అభివృద్ధి, ఆవిష్కరణలకు అనువైన వాతావరణం కల్పిస్తాం. హైదరాబాద్లో పని చేయనున్న ఎలీ లిల్లీ ఉద్యోగులు.. ఇప్పుడు మా కుటుంబ సభ్యులు అయ్యారు. మీరు హైదరాబాద్ నుంచి గ్లోబల్ హెల్త్కేర్ భవిష్యత్తును తీర్చిదిద్దనున్నారు. మీ సహకారంతో, తెలంగాణను ప్రపంచంలో ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలకు నంబర్ వన్ హబ్గా తీర్చిదిద్దుతాం. కొత్త ఆవిష్కరణలు చేద్దాం, ప్రజల జీవితాలను మారుద్దామని’ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.






















