AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
Andhra Pradesh Newsw | సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అయింది. రాజధాని అభివద్ధితో పాటు పశ్చిమాసియాలో యుద్ధం వల్ల కలిగే పరిస్థితులను ఎదుర్కోవడంపై ఏపీ కేబినెట్ చర్చించనుంది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఉదయం 10.40 గంటలకు ప్రారంభమైన ఈ భేటీలో అమరావతి అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, ఇతర ప్రభుత్వ ప్రాజెక్టులు, మొత్తం 25 అజెండా అంశాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలపై చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. ప్రధానంగా సీఆర్డీఏ (CRDA) అథారిటీ తీసుకున్న పలు నిర్ణయాలకు ఈ సమావేశంలో క్యాబినెట్ ఆమోదం తెలపనుంది.
అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చ..
రాజధాని ప్రాంతంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇందులో భాగంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కార్యాలయ నిర్మాణానికి 80 సెంట్ల భూమిని, అలాగే పంచాయితీరాజ్ విభాగంలోని ఏపీఎస్ఐఆర్డీ (APSIRD) కి 5 ఎకరాల భూమిని కేటాయించనున్నారు. పరిహారంగా తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి 3 ఎకరాల స్థలాన్ని కేటాయించే ప్రతిపాదనకు ఈ కేబినెట్ భేటీలో ఆమోదం లభించనుంది.
అమరావతి నిర్మాణ పనులకు పరిపాలనా అనుమతులు..
అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసే క్రమంలో, ఏపీ సచివాలయం, హెచ్ఓడీ (HOD) టవర్ల నిర్మాణానికి సంబంధించి మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం రూ. 2,316 కోట్ల పరిపాలనా అనుమతులకు క్యాబినెట్ పచ్చజెండా ఊపే అవకాశం ఉంది. వీటితో పాటు రూ. 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి కూడా ఆమోదం తెలపనున్నారు. సమావేశం అనంతరం ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు, ఏపీపై యుద్ధ ప్రభావం, గ్యాస్ నిల్వలు, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి మంత్రులతో ప్రత్యేకంగా చర్చించనున్నారు.
























