Skill Capital of Globe: “స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ది గ్లోబ్ ’గా తెలంగాణ, సెమీ కండక్టర్ల తయారీపై యువతకు శిక్షణ: మంత్రి శ్రీధర్ బాబు
Telangana Minister Sridhar Babu | రాష్ట్రాన్ని స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ద గ్లోబ్గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

Skill Capital Of Globe | తెలంగాణను “స్కిల్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్ ’గా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న యూకేకు చెందిన సెమీ కండక్టర్ దిగ్గజ సంస్థ ఆర్మ్ హోల్డింగ్స్ సంస్థ ప్రతినిధులతో ఆయన బుధవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో భేటీ అయ్యారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, పారిశ్రామికాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాకాలను ఈ సందర్భంగా వివరించారు.
తెలంగాణకు ఉన్న ఆస్తి యువతే
‘సెమీ కండక్టర్ల తయారీ, డిజైనింగ్ లో దిగ్గజ సంస్థగా ఉన్న ఆర్మ్ హోల్డింగ్స్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించడం తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. తెలంగాణ రైజింగ్ లో భాగస్వామ్యయ్యేందుకు ముందుకొచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్. పరిశ్రమ ఏర్పాటులో అన్ని రకాలుగా అండగా ఉంటాం’ అని హామీ ఇచ్చారు. ‘తెలంగాణకు ఉన్న పెద్ద ఆస్తి యువత. వారిలో ప్రతిభకు కొదువ లేదు. కొంచెం సానబెడితే మెరికల్లా తయారవుతారు. పరిశ్రమలకు అవసరమైన రెడిమేడ్ మానవ వనరులను అందించే బాధ్యతను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది’ అని వివరించారు.
10 వేల మంది యువతకు శిక్షణ
‘సెమీ కండక్టర్ల తయారీ, డిజైనింగ్ లో ఉన్న డిమాండ్ కు అనుగుణంగా రాష్ట్ర యువతను తీర్చి దిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయాణంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలన్నది మా ఆకాంక్ష. 10వేల మంది యువత శిక్షణనిచ్చే బాధ్యతను తీసుకోవాలి’ అని సమావేశానికి హాజరైన మలేషియాకు చెందిన దిగ్గజ సంస్థ స్ర్పింగ్ సెమీ కండక్టర్స్ సీఈవో కెన్ కూను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ‘తెలంగాణను స్కిల్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్ గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం. మా వంతుగా ఇక్కడి యువతను సెమీ కండక్టర్ల తయారీ, డిజైనింగ్ లో అత్యుత్తమ మానవ వనరులుగా తీర్చి దిద్దేలా ప్రత్యేక కరిక్యులమ్ ను రూపొందిస్తాం. విద్యా సంస్థల సహకారంతో ఆరు నెలలు ఇక్కడ శిక్షణ... మిగిలిన కాలం తైవాన్, దక్షిణ కొరియా, జపాన్ తదితర దేశాల్లో ఇంటర్న్ షిప్ చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.
టీ కన్సల్ట్ సహకారంతో 2030 నాటికి 10వేల మంది యువతకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తాం’ అని కెన్ కూ... మంత్రి శ్రీధర్ బాబుకు వివరించారు. సానుకూలంగా స్పందించిన కెన్ కూ మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీ కన్సల్ట్ ఛైర్మన్ సందీప్ కుమార్ మక్తాలా, వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ మలేషియా విభాగం ప్రెసిడెంట్ మారుతీ, ఇతర ప్రతినిధులు మహేష్ నటరాజ్, వాకిటి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Also Read: తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు, ఎవరికీ ఏమిచ్చారు.. సీఎం వద్ద ఏ శాఖలున్నాయి






















