Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Temple Gold: తిరుపతి గోవిందరాజస్వామి టెంపుల్ లో బంగారం మాయం ఘటనపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. 50కేజీల బంగారం మాయం అయినట్లుగా ప్రచారం జరుగుతోంది.

Tirupati Govindarajaswamy Temple Gold: తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయ విమాన గోపురం బంగారు తాపడం పనుల్లో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గోవిందరాజ స్వామి వారి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేసే ప్రక్రియలో సుమారు 50 కిలోల బంగారం పక్కదారి పట్టిందనే ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన కీలక వ్యక్తుల ప్రమేయం ఉందనే అనుమానంతో ప్రస్తుత ప్రభుత్వం లోతైన విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
9 లేయర్లు వేయాల్సిన తాపడం 2 లేయర్లతోనే సరి !
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి విమాన గోపురానికి పురాతన వైభవం తీసుకురావడానికి, దాతల సహకారంతో బంగారు తాపడం పనులు చేపట్టారు. అయితే ఈ పనుల్లో నిబంధనలు తుంగలో తొక్కారనేది ప్రధాన ఆరోపణ. శాస్త్రోక్తంగా, సాంకేతికంగా విమాన గోపురానికి 9 పొరల్లో బంగారు తాపడం చేయాల్సి ఉంటుంది. కానీ, కేవలం 2 లేయర్లతోనే పనులను మమ అనిపించారని విజిలెన్స్ ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లుగా తెలుస్తోంది. 9 లేయర్లకు సరిపడా బంగారాన్ని లెక్కల్లో చూపించి, కేవలం 2 లేయర్లనే వాడటం ద్వారా సుమారు 50 కిలోల బంగారాన్ని దారి మళ్లించినట్లు భావిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం దీని విలువ కొన్ని 50 కోట్లపైనే ఉంటుంది.
టీటీడీ అధీనంలోని ఆలయం కావడంతో నాటి చైర్మన్ , ఈవోలపై ఆరోపణలు
ఈ పనుల పర్యవేక్షణలో అప్పటి టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి , అప్పటి ఈవో ధర్మారెడ్డి ప్రమేయం ఉందనని ఇతర పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. వీరి అండదండలతోనే అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఈ మహా పాపానికి ఒడిగట్టారని సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. గోపురానికి వాడిన బంగారం పరిమాణం ఎంత? వాస్తవానికి అక్కడ ఎంత బంగారం ఉంది? టెండర్ ప్రక్రియలో మరియు పనుల నాణ్యత తనిఖీలో జరిగిన లోపాలేమిటి? బంగారం కొనుగోలు మరియు వినియోగానికి సంబంధించిన రికార్డుల్లో ఫోర్జరీ జరిగిందా? పనుల నాణ్యతను ధృవీకరించిన ఇంజనీరింగ్ అధికారుల పాత్ర ఏమిటి? అన్న అంశాలపై దర్యాప్తు చేయనున్నారు.
రాజకీయ దుమారం రేగడం ఖాయం !
శ్రీవారి ఆస్తులకు రక్షకులుగా ఉండాల్సిన వారే, ఇలా దేవుడి బంగారాన్ని కాజేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఆర్థిక నేరం మాత్రమే కాదని, కోట్ల మంది హిందువుల సెంటిమెంట్తో ఆడుకోవడమేనని ఆగమ శాస్త్ర పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై అఓదికారికంగా వివరాలు ప్రకటిస్తే మరింత రాజకీయ దుమారం రేగే అవకాశం ఉంది.





















