Hyderabad Crime News: బీటెక్ విద్యార్థిది ప్రీ ప్లాన్ మర్డర్.. మరదలు తనకు దక్కదన్న కోపంతో హత్యకు బావ ప్లాన్
సికింద్రాబాద్ చిలకలగూడలో యువకుడు యావన్ హత్య కేసును ప్రీ ప్లాన్డ్ మర్డర్ గా తేల్చిన పోలీసులు మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు.5 రోజుల ముందే స్కెచ్ వేసి ఈ హత్య చేసినట్లు డీసీపీ వెల్లడించారు.

హైదరాబాద్: మే 7న సికింద్రాబాద్లోని చిలకలగూడలో సంచలనం సృష్టించిన యువకుడు యావన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇది పక్కా పథకం ప్రకారం జరిగిన 'ప్రీ ప్లాన్డ్ మర్డర్' అని సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి వెల్లడించారు. యువతిని పెళ్లి చేసుకోవాలని భావించిన బావ.. ఆమె ప్రేమ వ్యవహారం నచ్చక బీటెక్ విద్యార్థి హత్యకు ప్లాన్ చేశాడు. మరదలు తనకు దక్కదన్న భయంతో ఆమె ప్రియుడు యావన్ను ప్లాన్ చేసి యువతి కుటుంబ సభ్యుల సహకారంతో హత్య చేశాడని పోలీసులు తెలిపారు. 5 ప్రత్యేక బృందాలతో ఈ కేసు దర్యాప్తు చేసి మొత్తం 10 మందిని అరెస్ట్ చేయగా, వారిలో ఒకరు మైనర్ బాలుడు ఉన్నట్లు వెల్లడించారు.
మరదలు తనకు దక్కదనే కోపంతో యువకుడి హత్య..
సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. యావన్, అమ్మాయి స్కూల్ రోజుల నుంచి ఫ్రెండ్స్. ఈ క్రమంలో గత రెండేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు గతంలోనే యావన్ను హెచ్చరించారు. అయినప్పటికీ యావన్ తమ అమ్మాయి వెంట తిరుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అమ్మాయి బావ అల్లబోయిన సాయికిరణ్ ఆమెను వివాహం చేసుకోవాలని భావించాడు. కుటుంబసభ్యులు సైతం అందుకు సిద్ధంగానే ఉన్నారు. వారు వినకపోవడంతో, యువతి బావ అల్లబోయిన సాయి కిరణ్ (A1) హత్యకు ప్లాన్ వేశారు. సాయి కిరణ్ చిలకలగూడ పోలీస్ స్టేషన్లో అతడిపై గతంలో కేసులు ఉన్నాయి. యువతిని తాను పెళ్లి చేసుకోవాలని భావించిన సాయి కిరణ్, ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించారు.

అరెస్టైన నిందితుల వివరాలు
- ఏ1 సాయి కిరణ్ (అమ్మాయి బావ)
- ఏ2 రాజాం పరమేశ్(అమ్మాయి అన్న)
- ఏ3 రాజాం వంశీకృష్ణ
- ఏ4 రాజాం మనీశ్
- ఏ5 శ్రీగిరి రాహుల్
- ఏ6 కుచ్చుల శివనందన్
- ఏ7 రాజాం నరసింహ (అమ్మాయి తండ్రి)
- ఏ8 రాజాం శ్రీశైలం (అమ్మాయి బాబాయ్)
- ఏ9 రాజాం మల్లేశ్ (అమ్మాయి బాబాయి)
- ఏ10 మైనర్ బాలుడు
5 రోజుల ముందే హత్యకు ప్లాన్..
యావన్ హత్యకు ఐదు రోజుల ముందే నిందితులందరూ కలిసి రెక్కి నిర్వహించారు. మే 7 అర్ధరాత్రి యావన్ను ప్లాన్ ప్రకారం దాడి చేసి హత్య చేశారు. 16, 17 సార్లు కత్తితో పొడవగా తీవ్ర రక్తస్రావంతో అతడు చనిపోయాడు. యావన్ ఓ స్నేహితుడి ఇంటి వద్ద ఉన్నాడని తెలుసుకుని ఈ గ్యాంగ్ అక్కడికి వెళ్లి ఒక్కసారిగా యావన్పై కత్తితో దాడి చేయగా అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ కేసులో యువతి బావ, తండ్రి, బాబాయ్లు, సోదరుడు, కజిన్ బ్రదర్స్ సహా మొత్తం 9 మంది నిందితులతో పాటు ఒక మైనర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుల వద్ద నుండి ఒక కత్తి, మొబైల్ ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరికి గాంజా పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని డీసీపీ వెల్లడించారు. డ్రగ్స్ టెస్టులో ఏ5 శ్రీగిరి రాహుల్, ఏ6కుచ్చుల శివనందన్కు గంజాయి పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. నిందితుల్లో సగం మంది 21, 22 ఏళ్లలోపే వారే ఉన్నారు. చిన్న వయసులోనే యువకులు హత్య కేసుల్లో ఇరుక్కుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని.. దురలవాట్ల కారణంగానే ఇలా ప్రవర్తిస్తున్నారని డీసీసీ రక్షిత కృష్ణమూర్తి పేర్కొన్నారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు























