Hyderabad Traffic: హైదరాబాద్కు ఏమైంది? ప్రణాళిక లేని పనులతో ట్రాఫిక్ నరకం.. బయటపడేదెలా?
Urban Planning Failure: హైదరాబాద్ ట్రాఫిక్ ఉచ్చులో చిక్కుకుపోయింది. కొన్ని వారాలుగా నగరంలోని ప్రధాన కూడళ్లలో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతున్నాయి. దీనికి కారణం అధికారులకు ప్రణాళిక లేకపోవడమే.

Hyderabad Traffic Woes: హైదరాబాద్ నగరం ప్రస్తుతం ఒక భారీ నిర్మాణ ప్రాంగణంలా మారిపోయింది. ఎటు చూసినా తవ్వకాలు, ఫ్లైఓవర్లు, అండర్ పాసుల పనులతో ట్రాఫిక్ నరకం కనిపిస్తోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ నుంచి మొదలుకొని నగరం నడిబొడ్డున ఉన్న కేబీఆర్ పార్క్ వరకు ప్రతిచోటా ఒకేసారి పనులు ప్రారంభించడంతో సమస్యలే కనిపిస్తున్నాయి. కొన్ని వారాలుగా నగరంలోని ప్రధాన కూడళ్లలో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో ప్రయాణం అంటేనే వాహనదారులు వణికిపోతున్నారు. ప్రభుత్వం ఒకేసారి డజనుకు పైగా ప్రాజెక్టులను ప్రారంభించడం, సరైన ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయకపోవడం వల్ల నగరవాసులకు చుక్కలు కనిపిస్తున్నాయి. అధికారులు తమ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలన్న తొందరలో సామాన్యుల సౌకర్యాన్ని విస్మరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గచ్చిబౌలిలో గందరగోళం - IIIT జంక్షన్ ప్యాక్!
నగరానికి గుండెకాయ వంటి గచ్చిబౌలి ఐఐఐటీ జంక్షన్ వద్ద మల్టీ లెవల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ పనులు ఏప్రిల్ నుంచి ఊపందుకున్నాయి. ఈ పనుల కారణంగా దాదాపు ఏడాది పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు ప్రకటించారు. దీనివల్ల గచ్చిబౌలి స్టేడియం నుంచి విప్రో జంక్షన్ వరకు వెళ్లే దారిలో నిత్యం గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు చేరుకోవాలంటే అదనంగా గంట సమయం కేటాయించాల్సి వస్తోంది. ప్రత్యామ్నాయంగా సూచించిన నానక్రామ్గూడ, గోపనపల్లి మార్గాలు కూడా ఇరుగ్గా ఉండటంతో అక్కడ కూడా పరిస్థితి దారుణంగా మారింది.
కేబీఆర్ పార్క్ వద్ద బ్రేక్ - సుప్రీంకోర్టు జోక్యం
నగరం మధ్యలో ఉన్న ఏకైక గ్రీన్ లంగ్ కేబీఆర్ పార్క్ చుట్టూ ఆరు ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే, దీని కోసం వందలాది చెట్లను నరకడాన్ని పర్యావరణ ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎకో సెన్సిటివ్ జోన్లో చెట్ల నరికివేతను తక్షణమే ఆపాలని స్టే ఇచ్చింది. దీనివల్ల ఇక్కడ పనులు తాత్కాలికంగా నిలిచిపోయినప్పటికీ, అప్పటికే చేసిన తవ్వకాల వల్ల ట్రాఫిక్ సమస్య మరింత జటిలమైంది. పర్యావరణం, అభివృద్ధి మధ్య సమతుల్యత దెబ్బతినడం వల్లే ఈ అస్తవ్యస్త పరిస్థితి నెలకొందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఉప్పల్ నుంచి ఆరంభం
మరోవైపు నగరానికి తూర్పు ద్వారమైన ఉప్పల్ లో కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. ఫ్లైఓవర్ పనుల నిమిత్తం నేటి నుంచే అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కఠినతరం చేశారు. వరంగల్ వైపు నుంచి వచ్చే వాహనాలను మళ్లించడంతో ఇటు ఎల్బీనగర్, అటు నాచారం వైపు ఉన్న రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. పశ్చిమ వైపు గచ్చిబౌలి, తూర్పు వైపు ఉప్పల్.. ఇలా రెండు వైపులా ఒకేసారి రోడ్లను మూసివేయడం అధికారుల ప్లానింగ్ లోపానికి నిదర్శనమని నగరవాసులు మండిపడుతున్నారు. నిర్మాణ పనులు ప్రారంభించే ముందు ట్రాఫిక్ మళ్లింపు కోసం ప్రత్యామ్నాయ రోడ్లను అభివృద్ధి చేయాలి. కానీ హైదరాబాద్లో రోడ్డు సగం తవ్విన తర్వాత గానీ ట్రాఫిక్ డైవర్షన్ల గురించి ఆలోచించడం లేదు. డ్రైనేజీ పైపులు, మెట్రో పిల్లర్లు, ఫ్లైఓవర్లు.. ఇలా అన్ని పనులు ఒకేసారి మొదలుపెట్టడం వల్ల జంక్షన్ల వద్ద గందరగోళం నెలకొంటోంది. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో ఈ తవ్వకాలు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. గుంతలు పడిన రోడ్లు, అసంపూర్తి పనులు వర్షపు నీటితో నిండితే పరిస్థితి ఊహకందని విధంగా ఉంటుందని వాహనదారులు భయపడుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యమా? సమన్వయ లోపమా?
జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్ , వాటర్ బోర్డు అధికారుల మధ్య సరైన సమన్వయం లేకపోవడమే ఈ సమస్యకు మూల కారణమని స్పష్టమవుతోంది. అభివృద్ధి వద్దు అని మేము అనడం లేదు, కానీ ఒక పద్ధతి ప్రకారం పనులు చేయాలి. నగరం మొత్తాన్ని ఒకేసారి తవ్వేస్తే మేము ఎటు వెళ్లాలి అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన అయినా సరే ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నగరవాసులు కోరుకుంటున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















