BRS Politics: జగిత్యాల కేసీఆర్ సభ సమయంలోనే డిల్లీకి హరీష్ - కాంగ్రెస్ మైండ్ గేమ్ షురూ !
Harish Rao: కేసీఆర్ సభ వకు వెళ్లకుండా హరీష్ రావు ఢిల్లీకి వెళ్లడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్లో ముసలం ప్రారంభమయిందని కాంగ్రెస్ నేతలంటున్నారు.

Harish Rao Delhi tour hot topic: జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ సభకు పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావు హాజరు కావడం లేదు. ఆయనతో పాటు వద్దిరాజు రవిచంద్ర, బోయినపల్లి వినోద్ కుమార్ కూడా ఢిల్లీ వెళ్లారు. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ తన మైండ్ గేమ్ కు అస్త్రంగా మలుచుకుంది. ముఖ్యంగా మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరుతున్న తరుణంలో, ఆ నిర్ణయం నచ్చకే హరీష్ రావు సభను స్కిప్ చేసి హస్తిన బాట పట్టారని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు.
ఈ పరిణామంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి . బీఆర్ఎస్లో అసమ్మతి జ్వాలలు మొదలయ్యాయని, పార్టీలో ముసలం పుట్టిందని వ్యాఖ్యానించారు. హరీష్ రావు లేని కేసీఆర్ సభను ఊహించలేమని, ఆయన ఢిల్లీ పర్యటన వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉందని పేర్కొన్నారు. జీవన్ రెడ్డి రాకను హరీష్ రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, బీఆర్ఎస్ ఒక మునిగిపోయే పడవ అని ఎద్దేవా చేశారు. ఆయన త్వరలోనే తన భవిష్యత్తు ప్రణాళికను వెల్లడిస్తారని జోస్యం చెప్పారు.
జగిత్యాల ఎమ్మెల్యే సైతం ఇదే తరహాలో స్పందించారు. హరీష్ రావు గైర్హాజరు వెనుక బిజెపి అగ్రనేతలతో మంతనాల కోణాన్ని తెరపైకి తెచ్చారు. జీవన్ రెడ్డి చేరికతో పార్టీలో చీలిక వచ్చే ప్రమాదం ఉందని, హరీష్ రావు వెంట మరికొందరు ఎమ్మెల్యేలు వెళ్లే అవకాశం ఉందంటూ కాంగ్రెస్ శ్రేణులు మైండ్ గేమ్ ఆడుతున్నాయి. కేసీఆర్ ఏడాది తర్వాత నిర్వహిస్తున్న కీలక సభ కంటే ఢిల్లీ వెళ్లడమే ముఖ్యమా అని వారు ప్రశ్నిస్తున్నారు.
బిఆర్ఎస్ పార్టీలో...
— Congress for Telangana (@Congress4TS) April 20, 2026
ముసలం మొదలయింది...
హరీష్ రావు ఢిల్లీ టూర్ పై ఎంపీ చామల కిరణ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
*జీవన్ రెడ్డి పార్టీలో చేరడం బిఆర్ఎస్ నేతలకు ఇష్టం లేదు
*జీవన్ రెడ్డిని ఎప్పుడూ హరీష్ రావు పార్టీలోకి ఆహ్వానించలేదు
*కేటీఆర్ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు హరీష్ రావు… pic.twitter.com/3QHtnAP38p
ఈ విమర్శలను బీఆర్ఎస్ వర్గాలు తీవ్రంగా కొట్టిపారేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ , ఎమ్మెల్యేల అనర్హత వేటు వంటి కీలక న్యాయపరమైన అంశాలపై సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చించేందుకే వారు ఢిల్లీ వెళ్లారని స్పష్టం చేశారు. ఏప్రిల్ 22న హైకోర్టు తీర్పు రానున్నందున, ముందస్తుగా చట్టపరమైన వ్యూహాలు రచించడమే ఈ పర్యటన ఉద్దేశమని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పసలేని ఆరోపణలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని వారు మండిపడ్డారు.
ఒకవైపు జగిత్యాలలో కేసీఆర్ తన సభ ద్వారా పార్టీ కేడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు హరీష్ రావు ఢిల్లీ పర్యటన చుట్టూ జరుగుతున్న ప్రచారం బీఆర్ఎస్కు కొంత ఇబ్బందికరంగా మారింది. ఇది నిజంగానే న్యాయపరమైన పర్యటననా లేక కాంగ్రెస్ అంటున్నట్లుగా గులాబీ గూటిలో ఏదైనా రాజకీయ మార్పులకు సంకేతమా అన్నది వేచి చూడాలి.
ట్రెండింగ్ వార్తలు






















