YS Jagan: పదవి లేకపోతే వైఎస్ జగన్ జాతీయపతాకం ఆవిష్కరించరా? - రాజ్యాంగ వేడుకలకు ఎందుకు దూరంగా ఉంటారు?
YSRCP: వైఎస్ జగన్ ఓడిపోయాక జాతీయపతాకావిష్కరణ చేయకపోవడంపై విమర్శలువస్తున్నాయి. ఈ రిపబ్లిక్ డే వేడుకల్లోనూ ఆయన కనిపించలేదు.

YS Jagan is facing criticism for not unfurling the national flag: రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నప్పుడు ఆ వ్యవస్థల పట్ల ప్రదర్శించే గౌరవం ఒక నాయకుడి పరిణతిని తెలియజేస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా జాతీయ పండుగలు, అసెంబ్లీ సమావేశాల పట్ల ఆయన అనుసరిస్తున్న వైఖరి రాజకీయ విశ్లేషకుల్లోనే కాక, సామాన్య ప్రజల్లో కూడా విస్మయాన్ని కలిగిస్తోంది.
జాతీయ స్ఫూర్తికి దూరంగా వైసీపీ అధినేత
సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడైనా రాజ్యాంగపరమైనజాతీయ పండుగలను ఒక పవిత్ర కార్యంగా భావిస్తారు. అధికారంలో ఉన్నా లేకున్నా, పార్టీ కార్యాలయంలోనో లేదా తన నివాసంలోనో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం ఒక సంప్రదాయం. అయితే, జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా స్వతంత్ర , గణతంత్ర దినోత్సవ వేడుకలకు దూరంగా ఉంటున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. 2025 ,ప్రస్తుత 2026 గణతంత్ర దినోత్సవ వేడుకల సమయంలో కూడా ఆయన బహిరంగంగా జెండా ఎగురవేసిన దాఖలాలు లేకపోవడం, కేవలం సోషల్ మీడియా సందేశాలకే పరిమితమవ్వడం ఆయన జాతీయతా భావం పై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
రాజ్యాంగ వ్యవస్థల పట్ల ఉదాసీనత
రాజ్యాంగం కల్పించిన హక్కులతో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడు, అదే రాజ్యాంగం నిర్దేశించిన విధులను పాటించడంలో విఫలమవుతున్నారనే వాదన వినిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అనేది ప్రజల గొంతుక. ఎన్నికల్లో గెలిచిన ప్రతి ఎమ్మెల్యేకు సభకు హాజరై ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ, తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే కారణంతో జగన్ అసెంబ్లీని బహిష్కరించడం, రాజ్యాంగబద్ధమైన బాధ్యత కంటే రాజకీయ హోదాకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని సూచిస్తోంది.
హోదా ఉంటేనే గౌరవమా?
"హోదా ఉంటేనే వస్తాను.. లేకపోతే రాను" అనే మొండి వైఖరి ఒక బాధ్యతాయుతమైన నాయకుడికి తగదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీని బహిష్కరించిన సందర్భం ఉన్నప్పటికీ, అది ఒక శపథం రూపంలో జరిగింది. కానీ జగన్ విషయంలో, కేవలం మాట్లాడేందుకు తగిన సమయం దొరకదనే సాకుతో సభకు రాకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శలు వస్తున్నాయి. కేవలం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే రాజ్యాంగ విలువలు గుర్తుకు వస్తాయా? అనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తోంది. ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది కేవలం ముఖ్యమంత్రిగా చూడటానికే కాదు, ఓడిపోతే ప్రతిపక్షంలో ఉండి పోరాడటానికి కూడా. 11 మంది ఎమ్మెల్యేలతోనైనా సభలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఆ వేదికను వదిలేసి రోడ్లపై పోరాడతామనడం లేదా మీడియా ముందుకు రావడం ప్రజలు ఇచ్చిన తీర్పును అగౌరవపరచడమే అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
నైతికతపై ప్రశ్నలు
రాజ్యాంగం ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్న ఒక నాయకుడు, అదే రాజ్యాంగ చిహ్నాలైన జాతీయ జెండా, అసెంబ్లీ పట్ల ఇంత ఉదాసీనంగా ఉండటం ప్రజల్లో తప్పుడు సంకేతాలను పంపుతోంది. ఒక పార్టీ అధ్యక్షుడిగా తన కార్యకర్తలకు ఆయన ఏం సందేశం ఇస్తున్నారు? వ్యవస్థల పట్ల గౌరవం లేని నాయకత్వం భవిష్యత్తులో ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతుంది? అనే చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. వైఎస్ జగన్ ఈ విషయంలో ప్రజాకోణంలో ఆలోచించాలన్న అభిప్రాయం వినిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















