Tiger In Eluru Agency: ఏలూరులో ఏజెన్సీ ప్రాంతాలను హడలెత్తిస్తున్న పులి.. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణుకు!
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో పులి సంచారం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. రైతులు పోలాలకు వెళ్లడం లేదని, త్వరగా పులిని పట్టుకోవాలని కోరారు.

బుట్టాయగూడెం: తెలంగాణలోని కావడిగుడ్ల ప్రాంతం నుండి ఏపీలోకి ప్రవేశించిన ఒక పెద్ద పులి, గత నాలుగు రోజులుగా ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లోని ఏజెన్సీ గ్రామాలను వణికిస్తోంది. పందిరిమామిడిగూడెం, ఇనుమూరు, గాడిదబోరు, అంతర్వేదిగూడెం వంటి ప్రాంతాల్లో సంచరిస్తూ ఇప్పటికే కొన్ని పశువులపై దాడి చేసిన ఈ పులి, తాజాగా కన్నాపురం ఫారెస్ట్ పరిధిలోని బిలిమిల్లి గ్రామంలో మరో రెండు పశువులను హతమార్చింది. దాంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పొలాలకు వెళ్లడానికి కూడా రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ పనికి వెళ్లడం లేదని, పులిని త్వరగా పట్టుకోవాలని అటవీశాఖ అధికారులను కోరారు.
కొయ్యలగూడెం, బుట్టాయగూడెం పరిసర ప్రాంతాలవారు సాయంత్రం తరువాత ఒంటరిగా తిరగవద్దని, పొలాలకు కూడా వెళ్లవద్దని కన్నాపురం రేంజ్ అధికారి భానుప్రకాశ్, ఎమ్మార్వో నాగరాజు, సబ్ డీఎఫ్ఓ వెంకట సుబ్బయ్య ప్రజలను హెచ్చరించారు. ఈ క్రమంలోనే దిప్పకాయలపాడు - బిలిమిల్లి మధ్య రోడ్డు పక్కన ఉన్న మొక్కజొన్న తోటలో పులి కదలికలు డ్రోన్ కెమెరాకు చిక్కాయి. కెమెరా అలజడికి పులి పరుగులు తీయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

పులి సంచారం దృష్ట్యా అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి ఆచూకీని నిరంతరం పర్యవేక్షించేందుకు 19 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడమే కాకుండా, దానిని బంధించేందుకు రెండు బోనులను కూడా సిద్ధం చేశారు. రాత్రి వేళల్లో పులి సుమారు 15 కిలోమీటర్ల మేర ప్రయాణించే అవకాశం ఉందని, అది కరగపాడు, కొవ్వాడ మీదుగా నేషనల్ పార్కులోకి ప్రవేశించవచ్చని డీఎఫ్వో పి.వి. సందీప్రెడ్డి అంచనా వేశారు. ఈ లోపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరోవైపు, పులి ఆవాస ప్రాంతాలకు చేరువలో ఉండటంతో అధికారులు ప్రజలను హెచ్చరించారు. సబ్ డీఎఫ్వో వెంకట సుబ్బయ్య, తహసీల్దారు నాగరాజు ఆధ్వర్యంలో గ్రామాల్లో టాంటాం వేయించి, ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని, పొలాలకు వెళ్లవద్దని సూచించారు. బుట్టాయగూడెం-కన్నాపురం మార్గంలో పులి రహదారి దాటుతుండగా కారు యజమానులు గమనించినట్లు సమాచారం అందడంతో, ఆ పరిసర ప్రాంత వాసులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

ట్రాప్ కెమెరా కదలికలతో బెదిరిపోయిన పులి
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో బిల్లిమిల్లిలో పెద్ద పులి సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దిప్పకాయలపాడు, బిల్లిమిల్లి మధ్యలో రోడ్డు పక్కన తోటలో డ్రోన్ కెమెరాకు చిక్కిన పులి చిక్కింది. అయితే కెమెరా అలజడికి భయపడిన పులి అక్కడినుంచి పరుగులు తీసినట్లు అధికారులు గుర్తించారు. చుట్టుపక్కల ప్రాంతాలవారు పులి ఎప్పుడు తమపై దాడి చేస్తుందేమోనని భయంతో వణికిపోతున్నారు.
ట్రెండింగ్ వార్తలు























