Anantapur Success Story: మన్కీ బాత్లో మోదీ చెప్పిన అనంతపురం జల విజయం - పూర్తి వివరాలు ఇవే
Mann Ki Baat: అనంతపురం జిల్లా సాధించిన విజాయాన్ని ప్రధాని మోదీ మన్ కీ బాత్లో అందరికీ చెప్పారు. ఈ విజయం కోసం ప్రజలు ఎంతో శ్రమించారు.

Anantapur water victory mentioned by Modi in Mann Ki Baat : ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా ప్రజల పట్టుదలను, వారు సాధించిన అద్భుత విజయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కరువు కాటకాలకు నిలయంగా భావించే అనంతపురం జిల్లాలో, ప్రకృతి సవాళ్లను ఎదురించి స్థానిక ప్రజలు సాధించిన పర్యావరణ, ఆర్థిక విప్లవం గురించి ఆయన వివరించారు. అసలు అనంతపురంలో సాధించిన విజయాలేంటి?
అనంతపురం అంటేనే తక్కువ వర్షపాతం, ఎండిపోయిన భూములు గుర్తొస్తాయి. కానీ, గత కొన్ని ఏళ్లుగా అక్కడి రైతులు , మహిళా సంఘాలు కలిసి ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేశారు. రసాయన ఎరువులు లేకుండా, తక్కువ నీటితోనే అధిక దిగుబడి సాధించే పద్ధతులను అవలంబించి, జిల్లా రూపురేఖలను మార్చేశారు. ఈ సామూహిక కృషి వల్ల భూగర్భ జల మట్టం పెరగడమే కాకుండా, బంజరు భూములు సైతం పచ్చని తోటలుగా మారడాన్ని మోదీ కొనియాడారు.
ముఖ్యంగా ఈ విజయగాథలో మహిళల పాత్ర ను ప్రధాని హైలైట్ చేశారు. అనంతపురంలోని వేలమంది మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా ఏకమై, విత్తన బ్యాంకుల ఏర్పాటు నుండి పండించిన పంటలను మార్కెటింగ్ చేసే వరకు అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వీరు కేవలం వ్యవసాయం చేయడమే కాకుండా, డ్రోన్ దీదీ లుగా మారి పొలాలకు ప్రకృతి కషాయాలు చల్లడం వంటి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం విశేషం.
అనంతపురం రైతులు సాధించిన మరో పెద్ద విజయం పండ్ల తోటల సాగు . ఒకప్పుడు కేవలం వేరుశనగ మీద ఆధారపడిన ఈ ప్రాంతం, ఇప్పుడు దేశానికే ఫ్రూట్ బౌల్ గా మారుతోంది. ఇక్కడి నుండి అరటి, దానిమ్మ, ,ద్రాక్ష వంటి పండ్లు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. నీటి కొరత ఉన్నప్పటికీ బిందు సేద్యం ద్వారా ప్రతి చుక్కను వాడుకుంటూ వారు సాధిస్తున్న ఆర్థికాభివృద్ధిని మోదీ స్ఫూర్తిదాయకంగా అభివర్ణించారు.
జిల్లాలోని కొన్ని గ్రామాల్లో చెరువుల పునరుద్ధరణ, వర్షపు నీటి నిల్వ కోసం చేపట్టిన పనుల వల్ల సాగు విస్తీర్ణం పెరిగింది. ఇది కేవలం ఒక వ్యక్తి సాధించిన విజయం కాదని, జిల్లాలోని ప్రతి పౌరుడు పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావడం వల్ల సాధ్యమైందని ప్రధాని పేర్కొన్నారు. కరువును జయించి, వినూత్న పద్ధతులతో దేశానికి ఆదర్శంగా నిలిచిన అనంతపురం ప్రజల స్ఫూర్తిని ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.
అనంతపురం విజయగాథ అనేది నిరాశలో ఉన్నవారికి ఆశను కల్పించే ఒక ఉదాహరణ. కఠినమైన భౌగోళిక పరిస్థితులు ఉన్నప్పటికీ, సరైన సంకల్పం , ప్రభుత్వ పథకాలు పీఎం కిసాన్, డ్రిప్ ఇరిగేషన్ వంటివి అండ ఉంటే అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని ఈ జిల్లా ప్రజలు నిరూపించారు. అందుకే 'మన్ కీ బాత్' వేదికగా వారిని అభినందించడం ద్వారా ఈ సక్సెస్ స్టోరీని దేశవ్యాప్తం చేశారు ప్రధాని మోదీ.























