YSRCP: ప్రతిపక్ష పాత్రలో వైసీపీ క్రెడిట్ రాజకీయం - వ్యూహం మారుతుందా.. పతనం కొనసాగుతుందా?
credit Politics: క్రెడిట్ కోసం వైసీపీ ఆరాటపడటం ప్రతిపక్ష పాత్ర నిర్వహించడం అని వైసీపీ అనుకుంటోంది. ప్రజా సమస్యలపై పోరాటం కన్నా ఎక్కడేం జరిగినా మా వల్లే అనుకునే ప్రచారం చేసుకుంటోంది.

YSRCP Opposition Strategy: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తున్న తీరు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై పోరాడటం కంటే, ప్రతి చిన్న విజయానికి తమకూ సంబంధం ఉందంటూ క్రెడిట్ వెతుక్కోవడమే ఆ పార్టీకి ప్రధాన అజెండాగా మారినట్లు కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చే పెట్టుబడుల నుండి పక్క రాష్ట్రంలో విజయ్ సాధించిన విజయం వరకు.. అంతా తమ వల్లే జరిగిందని చెప్పుకోవడం ఇప్పుడు ఆ పార్టీని నాన్ సీరియస్గా మారుస్తోంది.
విజయ్ గెలుపుపై జగన్ మార్కు ప్రచారం!
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభంజనం సృష్టించగా, ఆ విజయంలో తమ పాత్ర ఉందంటూ వైసీపీ శ్రేణులు చేస్తున్న హడావిడి సామాన్యులకు సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎన్నికల సమయంలో డీఎంకేకు మద్దతుగా నిలిచిన వైసీపీ నేతలు, ఇప్పుడు విజయ్ ఫోటో పట్టుకుని ప్రచారం చేయడం వారి ద్వంద్వ విధానాలకు అద్దం పడుతోందనిఅంటున్నారు. విజయ్ మా జగన్ అన్నను చూసే రాజకీయాల్లోకి వచ్చారు.. ఆయనలాగే ఒంటరిగా గెలిచారు అంటూ రోజా వంటి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు నెటిజన్ల ట్రోలింగ్కు ప్రధాన కారణమవుతున్నాయి.
ప్రతిపక్ష బాధ్యతను విస్మరిస్తున్నారా?
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ, కనీసం అక్కడ కూడా ప్రజల పక్షాన నిలబడటంలో విఫలమవుతోందనే విమర్శలు ఉన్నాయి. సభకు హాజరై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం కంటే, బయట ఉండి సోషల్ మీడియాలో క్రెడిట్ వార్లు చేయడం వల్ల ఆ పార్టీకి ఒరిగేదేమీ లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ పెట్టుబడులపై మేము గతంలో ఎంఓయూలు చేసుకున్నాం కాబట్టే ఇవి వచ్చాయి అని చెప్పుకోవడం కంటే, ప్రస్తుత పాలనలో లోపాలను ప్రశ్నించే బాధ్యతను పార్టీ విస్మరిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రెండేళ్ల గడువు.. పునరాలోచన తప్పనిసరి!
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో, ఇప్పటికైనా వైసీపీ తన గతాన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నఅభిప్రాయం వినిపిస్తోంది. కేవలం పాత పథకాల గురించి లేదా పక్క రాష్ట్రాల విజయాల గురించి కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల్లో స్థైర్యం నింపేలా కొత్త వ్యూహాలను ఖరారు చేసుకోవాలి. వై నాట్ 175 అన్న అతివిశ్వాసం నుండి బయటపడి, క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండకపోతే పార్టీ మనుగడ మరింత కష్టమయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన క్యాడర్లో వినిపిస్తోంది.
ట్రాక్లోకి రావాలంటే ఏం చేయాలి?
వైసీపీ మళ్లీ ప్రజల నమ్మకాన్ని గెలవాలంటే ఇతర విజయాల క్రెడిట్ కోసం పాకులాడటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. పార్టీ క్యాడర్ను పునర్నిర్మించడంపై దృష్టి పెట్టాలి. కేవలం బ్లేమ్ గేమ్, క్రెడిట్ గేమ్ ఆడటం వల్ల ప్రజలకు ఆ పార్టీపై ఉన్న గౌరవం మరింత తగ్గుతుందే తప్ప పెరగదు. భవిష్యత్తులోనైనా ప్రతిపక్ష హోదాకు తగ్గట్టుగా బాధ్యతాయుతమైన రాజకీయాలు చేస్తేనే వైసీపీ మళ్లీ రేసులోకి వచ్చే అవకాశం ఉంటుందని ఎక్కువ మంది భావిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు




















