BRS YSRCP Silent on BJP Centre: జాతీయ అంశాలపై రీజినల్ పార్టీల సైలెంట్ రాజకీయం! BRS, YSRCP మౌనం వెనుక మర్మమేంటి?
NEET Paper Leak Telugu Politics: నీట్ పేరుతో అంది వచ్చిన అవకాశాల్ని వినియోగించుకోవడంలో బీఆర్ఎస్, వైసీపీ విఫలమవుతున్నాయి. బీజేపీపై ఎటాక్కు సిద్ధంగా లేవు.

Telangana Opposition Strategy 2026: దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ, కేంద్ర ప్రభుత్వ విద్యారంగ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు మిన్నంటుతున్నా, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతీయ పార్టీలు బీఆర్ఎస్ , వైఎస్సార్సీపీ అనూహ్యంగా మౌనం వహించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ , వివిధ విద్యార్థి సంఘాలు రోడ్లెక్కి ఆందోళనలు నిర్వహిస్తున్నప్పటికీ, ఈ రెండు ప్రాంతీయ పార్టీలు మాత్రం క్రియాశీలక పోరాటాలకు దూరంగా ఉంటున్నాయి. యువత , విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశంపై ఈ రెండు పార్టీల మౌనం రాజకీయంగా పలు అనుమానాలకు తావిస్తోంది.
విపక్షంలో ఉన్న పార్టీలకు మంచి అవకాశం
సాధారణంగా ప్రతిపక్షాలకు యువత, విద్యార్థి వర్గాల మద్దతును పొందేందుకు ఇలాంటి జాతీయ స్థాయి వివాదాలు ఒక పెద్ద ఆయుధంగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా బీజేపీ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రాంతీయ పార్టీలు ముందంజలో ఉండాలి. కానీ, తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ రెండూ కూడా జాతీయ స్థాయిలో విపక్షాల కూటమి పిలుపునిచ్చిన నిరసనలకు భౌతికంగా, ఉధృతంగా మద్దతు తెలపకపోవడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహంతో పాటు కేంద్రం పట్ల ఉన్న భయాందోళనలే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందిగ్ధ పరిస్థితికి ప్రధాన కారణం కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నాయకత్వం పట్ల ఈ పార్టీలకున్న వినూత్నమైన అభద్రత. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గత లోక్సభ ఎన్నికల తర్వాత, అసెంబ్లీ ఓటమి అనంతరం తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు బీజేపీతో అనధికారికంగా ఒక వ్యూహాత్మక శాంతి ని పాటిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్రాన్ని లేదా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులను నేరుగా టార్గెట్ చేస్తే టీఎంసీ లాంటి పరిస్థితులు రావొచ్చని సందేహిస్తున్నారు.
అటు ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలో ఉంది. గత ఐదేళ్ల పాలనపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం పలు విచారణలకు ఆదేశిస్తున్న తరుణంలో, కేంద్రంలోని బీజేపీ పెద్దల ఆగ్రహానికి గురైతే పార్టీ మరింత తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ భావిస్తోంది. అందువల్లనే, కేంద్ర విద్యాశాఖ , మోదీ ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో వైఎస్సార్సీపీ చాలా అప్రమత్తంగా, పరిమిత వ్యాఖ్యలకే పరిమితమవుతూ, వీధుల్లోకి వచ్చి పోరాడేందుకు వెనుకాడుతోంది. విద్యార్థుల భవిష్యత్తు ఎటుపోయినా పర్వాలేదు కానీ, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు మాత్రం కేంద్రాన్ని ప్రశ్నించరు అంటూ రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తుండటంతో, బీఆర్ఎస్ డిఫెన్స్లో పడిపోతోంది. తమ స్వయంకృత అపరాధాల వల్ల వచ్చిన కేసుల భయంతోనే బీఆర్ఎస్ నోరు మెదపడం లేదని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అందుకే మొక్కుబడిగా జంతర్, మంతర్ దగ్గర బీఆర్ఎస్వీతో నిరసనలు చేయిస్తామని ప్రకటించారు.
దీర్ఘ రాజకీయంలో నష్టమే
సుదీర్ఘ కాలంలో ఈ తరహా మౌనం ప్రాంతీయ పార్టీలకు పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది. రాబోయే కాలంలో నిరుద్యోగిత, విద్యార్థుల సమస్యలు, రిక్రూట్మెంట్లు ప్రధాన రాజకీయ అంశాలుగా మారబోతున్న తరుణంలో, యువతకు అండగా నిలవాల్సిన ప్రతిపక్షాలు వెనుకడుగు వేస్తున్నాయి. ఇది కాంగ్రెస్కు విద్యార్థి, యువజన ఓటు బ్యాంకును మరింత బదిలీ చేసేందుకు దోహదపడుతోంది. కేంద్రంలోని బీజేపీ అగ్రనాయకత్వం పట్ల ఉన్న భయం, రాజకీయంగా వ్యూహాత్మకంగా సైలెంట్గా ఉండాలనే నిర్ణయం వల్లనే బీఆర్ఎస్, వైఎస్సార్సీపీలు జాతీయ స్థాయి ఆందోళనలకు దూరంగా ఉంటున్నాయి. ఈ వ్యూహం ప్రస్తుతానికి తమపై కేంద్ర సంస్థల దాడులు పడకుండా కాపాడుకోవడానికి ఉపయోగపడవచ్చు ఏమో కానీ, క్షేత్రస్థాయిలో విద్యార్థులను, యువత మద్దతు కోల్పోయే ప్రమాదాన్ని ఈ ప్రాంతీయ పార్టీలు స్వయంగా తెచ్చిపెట్టుకుంటున్నాయని ఎక్కువ మంది భావిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















