KTR: కేటీఆర్ సెల్ఫ్ ట్రాప్ - కార్యకర్తలకు హితబోధ చేసి స్వయంగా తిట్ల పురాణం- బీఆర్ఎస్ ఎజెండా దారి తప్పిందా?
BRS : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుసరించిన వ్యూహం దారి తప్పినట్లుగా కనిపిస్తోంది. రేవంత్ ట్రాప్ లో పడొద్దని చెప్పి ..తానే పడ్డారు.

KTR fell into Revanth trap: శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు అన్న సామెత ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ తీరుకు అద్దం పడుతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచార ప్రారంభంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ.. రేవంత్ విసిరే ట్రాప్ లో పడొద్దని, కేవలం ప్రజా సమస్యలపైనే దృష్టి సారించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కానీ, ప్రచారం చివరి దశకు వచ్చేసరికి ఆయనే స్వయంగా నియంత్రణ కోల్పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు, తిట్లతో విరుచుకుపడటం చర్చనీయాంశంగా మారింది. కార్యకర్తలకు శాంతి వచనాలు చెప్పి, తానే ఆవేశంతో ఊగిపోవడం బీఆర్ఎస్ వ్యూహకర్తలనే విస్మయానికి గురిచేసింది.
మున్సిపల్ ఎన్నికల ఎజెండా మార్చేసిన రేవంత్
సాధారణంగా మున్సిపల్ ఎన్నిలు అంటే లోకల్ ప్రాబ్లమ్స్ హైలెట్ అవుతాయి. కానీ మున్సిపల్ ఎన్నికల ఎజెండాను రాజకీయాల వైపు మళ్లించడంలో సీఎం రేవంత్ రెడ్డి సఫలమయ్యారు. కేసీఆర్ జాతిపిత అంశంపై ఆయన చేసిన ఘాటు విమర్శలు బీఆర్ఎస్ శ్రేణులను రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఇది పక్కాగా రేవంత్ విసిరిన ట్రాప్ అని గ్రహించిన కేటీఆర్, మొదట సంయమనం పాటించాలని పార్టీ శ్రేణులకు లేఖ రాశారు. కానీ, రేవంత్ దూకుడు పెంచేసరికి కేటీఆర్ సహనం నశించింది. తిట్లకు తిట్లతోనే సమాధానం చెప్పాలన్నట్లుగా ఆయన వ్యవహరించడంతో, మున్సిపల్ ఎన్నికల ఎజెండా ప్రజా సమస్యల నుంచి వ్యక్తిగత దూషణల వైపు మళ్లిపోయింది.
మిస్ అయిన ప్రజా వ్యతిరేక ఓటు ?
మున్సిపల్ ఎన్నికల్లో సాధారణంగా స్థానిక సమస్యలు, పాలక పక్షంపై ఉండే వ్యతిరేకత ప్రధాన పాత్ర పోషిస్తాయి. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి అంశాలపై బీఆర్ఎస్ గట్టిగా నిలదీసి ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆ పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉండేది. కానీ, కేటీఆర్ ఎప్పుడైతే వ్యక్తిగత తిట్ల పురాణం అందుకున్నారో, అప్పుడు చర్చ అంతా ఎవరు ఎవరిని ఏమన్నారు అన్న దానిపైనే సాగింది. దీనివల్ల అసలైన ప్రజా సమస్యలు పక్కకు వెళ్లిపోయి, రాజకీయం అంతా భావోద్వేగాల చుట్టూ తిరిగింది. ఇది పరోక్షంగా ప్రభుత్వానికి మేలు చేసే అంశమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
సైడ్ ట్రాక్ లోకి బీఆర్ఎస్
ప్రతిపక్షంగా బీఆర్ఎస్ గత పదేళ్ల అభివృద్ధిని, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన కీలక సమయంలో సెల్ఫ్ ట్రాప్ లో పడిపోయినట్లు అయింది. రేవంత్ విసిరిన పొలిటికల్ గాలానికి చిక్కి కేటీఆర్ తన సహజమైన శైలిని పక్కనపెట్టి దూషణలకు దిగడం వల్ల పార్టీ కేడర్లో కొంత ఉత్సాహం వచ్చినట్లు కనిపించినా, తటస్థ ఓటర్లలో మాత్రం ప్రతికూలత వచ్చే ప్రమాదం ఉంది. ప్రజా సమస్యలను ఎజెండాగా మార్చడంలో విఫలమవ్వడం వల్ల బీఆర్ఎస్ ఒక మంచి రాజకీయ అవకాశాన్ని చేజార్చుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడే ఫలితాల్లో ప్రజా సమస్యల ప్రభావం కంటే ఈ తిట్ల పురాణం ప్రభావమే ఎక్కువగా ఉంటే, దానికి బీఆర్ఎస్ వ్యూహాత్మక లోపమే కారణం అవుతుంది. ప్రత్యర్థి సెట్ చేసిన ఎజెండాలో చిక్కుకుపోవడం బీఆర్ఎస్ చేసిన అతిపెద్ద పొలిటికల్ బ్లండర్ అవుతుంది.























