ఎన్నికల కోసం 55 చెక్ పోస్టులు, 181 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ పనిచేస్తున్నాయి. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
Telangana Municipal Elections 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు భారీ భద్రత! 15రోజుల క్రితమే రంగంలోకి దిగిన ఫ్లైయింగ్ స్క్వాడ్స్: డీజీపీ
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్దమైంది. రాష్ట్రవ్యాప్తంగా 8వేలకుపైగా పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు

Telangana Municipal Elections 2026: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోరులో ఆఖరి ఘట్టం పోలింగ్కు సర్వం సిద్దమైంది. మహారాష్ట్ర , కర్ణాటక వంటి సరిహద్దు రాష్ట్రాల్లో బోర్డర్ చెక్ పోస్టులు కూడా అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో 55 చెక్ పోస్టులు పని చేస్తున్నాయి. 181 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ కూడా పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఎస్ హెచ్ ఓలకు ఎన్నికల నిర్వహణకు ట్రైనింగ్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకూ తెలంగాణ వ్యాప్తంగా నిబంధనలకు విరుద్దంగా తరలిస్తుండగా గత 15రోజుల్లో 3 కోట్లకుపైగా విలువైన డబ్బు , మద్యం, డ్రగ్స్ చెక్ పోస్టుల వద్ద సీజ్ చేశారు. ఇందులో ఒక కోటి 29 లక్షల రూపాయల నగదు, 1.21కోట్ల విలువైన మద్యం, 15.7 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 1183 వెపన్ లైసెన్స్లను డిపాజిట్ చేసుకున్నారు. 4318 మందిని బైండోవర్ చేయగా వీరిలో 2950 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. 398 నాన్ బెయిలబుల్ వారెంట్లు ఎగ్జిక్యూట్ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు 142 కేసులు నమోదు చేశారు.
అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలే టార్గెట్..
తెలంగాణవ్యాప్తంగా మొత్తం 8203 పోలింగ్ స్టేషన్లలో 1302 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. 1926 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా, 4975 పోలింగ్ కేంద్రాలను సాధారణ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేయడంతోపాటు ఫ్లైయింగ్ స్క్వాడ్ను అందుబాటులో ఉంచారు. మిగతా పోలింగ్ కేంద్రాల వద్ద ఎంతవరకు పోలీసు బలగాలు అవసరమో, అంతే స్థాయిలో తగిన కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ఫారెస్ట్ , ఎక్సైజ్, లీగల్ వివిధ శాఖలతోపాటు సీఐడీ, ఏసీబీ ఇలా వివిధ శాఖల సమన్వయంతో పనిచేస్తున్నట్టు డీజీపీ తెలిపారు.
ఈసారి పోలింగ్ కేంద్రాల బయట సైతం మూడో కన్ను నిఘా..
తెలంగాణ వ్యాప్తంగా 2996 వార్డుల్లో ఈనెల 11వ తేదీన పోలింగ్ జరగబోతోంది. మొత్తం 52లక్షల 43వేల 221 మంది ఓటర్ల మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణలో వచ్చిన అనుభవంతో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. పంచాయతీ ఎన్నికలు నాన్ పొలిటికల్ అయినప్పటికీ, ఆ ఎన్నికల్లో ఎదురైన సమస్యలను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ ఎన్నికల భద్రతా ఏర్పాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు డీజీపీ వెల్లడించారు. అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల వద్ద ఈసారి, పోలింగ్ బూత్లో మాత్రమే కాకుండా పోలింగ్ కేంద్రం బయట కూడా వెబ్ కాస్టింగ్ పెట్టాలని ఎన్నికల కమిషన్ సూచించడంతో పోలింగ్ కేంద్రం పరిధిలో ఈసారి కట్టుదిట్టమైన కెమెరా నిఘా ఏర్పాటు చేయడంతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా 100కుపైగా ప్రత్యేక వెబ్ కాస్టింగ్లు పర్యవేక్షణలో గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఓటర్లు ఎటువంటి అభద్రతాభావం లేకుండా ధైర్యంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. పోలింగ్ ముగిసిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 136 కౌంటింగ్ సెంటర్ల వద్ద ఉన్న స్ట్రాంగ్ రూమ్లకు పోలింగ్ సామాగ్రిని కట్టుదిట్టమైన భద్రత మధ్య తరలిస్తారు.
Frequently Asked Questions
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కోసం ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు?
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎంత విలువైన వస్తువులు సీజ్ చేశారు?
గత 15 రోజుల్లో 3 కోట్ల రూపాయలకు పైగా విలువైన డబ్బు, మద్యం, డ్రగ్స్ చెక్ పోస్టుల వద్ద సీజ్ చేశారు. ఇందులో నగదు, మద్యం, డ్రగ్స్ ఉన్నాయి.
ఎన్ని పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు?
మొత్తం 8203 పోలింగ్ కేంద్రాలలో 1302 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు. వీటికి అదనపు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద నిఘా కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
పోలింగ్ కేంద్రాల బయట కూడా వెబ్ కాస్టింగ్ పెట్టాలని ఎన్నికల కమిషన్ సూచించింది. దీనితో పాటు కట్టుదిట్టమైన కెమెరా నిఘా ఏర్పాటు చేశారు.























