Hyderabad Metro Phase 2 Loan Controversy: రాజకీయ సుడిగుండంలో చిక్కుకున్న మెట్రో ఫేజ్ 2 - రేవంత్ , కిషన్, కేటీఆర్ మధ్య పరస్పర ఆరోపణలు - పరిష్కారం ఉందా?
Metro Loan Row: హైదరాబాద్ మెట్రో రెండో దశకు సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఎల్ అండ్ టీ నుంచి ప్రభుత్వం స్వాధీన ప్రక్రియ పూర్తి చేయాలంటే లోన్ క్లియర్ కావాలి. కిషన్ రెడ్డి ఆపేశారని రేవంత్ ఆరోపిస్తున్నారు.

Revanth Reddy accuses Kishan Reddy of Blocking IRFC Loan: హైదరాబాద్ మహానగర రవాణా ముఖచిత్రాన్ని మార్చేయాల్సిన మెట్రో రైల్ ఫేజ్-2 విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్రమైన రాజకీయ చదరంగంలో చిక్కుకుంది. కేవలం మౌలిక వసతుల ప్రాజెక్టుగా సాగాల్సిన మెట్రో వ్యవహారం కాస్తా, ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పరస్పర రాజకీయ యుద్ధానికి దారితీసింది. ఎల్ అండ్ టీ సంస్థ నుంచి మొదటి దశ మెట్రోను దాదాపు ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ ముగిసిందని, జపాన్ ఆర్థిక సాయంతో ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తక్కువ వడ్డీకి రూ. 13,600 కోట్ల రుణం లైన్ క్లియర్ అయిందని భావిస్తున్న తరుణంలో కేంద్రం నుంచి బ్రేకులు పడ్డాయనే వార్త ఒక్కసారిగా దుమారం రేపింది.
కేంద్రంపై, కిషన్ రెడ్డిపై రేవంత్ యుద్ధం
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎల్ అండ్ టీ సంస్థ మొదటి దశలో భారీ నష్టాలు రావడంతో రెండో దశ 122 కిలోమీటర్ల విస్తరణను చేపట్టేందుకు నిరాకరించిందని తెలిపారు. కేంద్రం సూచన మేరకే రాష్ట్ర ప్రభుత్వం రూ. 30,000 కోట్ల విలువైన మెట్రో ఆస్తులను రూ. 15,000 కోట్లకు కొనుగోలు చేయడానికి సిద్ధపడిందని, జపాన్ సంస్థ నుంచి వచ్చిన రూ. 13,600 కోట్ల రుణాన్ని ఐఆర్ఎఫ్సీ ద్వారా కేవలం 4 శాతం వడ్డీకే రీఫైనాన్స్ చేయడానికి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశామని చెప్పారు. రాష్ట్ర వాటాగా రూ. 1,400 కోట్లు కూడా చెల్లించామన్నారు. అయితే, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి రాజకీయ కారణాలతో, కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్విని వైష్ణవ్లను కలిసి ఈ నిధుల బదిలీని అడ్డుకున్నారని రేవంత్ తీవ్రంగా ఆరోపిస్తున్నారు. కిషన్ రెడ్డి పగలు బీజేపీలో, రాత్రి వేళ బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ కేంద్రానికి ఇష్టం లేకపోతే ఎన్ఓసీ ఇస్తే రాష్ట్రమే పూర్తి భారాన్ని మోస్తుందని సవాల్ విసిరారు.
అన్నీ అబద్ధాలే అంటున్న కిషన్ రెడ్డి
ముఖ్యమంత్రి ఆరోపణలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అంతే తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 కు వ్యతిరేకం కాదని, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఇప్పటికే దీనికి సూత్రప్రాయ ఆమోదం తెలిపారని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ వ్యయంలో 50 శాతం నిధులు కేంద్రమే ఇవ్వబోతోందని, ఇంత పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసేటప్పుడు సమగ్ర పరిశీలన అవసరమని పేర్కొన్నారు. తనపై రేవంత్ రెడ్డి చేస్తున్నవన్నీ అభూతకల్పనలని, రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యం చెందిందని, ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించడానికే ఈ మెట్రో డ్రామా ఆడుతున్నారని రివర్స్ అటాక్ చేశారు. సీనియర్ జర్నలిస్టులతో కమిటీ వేసి నిజాలు నిరూపిస్తే తాను రాజీనామాకైనా సిద్ధమని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.
రేవంత్ అసమర్థతకు పరాకాష్ట - కేటీఆర్ విమర్శలు
ఈ వివాదంలోకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు కూడా ఎంట్రీ ఇచ్చారు. మెట్రో ప్రాజెక్టు ఆలస్యానికి, రుణాల నిలిపివేతకు రేవంత్ రెడ్డి పరిపాలనా అసమర్థతే కారణమని ఆయన విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలోనే మెట్రో మొదటి దశను విజయవంతంగా పూర్తి చేశామని, తాము సిద్ధం చేసిన ఫేజ్-2 రూట్ మ్యాప్లను మార్చడం వల్లే ప్రాజెక్ట్ గందరగోళంలో పడిందని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ నిధులు తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్, బీజేపీలు కలిసి కుట్ర చేస్తున్నాయంటూ రేవంత్ రెడ్డి కొత్త కథలు అల్లుతున్నారని విమర్శించారు.
గాల్లో దీపంలా మెట్రో ఫేజ్-2?
ఈ ముక్కోణపు రాజకీయ యుద్ధం మధ్య నలిగిపోతున్నది మాత్రం సగటు హైదరాబాద్ పౌరుడే. శంషాబాద్ ఎయిర్పోర్ట్, చాంద్రాయణగుట్ట, నాగోల్ కారిడార్లను అనుసంధానిస్తూ ప్రతిపాదించిన 122 కిలోమీటర్ల భారీ విస్తరణ ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు. ఎల్ అండ్ టీ నుంచి మొదటి దశ మెట్రో ఆస్తుల బదిలీ, రుణాల టేకోవర్ సవ్యంగా సాగితేనే రెండో దశకు అంతర్జాతీయ బ్యాంకుల నుంచి నిధులు సమకూరుతాయి. ఇప్పుడు ఐఆర్ఎఫ్సీ లోన్ క్లియరెన్స్ పెండింగ్లో పడటం ప్రాజెక్టు టైమ్లైన్ను దెబ్బతీస్తుంది. టెక్నికల్ కారణాల కంటే ఇక్కడ ఇగోలు, రాజకీయ ప్రయోజనాలే ఎక్కువైపోయాయి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోతే మెట్రో వంటి మెగా ప్రాజెక్టులు ముందుకు పడవు.
బ్లేమ్ గేమ్ ఆపి.. సిటీ భవిష్యత్తును కాపాడాలి !
గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్కు ట్రాఫిక్ కష్టాలు తీరాలన్నా, రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు రావాలన్నా మెట్రో ఫేజ్-2 అత్యంత కీలకం. దేశంలోని అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్, వైజాగ్ వంటి నగరాలకు మెట్రో నిధులు వస్తున్నప్పుడు హైదరాబాద్కు ఎందుకు ఆలస్యం అవుతుందనే రాష్ట్ర ప్రభుత్వ వాదనలో కొంత నిజం ఉన్నప్పటికీ.. కేవలం ఢిల్లీపై నిందలు వేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఇప్పటికైనా రాజకీయాలు పక్కనబెట్టి సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరూ కూర్చుని, కేంద్ర అధికారులతో మాట్లాడి ఈ రూ. 13,600 కోట్ల లోన్ క్లియరెన్స్ను సాధించడమే నగరానికి శ్రేయస్కరమని లేదంటే ‘మెట్రో విస్తరణ’ కేవలం కాగితాలకే పరిమితమై, గాల్లో దీపంలా మారే ప్రమాదం ఉందని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















