ఒక కేంద్రమంత్రి మెట్రో విస్తరణను ఢిల్లీలో అడ్డుకుంటున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రతిపాదనలను ఆమోదించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
Hyderabad మెట్రో విస్తరణను కేంద్ర మంత్రి అడ్డుకుంటున్నారు.. కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి: Revanth Reddy
Hyderabad Metro Expansion | హైదరాబాద్ మెట్రో విస్తరణతో పాటు రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ ప్రక్షాళనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

- కేంద్ర మంత్రి హైదరాబాద్ మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారని సీఎం ఆరోపణ.
- మల్కాజిగిరి, ఉప్పల్ అభివృద్ధి పనులు, క్యూర్-1 యాప్ను ప్రారంభించారు.
- మూసీ ప్రక్షాళనకు కేంద్రం అడ్డుపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
- జూన్ 15 తర్వాత రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ మారుతుందని హెచ్చరించారు.
Telangana CM Revanth Reddy | హైదరాబాద్: ఓ కేంద్రమంత్రి హైదరాబాద్ మెట్రో విస్తరణను ఢిల్లీలో అడ్డుకుంటున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీలో ఉంటూనే బీఆర్ఎస్ నేత కేటీఆర్కు సహకరిస్తున్నారని స్వయంగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం నుండి అనుమతులు ఎందుకు రావడం లేదో సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఉప్పల్ భగాయత్ వేదికగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
క్యూర్-1 మొబైల్ యాప్ ఆవిష్కరణ
ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు సాంకేతిక సేవలను ప్రారంభించారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణం, ఉప్పల్లో వంద పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణం, ఏవోసీ (AOC) సెంటర్ చుట్టూ ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన పునాది వేశారు. భవిష్యత్తు డిజిటల్ సేవల కోసం క్యూర్-1 (CURE-1) మొబైల్ యాప్ను ఆవిష్కరించారు. ఈ నూతన యాప్ ద్వారా నగర ప్రజలు తమ ఆస్తి పన్ను, విద్యుత్, నీటి బిల్లులను సులభంగా చెల్లించే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది.
గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్, ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్ పేరుతో అభివృద్ధి చేసుకుంటారు. యూపీలో గంగా నదిని అక్కడి ప్రభుత్వాలు ప్రక్షాళన చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ గొప్పగా చెబుతున్నారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కానీ, తెలంగాణలో మూసీ ప్రక్షాళన చేస్తామంటే మాత్రం ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. రాజకీయాలు కేవలం ఎన్నికల సమయంలోనే ఉండాలని, అభివృద్ధిలో కాదని హితవు పలికారు. ఇతర రాష్ట్రాల్లో నదుల ప్రక్షాళనను సమర్థించే బీజేపీ నేతలు, మూసీ ప్రక్షాళనపై రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు.
జూన్ 15 తర్వాత తెలంగాణ ప్రభుత్వ కార్యాచరణ మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఎందుకు అనుమతి ఇవ్వరో, మన రైతులు పండించిన ధాన్యాన్ని ఎందుకు పూర్తిగా కొనరో, రీజినల్ రింగ్ రోడ్డుకు (RRR) నిధులు ఎందుకు కేటాయించరో.. వాటి సంగతి చూస్తామన్నారు. మంచి పనుల విషయంలో రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలకు సూచించారు. నన్ను ఎవ్వరూ ఏం చేయలేరని కిషన్ రెడ్డి అంటున్నాడు. అయితే ఇక్కడి ప్రజలతో పెట్టుకున్నోడు, తెలంగాణ ప్రజలతో గోక్కున్నోడు చరిత్రలో బాగుపడి బట్టకట్టినోడు లేడన్నారు.
మెట్రో విస్తరణను ఆపుతున్న కేంద్ర మంత్రి..
ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో దాదాపు 1.34 కోట్ల మంది జనాభా ఉన్నారని, ఇంత భారీ సంఖ్యలో ఉన్న ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం సాధారణ విషయం కాదన్నారు. నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు ప్రతిపాదన చేశాం. 122 కి.మీ మేర మెట్రో విస్తరణకు అన్ని అనుమతులు వచ్చాక మన కేంద్రమంత్రి కాళ్ళల్లో కట్టెలు, పుల్లలు పెట్టి అర్ధాంతరంగా ఆపేశారని ఆరోపించారు. రీజినల్ రింగ్ రోడ్డు కోసం కాలుకు బలపం కట్టుకొని తిరుగుతున్నప్పటికీ.. అనుమతులు రాకుండా ఎవరు ఆపుతున్నారు? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పరిపాలనా సౌలభ్యం కోసమే జీహెచ్ఎంసీ(GHMC)ని మూడుగా విభజిస్తే, కొందరు రాజకీయ లబ్ధి కోసమేనంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల ఇబ్బందులను తొలగించేందుకే ఉప్పల్లో మున్సిపల్ ఆఫీసును ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాజకీయంగా కష్టాల్లో ఉన్న సమయంలో తనను మల్కాజిగిరి ప్రజలే ఎంపీగా గెలిపించారని గుర్తు చేసుకున్నారు. గతంలో కేంద్రం సహకారం లేకపోవడం వల్లే అనుకున్న పనులు చేయలేకపోయానని, ఇప్పుడు ముఖ్యమంత్రిగా మల్కాజిగిరి నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యతను తానే తీసుకుంటున్నానని చెప్పారు.
Frequently Asked Questions
హైదరాబాద్ మెట్రో విస్తరణకు అడ్డంకులు ఎందుకు ఎదురవుతున్నాయి?
క్యూర్-1 మొబైల్ యాప్ దేనికి ఉపయోగపడుతుంది?
ఈ యాప్ ద్వారా నగర ప్రజలు తమ ఆస్తి పన్ను, విద్యుత్, నీటి బిల్లులను సులభంగా చెల్లించవచ్చు. భవిష్యత్తు డిజిటల్ సేవల కోసం దీన్ని ప్రారంభించారు.
మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును ఎందుకు అడ్డుకుంటున్నారు?
రాజకీయాలు ఎన్నికల సమయంలోనే ఉండాలని, అభివృద్ధిలో కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాల్లో నదుల ప్రక్షాళనను సమర్థించే బీజేపీ నేతలు మూసీపై రాజకీయం చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.
తెలంగాణ ప్రభుత్వం జూన్ 15 తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోనుంది?
మెట్రో విస్తరణకు అనుమతులు, ధాన్యం కొనుగోలు, ఆర్ఆర్ఆర్ నిధుల కేటాయింపు వంటి పెండింగ్లో ఉన్న విషయాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. అభివృద్ధి విషయంలో రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలకు సూచించింది.
ట్రెండింగ్ వార్తలు























