Delimitation politics: దక్షిణాది వాదన వినకపోతే కష్టమే - కత్తి మీద సాములా బీజేపీ డిలిమిటేషన్ పాలిటిక్స్
Southern States Sentiment: దక్షిణాదికి అన్యాయం జరిగిందనే భావన రాకుండా కేంద్రం డీలిమిటేషన్ చేయాల్సి ఉంది. సరిగ్గా చర్చించకుండా ముందుకెళ్తే సెంటిమెంట్ పెరిగే అవకాశం ఉంది.

Southern States Delimitation politics: నియోజకవర్గాల పునర్విభజన అంశం భారత రాజకీయాల్లో ..ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో పెను తుఫానును సృష్టిస్తోంది. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు సీట్ల సంఖ్యను పెంచితే, జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ సున్నితమైన అంశాన్ని ఎలా డీల్ చేయబోతోంది? దక్షిణాదిలో తన పట్టును పెంచుకోవాలని చూస్తున్న కమల దళం, ఈ దక్షిణాది సెంటిమెంట్ 'ను ఎలా శాంతింపజేయగలదు?
దక్షిణాది సెంటిమెంట్ - బీజేపీకి ఉన్న అసలు సవాలు
దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలహీనంగా ఉందన్నది కాదనలేని వాస్తవం. కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఆ పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. ఇలాంటి తరుణంలో, డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే ప్రచారం బలంగా సాగితే, అది ప్రాంతీయ సెంటిమెంట్గా మారి బీజేపీకి రాజకీయంగా గండంలా మారుతుంది. తమిళనాడులో స్టాలిన్, తెలంగాణలో రేవంత్ రెడ్డి, కేటీఆర్ వంటి నేతలు ఇప్పటికే దీనిని ఒక అస్తిత్వ పోరాటం గా చిత్రీకరిస్తున్నారు. ఈ సెగను చల్లార్చకపోతే, భవిష్యత్తులో దక్షిణాదిలో విస్తరించాలనే బీజేపీ కల కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.
ప్రతిపాదనలపై స్పష్టత కరువు - ఆందోళనకు ప్రధాన కారణం
ప్రస్తుతానికి పార్లమెంటులో సీట్ల సంఖ్యను 816 లేదా 850కి పెంచుతూ బిల్లు తెస్తున్నారు తప్ప ఆ సీట్లను రాష్ట్రాలకు ఏ ప్రాతిపదికన కేటాయిస్తారనే దానిపై స్పష్టమైన ఫార్ములా వెలువడలేదు. జనాభా ప్రాతిపదికన.. పార్లమెంట్ చట్టం ప్రకారం అని చెబుతున్నారు. దీనికోసం కేంద్రం ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నప్పటికీ, విపక్షాల ఆరోపణలకు సరైన సమాధానం చెప్పకపోవడం వల్ల ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. కేవలం జనాభాను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటే ఉత్తరాది రాష్ట్రాల పెత్తనం పెరుగుతుందనే వాదనకు కేంద్రం గట్టి కౌంటర్ ఇవ్వాల్సి ఉంది.
పార్లమెంటు చర్చ ద్వారా భరోసా?
బీజేపీ ఈ అంశాన్ని పార్లమెంటు చర్చ ద్వారా ఒక కొలిక్కి తీసుకువచ్చే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నామనే ముద్ర పడకుండా ఉండేందుకు, కేవలం జనాభానే కాకుండా రాష్ట్రాల సామర్థ్యం, ఆర్థిక తోడ్పాటు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని కేంద్రం ప్రకటించే ఛాన్స్ ఉంది. పార్లమెంటు వేదికగా ప్రధాని మోదీ , అమిత్ షా వంటి అగ్రనేతలు దక్షిణాదికి భరోసా ఇస్తే తప్ప ఈ ఆందోళనలు సద్దుమణగవు.
దక్షిణాది సెంటిమెంట్ను బీజేపీ కోరుకోదు
భారతదేశం వంటి భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశంలో ఉత్తరాది - దక్షిణాది మధ్య చీలిక రావడం ఏ అధికార పార్టీకి మంచిదికాదు. ముఖ్యంగా ఏక్ భారత్ - శ్రేష్ఠ్ భారత్ అని నినదించే బీజేపీకి ఇది భారీ దెబ్బ. దక్షిణాది సెంటిమెంట్ పెరిగితే, అది జాతీయవాదానికి గండి కొడుతుందని ఆ పార్టీ అంతర్గత వర్గాలు భావిస్తున్నాయి. అందుకే, సీట్ల పెంపు ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల గౌరవం తగ్గకుండా, ఒక శాస్త్రీయమైన, ఆమోదయోగ్యమైన ఫార్ములాను తీసుకురావడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. డీలిమిటేషన్ ప్రక్రియ అనేది కేవలం అంకెలకు సంబంధించిన విషయం కాదు, ఇది భారత సమాఖ్య స్ఫూర్తికి ఒక పరీక్ష. నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఉత్తరాదికి సీట్లు పెరిగినా, దక్షిణాదికి ఉన్న రాజకీయ ప్రాధాన్యతను కాపాడేలా అదనపు రక్షణ కవచాలు కల్పించడంపై కేంద్రం దృష్టి సారించాలి. త్వరలో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం ఇచ్చే స్పష్టతనే దేశ రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దక్షిణాదికి భరోసా ఇవ్వడంలో కేంద్రం విఫలమైతే, అది దేశవ్యాప్త రాజకీయ సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















