(Source: ECI/ABP News)
Delimitation Politics : పునర్విభజనపై రేవంత్ బాటే కేటీఆర్ మాట - దక్షిణాదికి అన్యాయంపై యుద్ధమే - కలసి పోరాడతారా?
Delimitation: డీలిమిటేషన్ ను వ్యతిరేకించే విషయంలో కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ కూడా ఒకే వాదన వినిపిస్తోంది. కలసి పోరాటం చేసే విషయంలో కలిసే అవకాశాలు కనిపించడం లేదు.

Delimitation BJP: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులకు దారితీస్తోంది. జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్యను పెంచితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరిదీ ఒకే విధానంగా కనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టడంపై కేటీఆర్ విరుచుకుపడుతుండగా, అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దక్షిణాది హక్కుల కోసం గళం ఎత్తుతోంది.
జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన తెలంగాణ వంటి రాష్ట్రాలను సీట్ల పెంపు విషయంలో శిక్షించడం అన్యాయమని కేటీఆర్ అంటున్నారు. ప్రస్తుత పార్లమెంటులో దక్షిణాదికి ఉన్న 24 శాతం వాటా ఏ మాత్రం తగ్గకూడదని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఇదే అంశంపై రేవంత్ రెడ్డి కూడా గతంలో ప్రధాని మోదీకి లేఖ రాస్తూ.. దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేలా విభజన ఉండకూడదని స్పష్టం చేశారు. విధానపరంగా ఇద్దరు నేతలు ఒకే తాటిపై ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని రాజకీయ సమీకరణాల దృష్ట్యా వీరు కలిసి పోరాడే అవకాశం మాత్రం శూన్యంగా కనిపిస్తోంది.
బిజెపి ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శఇస్తున్నారు. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల ఎజెండాపై నమ్మకం లేదని మండిపడ్డారు. 50 శాతం సీట్ల పెంపుపై ఎక్కడా అధికారిక ప్రకటన లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం తెలంగాణకు న్యాయం చేస్తారన్న నమ్మకం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర హక్కుల కోసం తాము ఇతర పక్షాలతో కలిసి పోరాడుతామని చెబుతూనే, రేవంత్ రెడ్డిని బీజేపీ ప్రతినిధి గా ముద్ర వేయడం ద్వారా కాంగ్రెస్తో కలిసి నడిచే ప్రసక్తే లేదని పరోక్షంగా స్పష్టం చేశారు.
మరోవైపు, కాంగ్రెస్ అధిష్టానం కూడా డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ఆవేదనను పరిగణనలోకి తీసుకుంటోంది. అయితే, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి కావడంతో, వారితో చేతులు కలిపితే తమ రాజకీయ ఉనికి దెబ్బతింటుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే, ఇద్దరి లక్ష్యం దక్షిణాది ప్రయోజనాలు అయినప్పటికీ, ఆ క్రెడిట్ ఎవరికి దక్కాలనే విషయంలో నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఇది కేవలం సిద్ధాంతాల పోరాటం కంటే పవర్ పాలిటిక్స్ గానే ఎక్కువగా కనిపిస్తోంది.
డీలిమిటేషన్ అంశం తెలంగాణలో విచిత్రమైన పరిస్థితిని సృష్టించింది. ఒకే సమస్యపై అధికార, ప్రతిపక్షాలు ఒకే మాట మీద ఉన్నా.. గల్లీలో ఉన్న వైరం వల్ల ఢిల్లీలో గళం కలపలేకపోతున్నాయి. ఒకవేళ కేంద్రం జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచితే, ఈ ఇద్దరు నేతలు విడివిడిగానే నిరసన గళాలు వినిపిస్తారా లేక రాష్ట్ర ప్రయోజనాల కోసం అనివార్యంగా ఒకే వేదికపైకి వస్తారా అన్నది వేచి చూడాలి. గతంలో తమిళనాడులో స్టాలిన్ నిర్వహించిన సమావేశానికి ఇద్దరు నేతలు హాజరయ్యారు. ప్రస్తుతానికి మాత్రం ఈ కామన్ పాలసీ కేవలం ప్రకటనలకే పరిమితం కానుంది.
ట్రెండింగ్ వార్తలు






















