Telangana Congress: కాంగ్రెస్ నేతలకు పదవుల జాతర - నామినేటెడ్ పోస్టుల భర్తీకి సన్నాహాలు పూర్తి
Telangana Congress leaders: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు నామినేటెడ్ పోస్టులను ప్రకటించనున్నారు. రేవంత్ నివాసంలో మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్లతో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Nominated posts for Telangana Congress leaders: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గత కొద్దిరోజులుగా నెలకొన్న అంతర్గత పరిణామాలు, పాలనాపరమైన నిర్ణయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం తన నివాసంలో అత్యంత కీలకమైన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ , టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ భేటీలో పాల్గొన్నారు. దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ పథకాల అమలులో సమన్వయం, నామినేటెడ్ పదవుల భర్తీపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం.
నామినేటెడ్ పోస్టుల కోసం డిమాండ్లు
ఈ భేటీలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం నామినేటెడ్ పదవుల భర్తీ . గత కొంతకాలంగా పార్టీ కోసం కష్టపడిన సీనియర్ నాయకులు, ద్వితీయ శ్రేణి కార్యకర్తలు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. మరో రెండు రోజుల్లోనే పెండింగ్లో ఉన్న కీలకమైన నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం దెబ్బతినకుండా జాబితాను సిద్ధం చేయాలని సీఎం పార్టీ నేతలకు సూచించారు. ఇది కార్యకర్తలలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని అధిష్టానం భావిస్తోంది.
అసంతృప్తి స్వరాలపై ఆరా తీసిన మీనాక్షి
పార్టీలో అక్కడక్కడా వినిపిస్తున్న అసంతృప్తి స్వరాలపై కూడా మీనాక్షి నటరాజన్ ఈ సందర్భంగా ఆరా తీశారు. కొందరు సీనియర్ నేతలు ప్రభుత్వ నిర్ణయాలపై బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు, సమన్వయ లోపంపై చర్చించారు. అందరినీ కలుపుకుని వెళ్లాలని, జిల్లాల వారీగా పార్టీ నేతలతో నిరంతరం టచ్లో ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడికి సీఎం సూచించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో పార్టీ కేడర్ క్రియాశీలకంగా వ్యవహరించాలని ఈ సమావేశం నిర్ణయించింది.
గ్రేటర్ ఎన్నికలపైనా చర్చ
దీనితో పాటు, రాబోయే గ్రేటర్ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే దిశగా వ్యూహరచన చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాల అమలు తీరును, లబ్ధిదారుల అభిప్రాయాలను పార్టీ యంత్రాంగం సేకరించాలని చర్చించారు. పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కేడర్ నుంచి అందుతున్న ఫీడ్బ్యాక్ను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య గ్యాప్ లేకుండా చూసేందుకు క్రమం తప్పకుండా ఇటువంటి సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఈ భేటీలో తీర్మానించారు.
రెండు రోజుల్లో పదవుల జాబితా
రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ ముక్కోణపు భేటీ తెలంగాణ కాంగ్రెస్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు, పార్టీలోని అంతర్గత విభేదాలకు చెక్ పెట్టి.. రాబోయే ఎన్నికలకు క్యాడర్ను సమరోత్సాహంతో సిద్ధం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే లిస్ట్ సిద్ధమైందని, ఏ క్షణమైనా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు ధృవీకరిస్తున్నాయి.
ట్రెండింగ్ వార్తలు






















