Telangana Politics: వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బీఆర్ఎస్ - సమాధానం చెప్పుకోలేక మంత్రుల తంటాలు !
BRS: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వరుస ఆరోపణలతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సమాధానం చెప్పుకోలేక మంత్రుల తంటాలు పడుతున్నారు.

BRS is being choked congress with series of allegations: తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య అవినీతి అస్త్రాల యుద్ధం పతాక స్థాయికి చేరింది. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలను తిప్పికొట్టడంలో కాంగ్రెస్ మంత్రుల స్పందన కేవలం డిఫెన్సివ్ గా మాత్రమే ఉందని, బలమైన కౌంటర్ ఇవ్వడంలో వారు వెనుకబడిపోతున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ పొంగులేటి అస్త్రం - వరుస ఆరోపణలు
బీఆర్ఎస్ నేతలు వ్యూహాత్మకంగా మంత్రి పొంగులేటిని ముందు పెట్టి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ప్రధానంగా నాదర్గుల్ భూముల్లో 7,000 కోట్ల కుంభకోణం జరిగిందని, ఇందులో మంత్రి కుటుంబానికి చెందిన సంస్థల ప్రమేయం ఉందని హరీష్ రావు ఆరోపించారు. దీనికి తోడు రాఘవ కన్స్ట్రక్షన్స్ ద్వారా అక్రమ మైనింగ్ సాగిస్తున్నారని, కొండగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టుల్లో అక్రమాలు జరిగాయని కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఆరోపణలు కేవలం ఒక మంత్రికి పరిమితం కాకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఈ వివాదాల్లోకి లాగుతూ బీఆర్ఎస్ మైలేజ్ పొందుతోంది.
మంత్రుల కౌంటర్ బలహీనం
బీఆర్ఎస్ చేస్తున్న నిర్దిష్టమైన ఆరోపణలకు కాంగ్రెస్ మంత్రులు ఇస్తున్న సమాధానాలు చాలా బలహీనంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రెస్ కాన్ఫరెన్స్లో మంత్రి పొంగులేటి , ఇతర మంత్రులు ఈ ఆరోపణలను నిరాధారమైనవి అని కొట్టిపారేసినప్పటికీ, ప్రజల్లోకి బలమైన సంకేతం పంపడంలో విఫలమయ్యారన్న అంచనాలు వస్తున్నాయి. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ఈ ఆరోపణలు చేస్తున్నారు అనే ఒకే మాటను వారు పదే పదే చెబుతున్నారు. దీనివల్ల ప్రస్తుత ఆరోపణలపై స్పష్టత ఇవ్వడం కంటే, పాత విషయాలను తోడటంపైనే వారు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.
సమన్వయ లోపం - ఒంటరి పోరాటం
బీఆర్ఎస్ నాయకత్వం ఒక టీమ్గా విరుచుకుపడుతుంటే, కాంగ్రెస్ వైపు నుండి కేవలం పొంగులేటి మాత్రమే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇతర కీలక మంత్రులు ఈ వివాదాల జోలికి వెళ్లకపోవడం లేదా అరకొరగా స్పందించడం వల్ల ప్రభుత్వం డిఫెన్స్ లో పడిపోయిందనే భావన కలుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో ఉండటం, ఇక్కడ మంత్రుల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు ప్రజల మెదళ్లలోకి బలంగా వెళ్తున్నాయి. మైనింగ్ ఆదాయంపై బీఆర్ఎస్ లేవనెత్తిన సాంకేతిక అంశాలకు ప్రభుత్వం నుండి పక్కాగా సమాధానం రావడం లేదు. ఇసుక ధరలు పెరిగాయని, ఆదాయం ఎందుకు తగ్గింది? అనే ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పలేక, దానిని చిన్న విషయం గా కొట్టిపారేయడం విమర్శలకు తావిస్తోంది. సీఐడీ విచారణకు ఆదేశించామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, సిట్టింగ్ మినిస్టర్పై సీఐడీ విచారణ ఎలా నిష్పక్షపాతంగా జరుగుతుంది అనే ప్రతిపక్షాల ప్రశ్నకు మంత్రుల దగ్గర గట్టి సమాధానం లేదు.
వ్యూహం మార్చుకోకపోతే నష్టమే!
రాజకీయంగా బీఆర్ఎస్ ఇప్పుడు అటాకింగ్ మోడ్లో ఉంది. కాంగ్రెస్ మంత్రులు కేవలం ఆరోపణలు నిరూపించండి.. నేను రాజీనామా చేస్తా వంటి పాత డైలాగులతో కాకుండా, డేటా, డాక్యుమెంట్లతో కూడిన కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. లేకపోతే, ఈ అవినీతి ముద్ర ప్రభుత్వ ఇమేజ్ను దెబ్బతీసే అవకాశం ఉంది. ముఖ్యంగా పాలనలో పారదర్శకత ఉందని చెప్పుకుంటున్న కాంగ్రెస్, ఇలాంటి ఆరోపణల సమయంలో మరింత వేగంగా ,బలంగా స్పందించకపోతే ప్రజల్లో అనుమానాలు పెరిగే ప్రమాదం ఉందని అనుకోవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















