అన్వేషించండి

BJP Annamalai Factor: దక్షిణ భారత్‌లో విస్తరించాలన్న బీజేపీ ప్లాన్‌ను అన్నామలై రాజీనామా  దెబ్బతీసిందా? హిందుత్వ అజెండా ఎక్కడ విఫలమవుతోంది? 

BJP Annamalai Factor: అన్నామలై రాజీనామాతో దక్షిణాదిలో బీజేపీ వ్యూహాలకు బ్రేక్ పడిందా?దక్షిణాదిలో కాషాయ జెండా ఎగరవేసేందుకు కమలనాథులు పడుతున్న పాట్లు, ఎదురవుతున్న సవాళ్లపై లోతైన విశ్లేషణ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అన్నామలై రాజీనామాతో తమిళనాట బీజేపీకి గట్టి దెబ్బ.
  • కర్ణాటక మినహా దక్షిణాదిన బీజేపీ బలహీనంగానే ఉంది.
  • హిందుత్వ ఎజెండా, స్థానిక నాయకత్వ లేమి ప్రధాన సవాళ్లు.
  • స్థానిక సంస్కృతి గౌరవిస్తూ సరైన వ్యూహాలు బీజేపీకి కీలకం.

BJP Annamalai Factor: మొన్నటి వరకు తమిళనాడు రాజకీయాల్లో బీజేపీకి అన్నామలై ఒక 'రాక్‌స్టార్' లాంటి వ్యక్తి. మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఆయన వ్యక్తిత్వం, డీఎంకేను బహిరంగంగా సవాలు చేసే దూకుడు శైలితో తమిళనాడు బీజేపీలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫేస్‌గా నిలిచారు. ఆయన మద్దతుతో, తమిళనాడులో మొదటిసారిగా కాషాయం పట్టు సాధిస్తుందని అంతా ఆశించారు. కానీ అన్నామలై ఆకస్మిక రాజీనామా మొత్తం గేమ్‌నే తలకిందులు చేసింది. దక్షిణాది సహా తమిళనాడులో బీజేపీ చరిత్ర, ప్రస్తుత పరిస్థితి ఏంటి? తదుపరి ఆ స్థానంలోకి ఎవరు రావచ్చు? ఇక్కడ హిందుత్వ రాజకీయాలు ఎందుకు బీజేపీకి మింగుడుపడటం లేదో చూద్దాం.

అన్నామలై రాజీనామాతో బీజేపీ వ్యూహం ప్రశ్నార్థకం !

కె. అన్నామలై రాజీనామా ఎందుకంత పెద్ద వార్త అయిందో అర్థం చేసుకోవడం ముఖ్యం. 2024 మార్చిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అన్నామలై గట్టిగా ప్రచారం చేసినప్పటికీ, తమిళనాడులో బీజేపీ ఖాతా తెరవలేకపోయింది. ఈ ఓటమి ఎదురైనా, పార్టీ నాయకత్వం ఆయనను తొలగించకుండా, ఆయనపైనే విశ్వాసం ఉంచింది. అయితే, 2026 జూన్‌లో ఆయన అకస్మాత్తుగా పార్టీకి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నితిన్ నవీన్ వెంటనే ఆమోదించారు. దీనితో, అన్నామలైకి, అధిష్టానానికి మధ్య కొంతకాలంగా గ్యాప్‌ ఉందని స్పష్టమైంది.

ఈ రాజీనామాకు కారణం కేవలం ఎన్నికల ఓటమి మాత్రమే కాదని, పార్టీ పనితీరు, కేంద్ర నాయకత్వంతో ఉన్న తీవ్ర విభేదాలు కూడా కారణమని 'ది వీక్' పత్రికలోని ఒక నివేదిక సూచిస్తోంది. తమిళనాడులో బీజేపీని పటిష్టం చేస్తున్నాని చెప్పిన వ్యక్తే పార్టీ వెళ్తున్న తీరు సరిగా లేదని చెప్పి తప్పుకోవడం సంచలనంగా మారింది. అది కేవలం ఒక నాయకుడి నిష్క్రమణగా కాకుండా దక్షిణాదిలో బీజేపీ చేపట్టిన మొత్తం ఆపరేషన్‌కే ఒక పెద్ద దెబ్బ.

తమిళనాడులో బీజేపీ బలం చరిత్ర అంతంత మాత్రమే 

తమిళనాడులో బీజేపీ అంత బలంగా ఏం లేదు. ఆ పార్టీ, దాని పూర్వ సంస్థ అయిన జనసంఘ్ 1960ల నుంచే ఈ రాష్ట్రంలో ఉనికి కోసం పోరాడుతూనే ఉంది. 1998 లోక్‌సభ ఎన్నికలలో, బీజేపీ ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకుని మూడు సీట్లు గెలుచుకోగా, 1999లో నాలుగు సీట్లు గెలుచుకుంది. ఇప్పటి వరకు తమిళనాడులో బీజేపీకి ఇదే అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ఆ తర్వాత, ఏఐఏడీఎంకేతో పొత్తు విచ్ఛిన్నమైంది. అలా పార్టీ పరిస్థితి క్షీణించడం కొనసాగింది. 2004 నుంచి ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. 2014 నాటి మోదీ ప్రభంజనం కూడా తమిళనాడులో కనీస ఓట్ల శాతాన్ని కూడా పెంచుకోలేకపోయింది. పార్టీ ఓట్ల శాతం 2% కన్నా తక్కువకు పడిపోయింది.

అసెంబ్లీలో కూడా బీజేపీ పనితీరు దారుణంగా ఉంది. 2016లో ఆ పార్టీ 234 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. 2021లో నాలుగు సీట్లు గెలుచుకుని స్వల్ప మెరుగుదల కనిపించినప్పటికీ, దాని ఓట్ల శాతం కేవలం 2.84 శాతంగానే మిగిలిపోయింది. ఈ గణాంకాలు తమిళనాడులో బీజేపీకి క్షేత్రస్థాయిలో ఉన్న బలహీనతను స్పష్టం చేస్తున్నాయి.

తమిళనాడే కాదు దక్షిణాదిలో ఇదే దుస్థితి 

కేరళ మూడో శక్తిగా మారాలని తాపత్రయం

కేరళ రాజకీయాలు సాంప్రదాయకంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌లతో మధ్యే సాగుతుంటాయి. ఈ ద్విముఖ రాజకీయ వాతావరణంలో బీజేపీ మూడో శక్తిగా ఎదగడానికి ప్రయత్నించింది, కానీ విజయం సాధించలేకపోయింది. 2016 ఎన్నికలలో, 140 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఒక సీటు గెలుచుకోవడం ద్వారా బీజేపీ తొలిసారిగా ఖాతాను తెరిచింది. 2021 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పనితీరు మరింత మెరుగుపడినప్పటికీ, సీట్ల పరంగా మళ్లీ సున్నా వద్దే ఉండిపోయింది. 2024 లోక్‌సభ ఎన్నికలలో నటుడు-రాజకీయవేత్త సురేష్ గోపి త్రిస్సూర్ నుండి గెలుపొందడంతో, కేరళలో తొలిసారిగా ఒక సీటు గెలుచుకొని బీజేపీ చరిత్ర సృష్టించింది. అయితే, ఈ విజయం వ్యక్తిగత ప్రజాదరణ వల్ల లభించింది కానీ, సంస్థాగత బలం వల్ల కాదు. కేరళలో బీజేపీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు రాష్ట్ర జనాభా స్వరూపం. మొత్తం జనాభాలో ముస్లిం, క్రైస్తవ వర్గాలు సుమారు 45 శాతం ఉన్నారు, వీరిలో హిందుత్వ రాజకీయాలు చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపలేకపోయాయి.

దక్షిణాదిలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం కర్ణాటక 

దక్షిణాదిలో కర్ణాటక ఒక మినహాయింపుగా నిలుస్తుంది. బీజేపీ సొంతంగా పలుమార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏకైక దక్షిణ రాష్ట్రం ఇది. 2008లో బి.ఎస్. యడ్యూరప్ప నాయకత్వంలో ఆ పార్టీ కర్ణాటకలో తొలిసారి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2018లోనూ, మళ్ళీ 2019లోనూ బీజేపీ అధికారంలోకి వచ్చింది. యడ్యూరప్ప సొంత వర్గమైన లింగాయత్ సామాజిక వర్గం, కర్ణాటకలో బీజేపీ బలానికి మూల స్తంభంగా ఉంది. అంతేకాకుండా, తీరప్రాంత కర్ణాటక, మల్నాడు ప్రాంతంలో పార్టీకి ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఉన్న సంస్థాగత నిర్మాణం చాలా బలంగా ఉంది. అయినప్పటికీ, 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూడగా, కాంగ్రెస్ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ మాస్‌ ప్రాంతీయ నాయకుడు లేకపోవడంతో బీజేపీ ఇబ్బంది పడుతోంది. యడ్యూరప్ప యాక్టివ్‌గా లేకపోవంతో ఈ సంక్షోభం మరింత తీవ్రమైంది.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి లేకుండా కష్టమే

ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతీయ పార్టీలకు కంచుకోట. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఇక్కడి రాజకీయాలు టీడీపీ, వైసీపీ మధ్య సాగుతున్నాయి. 2014 ఎన్నికలలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీకి మేలు జరిగింది, ఆ ఎన్నికలలో అది రెండు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. అయితే, 2018లో టీడీపీతో పొత్తు విచ్ఛిన్నమైన తర్వాత, 2019 ఎన్నికలలో బీజేపీ పేలవమైన ప్రదర్శన కనబరిచి, ఒక్క లోక్‌సభ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. 2024 ఎన్నికల్లో బీజేపీ,జనసేన, టీడీపీ పొత్తుతో మూడు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. ఈ విజయం పూర్తిగా ఆ పొత్తుపైనే ఆధారపడి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి సొంత బలం చాలా తక్కువ. ఆ పార్టీ ప్రధానంగా పట్టణ, వ్యాపార వర్గాలకే పరిమితమై ఉంది.

తెలంగాణ అవకాశాలు ఉన్నా సరే... 

ఇటీవలి సంవత్సరాల్లో బీజేపీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దక్షిణ భారత రాష్ట్రం తెలంగాణ. అయినప్పటికీ, ఇక్కడ కూడా అది అధికారానికి చేరువ కాలేకపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. అయితే, 2020 హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో, ఆ పార్టీ 48 డివిజన్లు గెలుచుకుని, ఏఐఎంఐఎం తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా అవతరించి అద్భుత ప్రదర్శన చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది సీట్లు గెలుచుకుంది. దాని ఓట్ల శాతం దాదాపు 14 శాతానికి పెరిగింది. అయినప్పటికీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వంటి పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే స్థితిలో ఆ పార్టీ లేదు. తెలంగాణలో బీజేపీ అతిపెద్ద బలం పట్టణ, సెమీ-అర్బన్ ప్రాంతాలలో ఉండగా, గ్రామీణ ప్రాంతాలలో దాని ప్రాబల్యం పరిమితంగా ఉంది. ఆ పార్టీ హిందుత్వ ఎజెండాను అభివృద్ధి, సమస్యలతో అనుసంధానించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ పట్టు చిక్కడం లేదు. ప్రజలను మోటివేట్ చేసి రప్పించుకునే నాయకుడు లేకపోవడం ఇక్కడ కూడా సమస్యే. అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్ లాంటి వాళ్లు అలాంటి ప్రయత్నం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందనే మూమెంటమ్ తీసుకొచ్చారు. కానీ ఆయన్ని వెంటనే అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. ప్రస్తుతం చాలా మంది నాయకులు ఉన్నా రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ లేదా రేవంత్ రెడ్డికి సవాలు విసరగల నాయకుడు మాత్రం ఆ పార్టీ దొరకం లేదు. 

అసలు హిందుత్వ అజెండా ఎందుకు వర్కౌట్ కావడం లేదు?

హిందుత్వ రాజకీయాలతో సైద్ధాంతిక విభేదం ఉన్న మొదటి రాష్ట్రం తమిళనాడు. 20వ శతాబ్దం ప్రారంభంలో పెరియార్ ఇ.వి. రామస్వామి నాయకత్వంలోని ఆత్మగౌరవ ఉద్యమం మతం, కులం, ఉత్తరాది ఆధిపత్యాన్ని ఏకకాలంలో సవాలు చేసింది. ఈ ఉద్యమం తమిళ గుర్తింపును హిందూ గుర్తింపు నుంచి వేరు చేసింది. ఇక్కడి సగటు ఓటరు దేవాలయాలకు వెళ్లినప్పటికీ, హిందుత్వ రాజకీయాలను మాత్రం వ్యతిరేకిస్తుంటాడు.  

ఉత్తరాదిలో 'హిందీ, హిందూ, హిందుస్థాన్' అనే నినాదాలతో పనిచేస్తున్న హిందుత్వ భావన, తమిళ భాష, సంస్కృతిపై ఉన్న భావజాలం ముందు నిలబడలేకపోతోంది. బెంగాల్ వంటి రాష్ట్రాల్లోకి చొచ్చుకుపోవడంలో బీజేపీ విజయం సాధించినప్పటికీ, తమిళనాడు, కేరళలో అది ఎదుర్కొంటున్న ప్రతిఘటన కేవలం రాజకీయమైంది మాత్రమే కాదని, సాంస్కృతిక, చారిత్రకమైనదని 'ది వైర్'నివేదిక స్పష్టంగా పేర్కొంది. ఇక్కడి రాజకీయాల్లో, బలవంతంగా రుద్దే ఉత్తర భారత నమూనా కంటే స్థానికత, సామాజిక న్యాయం వంటి అంశాలే పైచేయి సాధిస్తాయి.

దక్షిణాదిలోని చాలా రాష్ట్రాల్లో హిందుత్వ రాజకీయాలకు సవాల్:

దక్షిణాదిలో, వెనుకబడిన కులాలు, దళితులు, మైనారిటీల కోసం రిజర్వేషన్లు, సామాజిక హక్కుల ఉద్యమం చాలా బలంగా ఉంది. వీటి ముందు బీజేపీ  హిందుత్వ ఎజెండా బలహీనపడుతుంది. దక్షిణాదిలో హిందీ పట్ల సహజమైన వ్యతిరేకత ఉంది. బీజేపీ హిందీ-హిందూ-హిందుస్థాన్ రాజకీయాలను ఇక్కడ ఒక రకమైన ఉత్తర భారత ఆధిపత్యంగా చూస్తారు. తమిళనాడులో డీఎంకే-ఏఐఏడీఎంకే, కేరళలో వామపక్షాలు, కాంగ్రెస్, ఆంధ్రలో టీడీపీ-వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలంగాణలో బీఆర్ఎస్-కాంగ్రెస్ వంటి పార్టీల బలం ముందు బీజేపీకి చోటు లేకుండా పోతోంది. ఈ సవాళ్లన్నీ కలిసి దక్షిణ భారతాన్ని బీజేపీకి అత్యంత క్లిష్టమైన రాజకీయ క్షేత్రంగా మారుస్తున్నాయి.

దక్షిణాదిలో బీజేపీ అసలు బలహీనత ఏమిటి?

రాజకీయ నిపుణుడు అమితాబ్ తివారీ ఇలా అంటున్నారు, "మనం మొత్తం దక్షిణాదిని పరిశీలిస్తే, బీజేపీ అతిపెద్ద బలహీనత కేవలం సైద్ధాంతిక ప్రతిఘటన మాత్రమే కాదు, సంస్థాగత బలహీనత, ఒక ప్రముఖ నాయకుడు లేకపోవడం కూడా. ఉత్తర భారతదేశంలో, బీజేపీకి నరేంద్ర మోదీ , యోగి ఆదిత్యనాథ్ , శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి పలువురు ప్రముఖ నాయకులు ఉన్నారు. కానీ దక్షిణాదిలో, కర్ణాటక మినహా, రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొంది, కుల, సామాజిక సరిహద్దులను దాటి ఆమోదం పొందే నాయకుడు పార్టీకి లేరు. క్షేత్రస్థాయి సంస్థాగత నిర్మాణం లేకపోవడం మరో ప్రధాన బలహీనత. దక్షిణ భారత్‌లో బూత్ స్థాయిలో కార్యకర్తల నెట్‌వర్క్‌ను నిర్మించడంలో బీజేపీ వెనుకబడి ఉంది."

అంతేకాకుండా, స్థానిక సంస్కృతి, సంప్రదాయాలతో మమేకమవడంలో వైఫల్యం ఉంది. బీజేపీ హిందుత్వ తరచుగా ఉత్తరాది రాజకీయ మోడల్‌గా కనిపిస్తుంది, అయితే దక్షిణాదికి సొంత ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలు ఉన్నాయి. వీటిని స్థానిక ప్రజల మదిలో నిలిచిపోయేలా రాజకీయంగా ఉపయోగించుకోవాలి.

అయితే అన్నామలై తర్వాత బీజేపీ వ్యూహం ఏమిటి?

అన్నామలై రాజీనామాతో తమిళనాడు బీజేపీలో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. గత కొన్నేళ్లుగా, అన్నామలై చేసిన విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఒంటరిగా తనను తాను ప్రచారం చేసుకున్న నాయకుడు మరొకరు లేరు. అయితే, కొన్ని పేర్లు వినిపిస్తున్నా వారు యూత్‌ కనెక్ట్ అవ్వడం సాధ్యమయ్యే పని కాదు. పార్టీ పూర్తిగా కొత్త, యంగ్‌ ఫేస్‌ కోసం చూస్తోంది. అయితే, వాస్తవంగా ప్రస్తుతం అన్నామలై లాంటి ఆమోదయోగ్యమైన తమిళ ముఖం కనిపించడం లేదు. 

బీజేపీ ఇప్పుడు తన మొత్తం దక్షిణ భారత వ్యూహాన్ని పునరాలోచించుకోవలసి ఉంటుందని అమితాబ్ తివారీ అంటున్నారు. ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని రూపొందించుకోవడమే మొదటి అడుగు. కర్ణాటకలో పనిచేసిన సూత్రం తమిళనాడు లేదా కేరళలో పనిచేయకపోవచ్చు. తమిళనాడులో, పార్టీ జాతీయ అజెండాను, స్థానిక ద్రావిడ గుర్తింపును ఒకదానికొకటి వ్యతిరేకంగా నిలబెట్టే నాయకుడు కాకుండా, వాటి మధ్య వారధిగా నిలవగల నాయకుడు పార్టీకి అవసరం. కేరళలో, బీజేపీ కేవలం హిందుత్వపై కాకుండా, మైనారిటీ వర్గాలతో చర్చు ప్రారంభించి, అభివృద్ధి, సుపరిపాలనపై దృష్టి సారించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీకి సంకీర్ణ రాజకీయాలే సరైన మార్గం. అన్నింటికన్నా ముఖ్యంగా, పార్టీ దక్షిణ భారత్‌లో హిందుత్వను ఒక దూకుడు నార్త్ పొలిటికల్ మోడల్‌లా కాకుండా, దానిని స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వారసత్వంతో మేళవించి ప్రయోగించాలి. అప్పుడే 'ఢిల్లీ ఎజెండా' ఉందన్న ఆరోపణ చెరిగిపోతుంది.  

దక్షిణాదిలో బీజేపీ ప్రయాణానికి గండి పడిందా? 

రాజకీయ నిపుణుడు రషీద్ కిద్వాయ్ ఇలా అన్నారు, "అన్నామలై రాజీనామా తమిళనాడులో బీజేపీ జోరుకు కచ్చితంగా బ్రేకులు వేసింది, కానీ మొత్తం దక్షిణ భారత పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే, ఆ ప్రయాణం పూర్తిగా ఆగిపోయిందని చెప్పడం తొందరపాటు అవుతుంది. కర్ణాటకలో బీజేపీ ఇంకా అధికారానికి దగ్గరలోనే ఉంది, ఏ క్షణంలోనైనా తిరిగి రావచ్చు. తెలంగాణలో పార్టీ గ్రాఫ్ క్రమంగా పెరుగుతోంది. కేరళలో తొలిసారిగా ఒక లోక్‌సభ సీటు గెలవడం ఒక మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్‌లో, పార్టీ పొత్తుల ద్వారా అధికారాన్ని రుచి చూస్తోంది. కానీ తమిళనాడులో బీజేపీకి పరిస్థితి అత్యంత కష్టంగా ఉంది."

బీజేపీ కాస్త లోతుగా ఆలోచించి, సరైన వ్యక్తులతో, స్థానిక సంస్కృతికి గౌరవం ఇస్తూ కష్టపడి పనిచేస్తే, దక్షిణ భారత్‌లో దాని మార్గం సులభతరం కావచ్చని రషీద్ కిద్వాయ్ అభిప్రాయపడుతున్నారు. కానీ, ఉత్తర భారతదేశంలో చేసినట్లుగానే ప్రతి దక్షిణాది రాష్ట్రాన్ని గెలవడానికి పార్టీ ప్రయత్నిస్తూనే ఉంటే, అన్నామలై నిష్క్రమణ కేవలం ఆరంభం మాత్రమే కావచ్చు. ప్రస్తుతానికి, దక్షిణ భారత్‌లో బీజేపీకి అతిపెద్ద పోరాటం సిద్ధాంతపరమైనది కాదు, విశ్వాసం, స్థానిక ఆమోదానికి సంబంధించినది. గెలవడానికి దానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.

Frequently Asked Questions

అన్నామలై రాజీనామాకు ప్రధాన కారణాలు ఏమిటి?

ఎన్నికల ఓటమి మాత్రమే కాకుండా, పార్టీ పనితీరు, కేంద్ర నాయకత్వంతో తీవ్ర విభేదాలు కూడా కారణమని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది దక్షిణాదిలో బీజేపీ చేపట్టిన మొత్తం ఆపరేషన్‌కే ఒక పెద్ద దెబ్బగా మారింది.

తమిళనాడులో బీజేపీ పనితీరు గతంలో ఎలా ఉంది?

బీజేపీ 1998, 1999 లోక్‌సభ ఎన్నికలలో AIADMKతో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు గెలిచింది. 2004 నుండి ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది, ఓట్ల శాతం 2% కన్నా తక్కువకు పడిపోయింది.

దక్షిణాదిలో బీజేపీ హిందుత్వ అజెండా ఎందుకు వర్కౌట్ కావడం లేదు?

తమిళనాడులో పెరియార్ ఆత్మగౌరవ ఉద్యమం హిందూ గుర్తింపును సవాలు చేసింది. దక్షిణాదిలో హిందీ వ్యతిరేకత, బలమైన సామాజిక న్యాయ ఉద్యమాలు, స్థానిక పార్టీల ప్రాబల్యం దీనికి అడ్డుపడుతున్నాయి.

దక్షిణాదిలో బీజేపీ బలహీనతలకు ప్రధాన కారణాలు ఏమిటి?

దక్షిణాదిలో బీజేపీకి ప్రముఖ రాష్ట్ర స్థాయి నాయకుడు లేకపోవడం, సంస్థాగత బలహీనత, స్థానిక సంస్కృతి, సంప్రదాయాలతో మమేకం కాకపోవడం ప్రధాన కారణాలు. హిందుత్వను ఉత్తరాది రాజకీయ మోడల్‌గా చూడటం కూడా ప్రతికూలత.

అన్నామలై రాజీనామా తర్వాత దక్షిణాదిలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది?

అన్నామలై రాజీనామా తమిళనాడులో బీజేపీ జోరుకు బ్రేకులు వేసింది. కర్ణాటకలో అధికారానికి దగ్గరగా ఉండగా, తెలంగాణలో గ్రాఫ్ పెరుగుతోంది. కేరళలో లోక్‌సభ సీటు గెలిచినా, తమిళనాడులో పరిస్థితి అత్యంత కష్టం.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu BJP: తమిళనాడు బీజేపీలో అన్నామలై సంక్షోభం! భారీ సంఖ్యలో పార్టీని వీడుతున్న నేతలు!
తమిళనాడు బీజేపీలో అన్నామలై సంక్షోభం! భారీ సంఖ్యలో పార్టీని వీడుతున్న నేతలు!
Gaddar Daughter On Pawan Kalyan: పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
Mamata Banerjee Lok Sabha: బెంగాల్‌ పీఠం కోల్పోయిన మమత ఢిల్లీ కోటపై కన్నేశారా? యూసఫ్‌ పఠాన్ సీటు ఖాళీ వెనుక అసలు కథేంటీ?
బెంగాల్‌ పీఠం కోల్పోయిన మమత ఢిల్లీ కోటపై కన్నేశారా? యూసఫ్‌ పఠాన్ సీటు ఖాళీ వెనుక అసలు కథేంటీ?
K Annamalai New Political Party: అన్నామలై సొంత పార్టీ ప్రకటన - రజనీకాంత్ ప్రస్తావన - తమిళనాడు రాజకీయాల్లో కలకలం
అన్నామలై సొంత పార్టీ ప్రకటన - రజనీకాంత్ ప్రస్తావన - తమిళనాడు రాజకీయాల్లో కలకలం
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gaddar Daughter On Pawan Kalyan: పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Embed widget