Bandi Bhagirath: భగీరథ్ కేసులో రాజకీయం వర్సెస్ చట్టం - మైలేజ్ కోసం బీఆర్ఎస్ ప్రయత్నం - కాంగ్రెస్, బీజేపీ తిప్పికొట్టగలవా?
Bandi Bhagirath POCSO Case: భగీరథ్పై నమోదైన పోక్సో కేసు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను తుపానును సృష్టిస్తోంది బీఆర్ఎస్.. బీజేపీ, కాంగ్రెస్లు తప్పు చేశాయని ప్రజల్లోకి వెళ్తోంది.

Bandi Bhagirath POCSO Case Political Mind Games : బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను తుపానును సృష్టిస్తోంది. ఈ కేసు కేవలం చట్టపరమైన పరిధిని దాటిపోయి రాజకీయంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్ ను ఒకే గాటన కట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. మరో వైపు అధికార కాంగ్రెస్ , బీజేపీ మధ్య ఒక హై-వోల్టేజ్ మైండ్ గేమ్ కు వేదికైంది.
బండి సంజయ్ బర్తరఫ్కు కేటీఆర్ డిమాండ్
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు బండి భగీరథ్ కేసు చుట్టూ తిరుగుతున్నాయి. బీజేపీ దశ మారుస్తారని భావిస్తున్న కీలక నేత కుమారుడు కావడం.. భగీరథ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడం, ఆయన లొంగిపోవడం వంటి పరిణామాలు రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచాయి. ఈ కేసును కాంగ్రెస్ సర్కార్ ఒక బలమైన రాజకీయ ఆయుధంగా మలచుకుంటుండగా, బీజేపీ దీనిని హనీ ట్రాప్గా అభివర్ణిస్తూ ఎదురుదాడికి దిగుతోంది. అదే సమయంలో బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి బాధితురాలికి అన్యాయం చేస్తున్నాయని ఆరోపిస్తోంది. బండి సంజయ్ బర్తరఫ్కు కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఆయన మంత్రిగా ఉంటే.. కేసును ప్రభావితం చేస్తారని అంటున్నారు.
కాంగ్రెస్ వ్యూహం- చట్టం అందరికీ సమానమే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కేసు నమోదైన నాటి నుంచే దర్యాప్తులో ఎందుకు జాప్యం జరుగుతోందని డీజీపీని ప్రశ్నించడం ద్వారా, తన ప్రభుత్వం చట్టం అమలులో ఎవరికీ మినహాయింపు ఇవ్వదని గట్టి సందేశం పంపారు. కేంద్ర మంత్రి కుమారుడైనా సరే వదిలేది లేదని చెప్పడం ద్వారా, ప్రజల్లో తన ఇమేజ్ను పెంచుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా మహిళల భద్రత, పోక్సో కేసుల తీవ్రతను ప్రస్తావిస్తూ బీజేపీని ఆత్మరక్షణలో పడేసేలా కాంగ్రెస్ తన సోషల్ మీడియా విభాగాన్ని రంగంలోకి దింపింది.
బీజేపీ కౌంటర్ - కుట్ర సిద్ధాంతం
మరోవైపు బీజేపీ ఈ కేసును నేరుగా బండి సంజయ్ రాజకీయ ప్రతిష్టపై జరిగిన దాడిగా చిత్రీకరిస్తోంది. ప్రధాని మోదీ సభ , హిందూ ఏక్తా యాత్రల సమయంలోనే ఈ కేసును వెలుగులోకి తేవడం వెనుక లోతైన కుట్ర ఉందని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేకే నా కుమారుడిని టార్గెట్ చేశారు అనేది బీజేపీ ప్రధాన వాదన. అంతేకాకుండా, బాధితురాలు మైనర్ కాదని, ఆమెకు రెండు వేర్వేరు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలు ఉన్నాయనే వార్తలను బీజేపీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వచ్చింది. అయితే బీజేపీకి ఏదీ కలసి రాలేదు. బాధితురాలు మైనర్గా తేలడంతో జైలుకు వెళ్లక తప్పలేదు.
క్షేత్రస్థాయిలో కేడర్పై ప్రభావం
ఈ గొడవ వల్ల క్షేత్రస్థాయిలో బీజేపీ కార్యకర్తలు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇది కేవలం భగీరథ్ వ్యక్తిగత విషయం కాదని, పార్టీ గౌరవానికి సంబంధించిన అంశంగా వారు భావిస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం తన న్యాయ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి దీనిని ఒక ఉదాహరణగా చూపిస్తోంది. ఈ రెండు పార్టీలను ప్రజల్లో దోషులుగా నిరూపించాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ కేసు దర్యాప్తు వేగం పుంజుకునే కొద్దీ తెలంగాణ రాజకీయం మరిన్ని మలుపులు తిరగడం ఖాయం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















