AP Local Body Elections 2026: స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
AP Panchayat Elections Schedule: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగబోతోంది. బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాతియ. ఇక ఎన్నికలే తరువాయా?

TDP Janasena YCP Local Polls: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో భారీ ఎన్నికల సమరానికి తెరలేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం అత్యంత వేగంగా అడుగులు వేస్తోంది. బీసీ రిజర్వేషన్ల సమగ్ర అధ్యయనం కోసం వేసిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చింది. అయితే ఆ నివేదికలో సిఫారసు చేసిన దాని కన్నా ఎక్కువగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు సెప్టెంబర్ మొదటి వారంలోనే వార్డుల వారీగా తుది ఫొటో ఓటర్ల జాబితాలను ప్రచురించాలని ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా ఆదేశించడంతో కౌంట్డౌన్ ప్రారంభమైంది. అంతా అనుకున్నట్లు సాగితే సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబర్ నెలల మధ్యలో ఏపీ అంతటా స్థానిక ఎన్నికల హడావుడి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
2025 నాటి ఎన్నికల జాబితాతో ఎన్నికలు
ఈసారి ఎన్నికల నిర్వహణలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఓటర్ల జాబితా ఎంపిక. ఓటర్ల జాబితా సవరణ సుదీర్ఘ ప్రక్రియ వల్ల ఎన్నికల నిర్వహణ ఆలస్యం కాకుండా ఉండేందుకు 2025 నాటి స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రాతిపదికన ఎన్నికలకు వెళ్లాలని ఎస్ఈసీ వ్యూహాత్మకంగా నిర్ణయించింది. పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ, సవరణలతో పాటు ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ను మించి దాదాపు 34% వరకు బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ సాంకేతిక, పరిపాలనా ముందడుగులు పరిశీలిస్తే ఎన్నికలను మళ్లీ వాయిదా వేసే ఉద్దేశంలో ప్రభుత్వం లేదని స్పష్టమవుతోంది.
రెండు పార్టీలకూ అత్యంత కీలకం
కూటమి ప్రభుత్వానికి ఈ స్థానిక ఎన్నికలు తమ రెండు సంవత్సరాల పరిపాలనా పనితీరుకు, ప్రజాదరణకు మొదటి అధికారిక టెస్ట్ లాంటివి . సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన భారీ విజయం తర్వాత వచ్చే స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూల వేవ్ ఉండటం సహజం. మరోవైపు, పరాజయం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్న వైఎస్సార్ సీపీకి ఈ స్థానిక సమరం ఊపిరి పీల్చుకునే అత్యంత కీలకమైన వేదిక. ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితిలో ఉన్న వైసీపీ, స్థానిక సంస్థల ద్వారా క్షేత్రస్థాయి క్యాడర్లో మళ్లీ ఉత్సాహం నింపాలని భావిస్తోంది. గత ప్రభుత్వంలో క్షేత్రస్థాయిలో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధుల బలంతో పాటు,వైసీపీ శ్రేణులు కనీసం వార్డు, పంచాయతీ స్థాయిలో పట్టు నిలుపుకోగలిగితే పార్టీకి కొత్త పునాది లభిస్తుంది. అందువల్లే, ప్రభుత్వం ఎంత వేగంగా ఎన్నికలకు వెళ్లినా వైసీపీ కూడా వెనకడుగు వేయకుండా పోరుకు సిద్ధమవుతోంది.
ఎన్నికల వ్యూహాల పరంగా చూస్తే.. స్థానిక పోరులో పార్టీ గుర్తుపై జరిగే మున్సిపాలిటీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోల్స్ ఒకెత్తయితే, పార్టీ గుర్తులేని ఎన్నికలు మరొకెత్తు. పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో ఉండే పాత కక్షలు, వర్గపోరు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ రకమైన రాజకీయ సమీకరణాల్లో అధికార కూటమి మధ్య సీట్ల సర్దుబాటు కొన్ని చోట్ల క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య సమన్వయ పరీక్షగా మారే ప్రమాదం కూడా ఉంది. దీన్ని వైకాపా తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసే అవకాశం లేకపోలేదు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పూర్తి రాజకీయ వేడిని నింపబోతున్నాయి. పొలిటికల్ అట్మాస్ఫియర్ అంతా గ్రామ సర్పంచ్ నుండి మున్సిపల్ ఛైర్మన్ల దాకా ఆశావాహుల హడావుడితో మారబోతోంది. ఒకవైపు ప్రభుత్వం తన ఆధిపత్యాన్ని దిగువ స్థాయి దాకా విస్తరించాలని భావిస్తుంటే, మరోవైపు ఉనికి చాటుకోవడానికి వైసీపీ పోరాడుతోంది. కాబట్టి రాబోయే రెండు నెలలు ఏపీ వ్యాప్తంగా సంక్షేమ పథకాలు, స్థానిక సమస్యల చుట్టూ తిరిగే ఓట్ల పోరాటం అత్యంత ఉత్కంఠభరితంగా సాగడం ఖాయం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















