Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
AP coalition Politics: ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి చాలా బలంగా ఉంది. కానీ అది పై స్థాయిలోనే. నియోజకవర్గ స్థాయిలో మాత్రం అంతా రోడ్డున పడుతున్నారు.

Struggle for supremacy between coalition leaders: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , బీజేపీ అగ్రనేతలు అత్యంత సమన్వయంతో, ఒకే మాట - ఒకే బాట అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. కానీ, క్షేత్రస్థాయి నియోజకవర్గాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పాత కక్షలు, ఆధిపత్య పోరాటాలు కూటమి నేతల మధ్య చిచ్చు పెడుతున్నాయి. కదిరిలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి గృహనిర్బంధం ఘటన ఈ అంతర్గత విభేదాలకు ఒక నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. రాజకీయేతర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించుకోవాలని చూడటం కూటమి భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకొనేలా చేస్తోంది.
ఒక్క కదిరి కాదు.. ఆధిపత్యపోరు హైపర్ లోకల్
కదిరి తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఈ హైపర్ లోకల్ పోరు ముదురుతోంది. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో తమకు కనీస గౌరవం దక్కడం లేదని ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే పార్టీ కాకుండా ఇతర పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. నిడదవోలు, తిరుపతి సహా చాలా చోట్ల ఇలాంటివి బహిరంగ వివాదాలకు కారణం అయ్యాయి. మెజార్టీ నియోజకవర్గాల్లో పార్టీల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పాత ప్రత్యర్థులుగా ఉన్న నేతలు ఇప్పుడు ఒకే గొడుగు కిందకు వచ్చినా, మనసులు మాత్రం కలవలేదని ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి.
నామినేటెడ్ పోస్టుల పంపిణీలోనూ అసంతృప్తి
నామినేటెడ్ పోస్టుల పంపిణీ విషయంలో కూడా కింది స్థాయి కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. జనసేన , బీజేపీ శ్రేణులు తమకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని భావిస్తుంటే, పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి పోరాడిన తమను కాదని కొత్తగా వచ్చిన వారికి ప్రాముఖ్యత ఇస్తున్నారని టీడీపీ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ పవర్ షేరింగ్ చిక్కుముడిని విప్పకపోతే, అది రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇతర నేతలు ఎక్కడ పట్టు పెంచుకుంటారోనని ఆందోళన
ఈ ఆధిపత్య పోరాటం ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు కూడా పాకుతున్నాయి. కదిరి రథోత్సవంలో విష్ణువర్ధన్ రెడ్డికి పర్మిషన్ లేదని టీడీపీ ఎమ్మెల్యే హుకుం జారీ చేయడం, బీజేపీ-టీడీపిల మధ్య ఉన్న దూరాన్ని పెంచింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వైసీపీ వంటి ప్రతిపక్షాలు దీన్ని అస్త్రంగా మార్చుకుని, కూటమిలో ఐక్యత లేదు అనే ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఇది కూటమి ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధి ఫలాలను ప్రజలు గుర్తించకుండా చేస్తోంది.
పై స్థాయిలో ఎంత ఐక్యత ఉన్నా, కింది స్థాయిలో కార్యకర్తలు, నాయకుల మధ్య సయోధ్య లేకపోతే అది సమస్యగా మారుతుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ వెంటనే జోక్యం చేసుకుని నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీలను పటిష్టం చేయకపోతే, ఈ ఆధిపత్య పోరాటం చిలికి చిలికి గాలివానలా మారి కూటమిని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం ఉందన్న భావన వ్యక్తమవుతోంది.























