Andhra Pradesh Liquor Scam: లిక్కర్ స్కామ్పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్సీపీ భయపడుతోందా?
Liquor Scam: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తుపై వైసీపీ నోరు మెదపడం లేదు. సిట్ దర్యాప్తుపై ఆరోపణలు చేసిన నేతలు ఇప్పుడు మాత్రం మౌనంగా ఉంటున్నారు.

YCP silent on ED investigation into Andhra Pradesh liquor scam: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. మాజీ సీఎం జగన్ తరపున పనులు చక్కబెట్టారన్న ఆరోపణలున్న వారిని ఈడీ పిలిచి ప్రశ్నిస్తోంది. ఇప్పటికే వెయ్యి కోట్ల మనీలాండరింగ్ ను గుర్తించినట్లుగా చెప్పి నాలుగు వందల కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేసింది. సిట్ దర్యాప్తుపై వైసీపీ తీవ్ర విమర్శలుచేసింది. అసలు మద్యం స్కామే లేదని అంతా సృష్టిస్తున్నారని ఆరోపించింది. కానీ ఈడీ దర్యాప్తుపై మాత్రం నోరు మెదపడం లేదు. ఎందుకు మౌనంగా ఉంటున్నారు?
మనీ లాండరింగ్పై ఈడీ వద్ద ఆధారాలు
ఆంధ్రప్రదేశ్ మద్యం స్కాంలో జరిగిన సుమారు రూ. 4,000 కోట్ల కుంభకోణం కేసులో ఈడీ తన పట్టును బిగిస్తోంది. ఏకంగా రూ. 441.63 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఇందులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి, బూనేటి చాణక్య, వాసుదేవరెడ్డి వంటి వారి స్థిరాస్తులు, బ్యాంక్ నిల్వలు ఉన్నాయి. ఇప్పటివరకు దాదాపు రూ. 1,048 కోట్ల మేర ముడుపులు చేతులు మారినట్లు ఈడీ నిర్ధారించింది. మద్యం తయారీదారుల నుంచి బలవంతంగా నగదు, బంగారం వసూలు చేశారని, ఆ సొమ్మును షెల్ కంపెనీల ద్వారా మళ్లించారని దర్యాప్తు సంస్థ గట్టి ఆధారాలు సేకరించింది.
సిట్ దర్యాప్తుపై వైసీపీ గతంలో తీవ్ర విమర్శలు
గతంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు చేపట్టినప్పుడు వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా స్పందించాయి. అదంతా రాజకీయ కక్ష సాధింపు అని, టీడీపీ ప్రభుత్వం కావాలనే అబద్ధపు కేసులు సృష్టిస్తోందని ఆరోపించాయి. కానీ, ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగి ఆస్తులను జప్తు చేస్తున్నా, నోటీసులు జారీ చేస్తున్నా వైఎస్సార్సీపీ అగ్రనాయకత్వం నుంచి ఆ స్థాయిలో ఖండనలు రావడం లేదు. సిట్ను విమర్శించినట్లుగా ఈడీని విమర్శించలేకపోవడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహం , భయం దాగి ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.
కేంద్ర దర్యాప్తు సంస్థలపై ఆరోపణలు చేస్తే సీన్ రివర్స్
కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీని నేరుగా టార్గెట్ చేస్తే అది ఢిల్లీ స్థాయిలో రివర్స్ అవుతుందనే ఆందోళన వైఎస్సార్సీపీలో కనిపిస్తోందని చెబుతున్నారు. అందుకే సిట్ను రాష్ట్ర ప్రభుత్వ విభాగంగా ముద్ర వేసి తిట్టగలిగిన వారు, ఈడీ దగ్గరకు వచ్చేసరికి మౌనంగా ఉండిపోతున్నారు. ఈడీ తన దర్యాప్తులో మనీ లాండరింగ్ ఆధారాలతో చర్యలు తీసుకోవడం వైఎస్సార్సీపీకి గట్టి ఎదురుదెబ్బ. కేవలం రాజకీయ ఆరోపణలైతే ప్రజల్లో సానుభూతి పొందవచ్చు, కానీ వందల కోట్ల ఆస్తులను జప్తు చేయడం, నగదు లావాదేవీలను సాక్ష్యాలతో సహా చూపడం వంటివి ప్రజల్లో పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తాయి.
జగన్కు సన్నిహితులైన వారి విచారణ
ఈ స్కామ్లో ఇప్పటికే జగన్ కు అత్యంత సన్నిహితులుగా వ్యవహరించిన వారిని పిలిచి ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఐదేళ్ల పాటు వైసీపీ హయాంలో పూర్తి స్థాయిలో చక్రం తిప్పిన మాజీ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, జగన్ వ్యక్తిగత పీఏ కృష్ణమోహన్ రెడ్డి వంటి వారిని పిలిపించి.. గత పదేళ్ల బ్యాంక్ స్టేట్మెంట్లు, పాన్ కార్డులు, కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఆస్తుల డాక్యుమెంట్లను తీసుకున్నారు. అలాగే జగన్కు మరో అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన విజయవాడ జిల్లా జైలులో ఉన్న ఏ1 నిందితుడు రాజ్ కేసిరెడ్డిని కోర్టు అనుమతితో విచారించి కీలక వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగానే ప్రస్తుతం ఇతర అధికారులకు, రాజకీయ అనుచరులకు నోటీసులు వెళ్తున్నాయి. ఈ అంశంపై విమర్శలు గుప్పించడం కన్నా. ..సైలెంట్ గా ఉండటమే మంచిదని వైసీపీ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు



















