Tirumala: తిరుమలకు ఉగ్ర ముప్పు! హై సెక్యూరిటీపై ఐబీ, విజిలెన్స్, ఇంటెలిజెన్స్ అధికారుల కీలక భేటీ
Tirumala: తిరుమలలో భద్రత లోపాలపై కేంద్ర ఐబీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు టీటీడీ విజిలెన్స్, పోలీసులు, రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు సమావేశం అయ్యారు.

Tirumala Latest News Today: తిరుమలలో ఇటీవల బయటపడ్డ భద్రతా లోపాలపై ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. మంగళవారం తిరుమల కొండపై అన్నమయ్య భవన్ లో టీటీడీ విజిలెన్స్ అధికారులు, పోలీసులు, కేంద్ర ఐబీ, రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో డీజీపీ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా, రాజస్థాన్ కు చెందిన కమ్యూనిటీ పోలిసింగ్ అధికారి పంకజ్ చౌదరి పాల్గొన్నారు. ఏడు కొండలపై చేపట్టిన భద్రతా ఏర్పాట్ల గురించి టీటీడీ భద్రతా అధికారులు, పోలీసులు విడివిడిగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తిరుమలలో భద్రతా లోపాలు ఆందోళన కలిగిస్తుండటంతో టీటీడీ అధికారులు దీనిని సీరియస్ గా తీసుకున్నారు.
భద్రతా వైఫల్యంపై కీలక చర్చ
అలిపిరి మొదలుకుని ఘాట్ రోడ్డు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం, భక్తుల రద్దీ ప్రాంతాల్లో నిఘా ఏర్పాట్లు, తనిఖీ వంటి భద్రతలపై చర్చించినట్లు తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్ధానంపై ఉగ్రవాదుల ముప్పు ఉందని కేంద్ర భద్రతా బలగాలు హెచ్చరించిన క్రమంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐతే టీటీడీలో భద్రతను మరింత కఠినతరం చేసేందుకు కేంద్ర భద్రతా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తిరుమలలో భద్రతలో వైఫల్యం ఎక్కడ ఉందన్న దానిపై నిఘా అధికారుల ద్వారా ఓ అంచనాకు వచ్చారు. ఈ క్రమంలోనే కేంద్ర నిఘా వర్గాలతో పాటు రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులను కూడా తిరుమలకు రప్పించి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఓఎస్డీ శశిధర్ రెడ్డి, ఎస్ఎస్జి ఎస్బీ బాబుజీ అట్టెడ, ఎస్ఐబీ ఐఎస్డబ్ల్యూ గరుడ సుమిత్ సునీల్ పాల్గొన్నారు.
గతంలో మూడు హెలికాఫ్టర్లు చక్కర్లు
శ్రీవారి ఆలయం పరిసరాల్లో ఏప్రిల్ 25వ తేదీన సాయంత్రం మూడు హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. దీంతో భక్తులను ఆందోళనకు గురయ్యారు. శ్రీవారి ఆలయానికి సమీపంలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పరాకమణి భవనం, బాలాజీనగర్ ప్రాంతంలో హెలికాప్టర్లు చక్కర్లు కొట్టినట్లు అధికారులు గుర్తించారు. తిరుమలలో 3 హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంపై టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఎయిర్ఫోర్స్కు చెందిన హెలికాప్టర్లు కడప నుంచి చెన్నై వెళ్తుండగా తిరుమల మీదుగా చక్కర్లు కొట్టినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.
అంతకు ముందు డ్రోన్ కలకలం
తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఓ వీడియో ఇటీవల నెట్టింట హల్ చల్ చేసింది. ఈ వీడియో వైరల్ అవడంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ కెమెరాల్లో శ్రీవారి ఆలయాల చిత్రీకరించడంపై ఆరా తీశారు. తిరుమల శ్రీవారి ఆలయంపై, పరిసర ప్రాంతాల్లో విమానాలు, డ్రోన్ కెమెరాలు నిషేధం ఉంది. అయితే శ్రీవారి ఆలయానికి సంబంధించిన వీడియాను ఓ యూట్యూబ్ ఛానల్ పోస్టు చేయడం కలకలంగా మారింది. శ్రీవారి ఆలయాన్ని చిత్రీకరించి, సోషల్ మీడియాలో వైరల్ చేసిన విజువల్స్ పై విచారణ జరిపి నిందితులను పట్టుకున్నారు. హైదరాబాద్ కు చెందిన వారు విజువల్స్ ని అప్లోడ్ చేసినట్లు గుర్తించారు. వీళ్లపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.





















