Tamil Nadu Assembly Elections: కాంగ్రెస్ మద్దతు అడిగిన విజయ్ - ఎమ్మెల్యేలకే వదిలేసిన రాహుల్ - డీఎంకేకు షాకిచ్చినట్లే!?
Tamil Nadu :తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్కు కాంగ్రెస్ మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ ప్రతిపాదన పంపారని కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.

Congress likely to support Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 107 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం , ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ కోసం కాంగ్రెస్ మద్దతు కోరింది. ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి రాకపోవడంతో , టీవీకే అధినేత విజయ్ కాంగ్రెస్ మద్దతు కోరారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి అధికారికంగా ప్రతిపాదన పంపారు.
ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన సమావేశం అనంతరం కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. విజయ్ ఆహ్వానాన్ని తాము చర్చించామని, అయితే మద్దతు ఇవ్వాలా వద్దా అనే తుది నిర్ణయాన్ని తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కే వదిలేస్తున్నట్లు ప్రకటించారు. తమిళనాడులో లౌకిక విలువలను కాపాడే ప్రభుత్వం ఏర్పడాలన్నదే తమ ఆశయమని వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ విషయంలో స్థానిక నేతల అభిప్రాయాలు, రాష్ట్ర రాజకీయ సమీకరణాలను బట్టి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
#WATCH | Delhi: Congress General Secretary (Organisation) K.C. Venugopal says, "...TVK president Vijay has requested INC for support to form a Govt in Tamil Nadu. INC is clear that the mandate in Tamil Nadu is for a secular govt, committed to protecting the constitution in letter… pic.twitter.com/W40qX7HKHu
— ANI (@ANI) May 5, 2026
తమిళనాడులో రాజ్యాంగాన్ని అక్షరాలా రక్షించే ఒక లౌకిక ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఆశయానికి కట్టుబడి ఉంది అని ఆయన పేర్కొన్నారు. ఏ రూపంలోనైనా సరే.. బీజేపీ లేదా వారి ప్రతినిధులు తమిళనాడు ప్రభుత్వాన్ని నడిపించడాన్ని కాంగ్రెస్ సహించబోదని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల తీర్పు ద్వారా వ్యక్తమైన ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని, విజయ్ విజ్ఞప్తిపై తుది నిర్ణయం తీసుకోవాల్సిందిగా టీఎన్సీసీ నాయకత్వాన్ని ఆదేశించాం అని వేణుగోపాల్ వెల్లడించారు. 107 సీట్లు ఉన్న విజయ్ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే, కాంగ్రెస్ మద్దతు అత్యంత కీలకం కానుంది. బీజేపీని రాష్ట్ర అధికారానికి దూరం ఉంచాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ, విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. త్వరలోనే టీఎన్సీసీ నేతలు సమావేశమై దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ డీఎంకేతో బలమైన మిత్రపక్షంగా ఉంది. అయితే తాజా ఎన్నికల్లో డీఎంకే కూటమి వెనుకబడటం, విజయ్ పార్టీ పుంజుకోవడంతో కాంగ్రెస్ పునరాలోచనలో పడింది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 5 స్థానాలను గెలుచుకుంది. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మద్దతు అనివార్యంగా మారింది. కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ వంటి నేతలు స్పందిస్తూ.. తాము ఎప్పుడూ అవకాశవాద రాజకీయాలు చేయబోమని, సిద్ధాంత పరంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. తమిళనాడులో దళపతి విజయ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలంటే ఇప్పుడు బంతి కాంగ్రెస్ కోర్టులో ఉంది. స్థానిక కాంగ్రెస్ నేతలు విజయ్కు మద్దతు తెలిపితే, తమిళ రాజకీయాల్లో దశాబ్దాల కాలంగా ఉన్న డీఎంకే-ఏఐఏడీఎంకే ద్వైపాక్షిక రాజకీయానికి తెరపడి, కొత్త శకం ప్రారంభమవుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు




















