TGBIE: జూనియర్ కాలేజీల్లో ముందస్తు అడ్మిషన్లపై ఇంటర్ బోర్డు సీరియస్, 'అప్పటిదాకా ప్రవేశాలు చేపట్టొద్దు' అంటూ వార్నింగ్
Inter Admissions: తెలంగాణలో వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి అనుబంధ గుర్తింపు తర్వాతే ఇంటర్ ప్రవేశాలు చేపట్టాలని ప్రైవేట్ ఇంట్ కాలేజీలను ఇంటర్ బోర్డు ఆదేశించింది.

Telangana Inter Admissions: తెలంగాణలోని జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరానికి (2025-26) సంబంధించి అనుబంధ గుర్తింపు కోసం నోటిఫికేషన్ కూడా ఇవ్వనందున.. ఇప్పుడే ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టవద్దని ప్రైవేట్ ఇంట్ కాలేజీలను ఇంటర్ బోర్డు ఆదేశించింది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
కళాశాలలకు అఫిలియేషన్ ఇచ్చిన తర్వాత గుర్తింపు పొందిన కాలేజీల వివరాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని, ప్రవేశాల షెడ్యూల్ జారీచేసిన తర్వాత వాటిలో మాత్రమే చేరాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు బోర్డు సూచించింది. కళాశాలలు పీఆర్వోలను నియమించుకొని ఇప్పుడే ప్రవేశాలు చేపట్టాయని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
కొత్త అకడమిక్ సెషన్కు ఇంటర్ బోర్డు ఇచ్చే షెడ్యూలు ప్రకారంగానే.. ప్రవేశాలు చేపట్టాలని, ఇందుకు విరుద్ధంగా ప్రవేశాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. బోర్డు అడ్మిషన్ల షెడ్యుల్ విడుదల చేయకముందే కాలేజీలు ముందస్తు అడ్మిషన్లు చేపట్టొద్దని జూనియర్ కాలేజీల యాజమన్యాలకు సూచించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు కూడా ఇంటర్ బోర్డు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
'JOST' ద్వారా ఇంటర్ ప్రవేశాలు!
తెలంగాణలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలను దోస్త్ (DOST) విధానం ద్వారా నిర్వహిస్తున్న సంగతి విదితమే. అయితే ఇంటర్ ప్రవేశాలకు కూడా ఇదే తరహాలో 'జోస్ట్ (JOST)' ద్వారా ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియ 2025 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించాలని ఇంటర్మీడియట్ బోర్డ్ కసరత్తు చేస్తోంది. పదోతరగతిలో ఈ సారి గ్రేడింగ్ విధానం ఉండదు. గతంలో మాదిరిగానే మార్కులతో ఫలితాలను ప్రకటించనున్నారు. ఆన్లైన్ అడ్మిషన్ల కోసమే మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. జోస్ట్ విధానంలో 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులు జూనియర్ కళాశాలలను ఆన్లైన్లో ఆప్షన్లు పెట్టుకోవచ్చు. అలాగే మెరిట్ ఆధారంగానే సీట్లను కాలేజీలను కేటాయిస్తారు.
ఫీజులే అసలు సమస్య..
జోస్ట్ విధానం అమల్లోకి వస్తే.. ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఫీజుల సంగతి ఎలా అనేది ప్రస్తుతం సమస్యగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా నియంత్రణ ఉండాల్సి ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలో ఇంటర్తో పాటు ఎప్సెట్, జేఈఈ మెయిన్, నీట్ కోచింగ్లు అదనంగా ఇస్తుంటారు. వీటికి ఫీజులు కూడా విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఫీజుల విధానంపై త్వరలోనే ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు..
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను మార్చి 5 నుంచి మార్చి 24 వరకు నిర్వహించనున్నారు. అయితే ప్రథమ సంవత్సరం ప్రధాన పరీక్షలు మార్చి 19తో ముగియనుండగా.. ఫస్టియర్ ఒకేషనల్, బ్రిడ్జి కోర్సు పరీక్షలు మార్చి 24తో ముగుస్తున్నాయి. అదేవిధంగా మార్చి 6 నుంచి మార్చి 25 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సెకండియర్ ప్రధాన పరీక్షలు మార్చి 20తో ముగియనుండగా.. ఒకేషనల్, బ్రిడ్జి కోర్సు పరీక్షలు మార్చి 25తో ముగుస్తున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగనున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

