![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
JEE Advanced 2024 Result: జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలు వచ్చేశాయ్, ఫైనల్ ఆన్సర్ 'కీ' విడుదల - డైరెక్ట్ లింక్ ఇదే
JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను జూన్ 9న ఉదయం 10 గంటలకు ఐఐటీ మద్రాస్ విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.
![JEE Advanced 2024 Result: జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలు వచ్చేశాయ్, ఫైనల్ ఆన్సర్ 'కీ' విడుదల - డైరెక్ట్ లింక్ ఇదే JEE Advanced 2024 Result Declared How To Check Scorecards Know Direct Link Official Website JEE Advanced 2024 Result: జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలు వచ్చేశాయ్, ఫైనల్ ఆన్సర్ 'కీ' విడుదల - డైరెక్ట్ లింక్ ఇదే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/09/4e99adc4a7b8eb695d5e1e752d05c89b1717908348611522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
JEE Advanced 2024 Results: దేశంలో ఐఐటీలు సహా ఇతర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు మే 26న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలయ్యాయి. జూన్ 9న ఉదయం 10 గంటలకు ఫలితాలను ఐఐటీ మద్రాస్ విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ రూల్ నెంబరు, పుట్టినతేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా ఐఐటీ మద్రాస్ విడుదల చేసింది. ఈ ఏడాది మే 26న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్–2024 పరీక్షకు దేశవ్యాప్తంగా 1.91 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో 26, తెలంగాణలో 13 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి 40 వేల మంది వరకు పరీక్షకు హాజరయ్యారు.
జేఈఈ అడ్వాన్స్డ్ - 2024 ఫలితాలు ఇలా చూసుకోండి..
* ఫలితాల కోసం విద్యార్థులు మొదటి అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి. - https://jeeadv.ac.in/
* అక్కడ హోంపేజీలో కనిపించే JEE (Advanced) 2024 Results లింక్ మీద క్లిక్ చేయాలి.
* ఫలితాలకు సంబంధించిన లాగిన్ పేజీలో విద్యార్థులు తమ రూల్ నెంబరు, పుట్టినతేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు వివరాలు నమోదుచేయాలి.
* జేఈఈ అడ్వాన్స్డ్ - 2024 ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
* ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
జేఈఈ అడ్వాన్స్డ్ - 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి..
జేఈఈ అడ్వాన్స్డ్-2024 పరీక్షకు హాజరైనవారిలో ఈసారి తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే అధికంగా ఉన్నారు. దాదాపు 40 వేల వరకు విద్యార్థులు పరీక్ష రాశారు. జేఈఈ మెయిన్ను రెండు సెషన్లు కలిపి 14.10 లక్షల మంది పరీక్షలకు హాజరైన సంగతి తెలిసిందే. వీరిలో క్వాలిఫై కటాఫ్ మార్కులు సాధించిన వారిలో 2.5 లక్షల మందికి అడ్వాన్స్డ్కు అర్హత కల్పిస్తారు. మొత్తం 2,50,284 మంది అభ్యర్థులు అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించగా.. మొత్తం 1.91 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష కోసం అభ్యర్థులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. 2022లో 1.60 లక్షల మంది, 2023లో 1.89 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా.. ఈసారి ఏకంగా 1.91 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఏపీ, తెలంగాణల నుంచి అత్యధిక శాతం మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 45,965 మంది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించగా.. 40 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.
జేఈఈ మెయిన్ 2024 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్లో 2.50 లక్షల మంది విద్యార్థులకు జేఈఈ అడ్వాన్స్డ్కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్ తుది ఫలితాలను ఏప్రిల్ 25న వెల్లడించగా... జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 27న ప్రారంభమైంది. మే 7 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. మే 26న దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో పరీక్షను ఐఐటీ మద్రాస్ నిర్వహించింది. జేఈఈ అడ్వాన్స్డ్ - 2024 పరీక్ష రెస్పాన్స్ షీట్లను ఐఐటీ మద్రాస్ మే 31న విడుదల చేసిన సంగతి తెలిసిందే. జేఈఈ అడ్వాన్స్డ్ - 2024కు సంబంధించి పేపర్-1, పేపర్-2 ప్రశ్నపత్రాలను ఇప్పటికే అందుబాటులో ఉంచింది. పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ని జూన్ 2న విడుదల చేసింది. జూన్ 3న సాయంత్రం 5 గంటలకు ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించారు. తాజాగా జూన్ 9న ఫలితాలను వెల్లడించింది.
జూన్ 10 నుంచి జోసా కౌన్సెలింగ్..
ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BS), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీకి జోసా (JoSAA) పేరిట సంయుక్త కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 10 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. జులై 23 వరకు 44 రోజులపాటు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ ద్వారా ఎన్ఐటీల్లో దాదాపు 24 వేల సీట్లు, ఐఐటీల్లో 17,385, ట్రిపుల్ ఐటీల్లో మరో 16 వేల సీట్లను భర్తీచేయనున్నారు. ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈ అడ్వాన్స్డ్లో ర్యాంకుతోపాటు అభ్యర్థులు బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు తప్పనిసరిగా సాధించాలన్న నిబంధన అమల్లో ఉంది. ఈసారి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ కౌన్సెలింగ్లో పాల్గొనే విద్యాసంస్థల సంఖ్య పెరిగింది. గతేడాది 114 ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 121కి పెరిగింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)