Kavitha Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు.. నెక్ట్స్ ఏంటీ?
సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. కోర్టు తీర్పుపై కవిత హర్షం వ్యక్తం చేశారు.

Delhi Excise Policy Case | హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 23 మందికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం క్లీన్ చీట్ లభించింది. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో కవితపై సీబీఐ అభియోగాలకు సంబంధించి సరైన ఆధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. దాంతో రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా కవిత అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సొంతంగా పార్టీ పెట్టకపోతే, మరో కీలక పార్టీలో చేరి తెలంగాణ ప్రయోజనాల కోసం తన పోరాటం కొసాగిస్తారని సైతం వినిపిస్తోంది.
ఈ కేసును విచారించిన సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిపై సిబిఐ నమోదు చేసిన అభియోగాలన్నిటిని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. సీబీఐ సహా దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన ఛార్జిషీటులో నిందితులు తప్పు చేశారని నిరూపించడానికి తగిన సాక్ష్యాధారాలు లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
దాదాపు మూడేళ్లపాటు కొనసాగిన ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో కోర్టు తీర్పు కవితకు బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు. కవితతో పాటు ఈ కేసులో ఉన్న మిగతా 22 మంది నిందితులకు కూడా ఈ ఉత్తర్వులతో ఊరట లభించినట్లయింది. రాజకీయంగా కూడా ఈ పరిణామం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. కోర్టు తీర్పు అనంతరం పలువురు కవిత నివాసానికి చేరుకుని ఆమెకు అభినందనలు తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో 23 మందికి ఊరట..
అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత కల్వకుంట్ల, కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ రామచంద్ర పిళ్ళై, మూత గౌతం, సమీర్ మహేంద్రు, అమన్దీప్ సింగ్ దాల్, అర్జున్ పాండే, గోరంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్రా రెడ్డి, రాజేష్ జోషి, దామోదర్ ప్రసాద్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ కుమార్ సింగ్, చంప్రీత్ సింగ్ రాయట్, దుర్గేష్ పాఠక్, అమిత్ అరోరా, వినోద్ చౌహాన్, ఆశిష్ చాంద్ మథుర్.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు ఏంటీ..
అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీ ప్రభుత్వం 2021 నవంబర్ 17న కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకువచ్చింది. అయితే, ఈ విధానం ద్వారా అవకతవకలు, స్కామ్ జరిగిందని ఆరోపణలు రావడంతో, 2022 సెప్టెంబరు చివరి నాటికి ఢిల్లీ ప్రభుత్వం ఆ పాలసీని వెనక్కి తీసుకుంది. ఈ మధ్య కాలంలోనే మద్యం లైసెన్సుల కేటాయింపులో, ఎక్సైజ్ పాలసీ సవరణలో భారీ అక్రమాలు జరిగాయని, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతలు మనీలాండరింగ్కు పాల్పడ్డారని కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ ఆరోపించాయి.
ఈ వ్యవహారంలో లైసెన్స్దారులకు నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనం చేకూర్చి, అందుకు ప్రతిఫలంగా నిందితులు భారీ మొత్తంలో ముడుపులు అందుకున్నట్లు సీబీఐ, ఈడీలు తమ దర్యాప్తులో పేర్కొన్నాయి. ఈ కుంభకోణం ఆరోపణలపై మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా, ఇతర ఆప్ నేతలతో పాటు తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కవిత (Kavitha)లను అధికారులు పలు సందర్భాలలో అరెస్టు చేశారు. సుదీర్ఘ విచారణ, జైలు శిక్ష అనంతరం ఈ నేతలు బెయిల్పై విడుదలయ్యారు.
























