Rajyasabha election: తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
ఏఐసీసీ కోటాలో సింఘ్వీకి మరో సారి అవకాశం పక్కా, రెండో అభ్యర్దిగా మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి!, సలహాదారు వేం నరేందర్ రెడ్టితోపాటు ఆశావహుల జాబితా చాంతాడంత. అందరూ అర్హులే. సీఎం చాయిస్ పై ఉత్కంఠ.

హైదరాబాద్: రాజ్యసభకు నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణలో రెండు స్ధానాలు ఖాళీ అవుతుండటంతో అధికార కాంగ్రెస్ లో ఆశావహుల జాబితా పెద్దగానే కనిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రెండు స్ధానాలనూ దక్కించుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తుండటంతో ఆశావహులు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. నామినేషన్ల దాఖలుకు మార్చ్ 5 తుది గడువు కావడంతో అభ్యర్ధులెవరన్న ఆసక్తి ఇప్పుడు సర్వత్రా కనిపిస్తోంది.
సింఘ్వీకి మరో సారి అవకాశం పక్కా...
ప్రస్తుత సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీకి పార్టీ మరోసారి అవకాశం కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది. సీనియర్ నేత అవడం, న్యాయవాదిగా సుప్రీంకోర్టులో పార్టీ తరఫున అనేక కేసుల్లో వాదించిన సేవలు ఆయనకు అదనపు అర్హతలు. కే కేశవరావు రాజీనామా తర్వాత ఏర్పడిన రెండేళ్ల స్వల్పకాలం మాత్రమే ఆయనకు అవకాశం దక్కింది. అందువల్ల ఇప్పుడు సింఘ్వీ పునర్నియామకం కేవలం లాంఛనం మాత్రమే.
రెండో స్ధానం కూడా కాంగ్రేస్ కేనా..
అసెంబ్లీలో సంఖ్యా బలం పరంగా కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యసభ సునాయాసంగా దక్కుతుంది. పార్టీకున్న 66 స్ధానాలకు తోడు సీపీఐ సభ్యుడు బలంతో పార్టీకి 67 స్ధానాల బలముంది. 40 మంది మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఒక అభ్యర్ధి గెలిస్తే రెండో అభ్యర్ధి గెలుకోసం మిగిలిన 27 మందితో పాటు మరో 13 మంది మద్దతు అవసరం. రాజ్యసభ ఎన్నిక కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలో సీక్రెట్ బ్యాలెట్ పద్దతిలో జరుగుతుంది కాబట్టి పార్టీలు ఇచ్చే విప్ చెల్లదు. కాబట్టి ఇతరపార్టీల అభ్యర్ధులు కూడా తమకు ఓటేస్తారని వ్యూహంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆలెక్కన బీఆరెస్ కు దూరంగా వుంటున్న రెబల్ ఎమ్మెల్యేలు కూడాతమకే ఓటేస్తే కాంగ్రెస్ విజయం నల్లేరుపై నడకే అవుంతుంది. బీఆరెస్ ఒకవేళ పోటీ కి తమ అభ్యర్ధిని బరిలోకి దింపినా బీజేపీ, ఎంఐఎంలు తటస్ధాగా వుండే అవకాశాలే ఎక్కువ.
ఆ రెండో అభ్యర్ధి ఎవరు..
కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందనుకుంటున్న ఆరెండో రాజ్య సభ స్ధానానికి అభ్యర్ధి ఎవరనేది ఇప్పుడు పార్టీ వర్గాల్లో పెద్ద చర్చ. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బరిలో నిలిపేందుకు రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారని సమాచారం. ఇండియా కూటమి అభ్యర్దిగా ఉపరాష్ట్రపతి పదవికి ఆయన పోటీలో నిలవడం, తెంలంగాణా ప్రత్యేక రాష్ట్ర సమర్ధకులు కూడా ఐనందున ఆయన పోటీకి పెద్దగా అభ్యంతరాలుండవని సీఎం వ్యూహం. ఆకోనంలో బీఆరెస్ కూడా ఆయన్ను వ్యక్తిగతంగా వ్యతిరేకించే అవకాశాలు తక్కువ. బీఆరెస్ రెబల్స్ కి తద్వారా ఓ కారణం చూపుకునే అవకాశం కూడా దొరుకుతుంది.
ఆశావహుల జాబితా చాలా పెద్దదే..
పార్టీలో చాలాకాలంగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న సీనియర్లు వీ. హనుమంతరావు, మధు యాష్కి గౌడ్, జీవన్ రెడ్డి లు తమకు అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. పార్టీ అధికారంలోకి రావడానికి తమవంతు కృషిచేసామని ఇప్పడైనా తమను గుర్తించాలని హైకమాండ్ ను కన్విన్స్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ అవకాశం ఇవ్వడం ద్వారా ఢిల్లీలో తన పట్టు మరింత పెంచుకునే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది.
కే. కేశవరావు కూడా తన రెండేళ్ల రాజ్యసభ పదవీకాలాన్ని సిఘ్వీకోసం త్యాగం చేసినందున ఇప్పడు తనకు మరో అవకాశం ఇస్తరన్న అంచనాలో వున్నట్టు తెలుస్తోంది.
వీరెవరికీ కాదు పార్టీ సామాజిక కోణంలో ఆలోచిస్తే మైనారిటి కోటాలో తనకు అవకాశం వస్తుందని షబ్బీర్ అలీ, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే, జాతీయ కార్యదర్శిగా పనిచేసిన సంపత్, ఎస్టీ సామాజిక వర్గంనుంచి జాతీయ స్ధాయిలో పార్టీ తరఫున గిరిజన వర్గాల కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పనిచేసిన బెలయ్య నాయక్ కి అవకాశం ఇస్తారన్న అంచనాల్లో ఆయా అభ్యర్ధులు ఎదురుచూస్తున్నారు.
చూడాలి పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందో.























