KTR On Delhi Liquor Scam: కవితకు, కేజ్రీవాల్కు న్యాయం జరిగింది.. బీఆర్ఎస్ పై జరిగిందంతా దుష్ప్రచారమే: కేటీఆర్
BRS Working President KTR | కవితకు, కేజ్రీవాల్కు న్యాయం జరిగిందని.. బీఆర్ఎస్ పై జరిగిందంతా దుష్ప్రచారమేనని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

Delhi Liquor Policy Case | హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చీట్ ఇవ్వడంపై BRS పార్టీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా లిక్కర్ స్కామ్ పేరుతో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేశారని, ఈ కుట్రపూరిత కేసు వల్ల అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి రాజకీయంగా నష్టపోవాల్సి వచ్చిందని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ కేసును సృష్టించారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
నేడు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ద్వారా కవితకు న్యాయం జరిగిందని, ఇదే రీతిలో తమ పార్టీ నేతలపై నమోదైన ప్రతి కేసు కూడా అబద్ధమని, రాజకీయ ప్రేరేపితమని త్వరలోనే బహిర్గతం అవుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు వచ్చే వరకు కాంగ్రెస్, బీజేపీలు చేసే బాధ్యతారహితమైన ఆరోపణలను, ప్రజలను తప్పుదోవ పట్టించేలా మీడియాలో కథనాలను తాము ఎదుర్కొన్నామని చెప్పారు. ఏదైనా కేసులో ఆధారాలకు బదులు ఆరోపణలు, న్యాయ ప్రక్రియకు బదులు మీడియా కథనాలే ప్రాధాన్యత సంతరించుకోవడం నేడు దురదృష్టకరమైన కొత్త సంప్రదాయంగా మారిందని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, అంతిమంగా న్యాయమే గెలుస్తుందని కేటీఆర్ గుర్తుచేశారు.
The AAP Govt led by Kejriwal was brought down in the name of the so-called liquor scam, and the political casualty of that narrative was the Bharat Rashtra Samithi in both the Assembly & Parliament elections
— KTR (@KTRBRS) February 27, 2026
Kavita Garu got justice in court today and In the same manner, every…
తాను కడిగిన ముత్యంలా ఈ కేసులో బయటికొచ్చానని, ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరో లెక్క అని కవిత వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగా తనను ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరికిస్తే బీఆర్ఎస్ పార్టీ సైతం తనకు అండగా నిలవలేదని, తమ ఓటమికి కారణం తానేనని చెప్పడం అత్యంత బాధాకరం అన్నారు. బీఆర్ఎస్ ఓడిపోయింది తనవల్ల, ఈ కేసు కారణంగా కాదని వారి అహంకారం కారణంగానే ఓడిపోయినట్లు నిజాన్ని ఒప్పుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో రెండు నెలల్లో కొత్త పార్టీ పెట్టి, తన అజెండా ప్రకటిస్తా అన్నారు కవిత.
రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వివరాలు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ దాఖలు చేసిన అభియోగాలను కొట్టివేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కల్వకుంట్ల కవితతో పాటు మరో 23 మంది నిందితులు తప్పు చేశారని నిరూపించడానికి తగిన సాక్ష్యాధారాలు లేవని ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ స్పష్టం చేశారు. సీబీఐ దర్యాప్తు సంస్థ సమర్పించిన ఆధారాలు నేరాన్ని నిరూపించడానికి సరిపోవని పేర్కొంటూ, అందరినీ కేసు నుండి డిశ్చార్జ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గత మూడేళ్లుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.























