AP Intermediate Exams 2026 : ఏపీ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్! మారిన రూల్స్ తెలుసుకోకుంటే పరీక్ష రాయలేరు!
AP Intermediate Exams 2026 :పరీక్షల షెడ్యూల్ నుంచి విద్యార్థులు పాటించాల్సిన కఠిన నిబంధనల వరకు పూర్తి వివరాలు ఒకసారి చెక్ చేసుకోవడం ప్రతి విద్యార్థికి చాలా అవసరం.

AP Intermediate Exams 2026 :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. 2026 వార్షిక పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ విద్యామండలి సర్వం సిద్దం చేస్తోంది. ఈసారి పరీక్షలను అత్యంత పకడ్బందీగా, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది లక్షల 57 వేల 312 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకాబోతున్నారు.
పరీక్షల షెడ్యూల్ నుంచి విద్యార్థులు పాటించాల్సిన కఠిన నిబంధనల వరకు పూర్తి వివరాలు ఒకసారి చెక్ చేసుకోవడం ప్రతి విద్యార్థికి చాలా అవసరం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 24 వరకు జరుగుతాయి. ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 23వ తేదీ వరకు నిర్వహిస్తారు.
ఒక్క నిమిషం నిబంధన అమలు
విద్యార్థులు సమయపాలన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని బోర్డు స్పష్టం చేసింది. పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. నిబంధనల ప్రకారం ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించరు. కాబట్టి ఎక్కడా రిస్క్ తీసుకోకుండా విద్యార్థులు కనీసం గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1537 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో విద్యార్థుల సౌకర్యం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రతి సెంటర్లో కచ్చితంగా తాగునీరు, విద్యుత్ సరఫరా ఫ్యాన్లు తగినంత వెలుతురు ఉండేలా ఇప్పటికే తనిఖీలు పూర్తి చేశారు. ఎండ తీవ్రత లేదా ఒత్తిడి వల్ల విద్యార్థులు ఇబ్బంది పడకుండా ప్రతి సెంటర్ వద్ద ఒక ఏఎన్ఎం, ఆశా వర్కర్లు అందుబాటులో ఉంటారు. వారి వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుతారు. విద్యార్థులు సకారంలో చేరుకోవడానికి వీలుగా ఆర్టీసీ ద్వారా అదనపు బస్ సర్వీసులను నడపాలని అధికారులకు సూచించారు.
కాపీయింగ్, ఇతర అక్రమాలకు తావులేకుండా ఈసారి భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి పరీక్షా గదిలోనూ సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుంది. కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీలు పరీక్షలను పర్యవేక్షిస్తాయి. ఫ్లయింగ్ సిట్టింగ్ స్క్వాడ్లు నిరంతరం తనిఖీలు చేస్తూనే ఉంటాయి.
విద్యార్థులు ఏం చేయాలి? ఏం చేయకూడదు?
పరీక్షా హాల్లోకి వెళ్లే ముందు విద్యార్థులు ఈ సూచనలు పాటించాలి. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. హాల్లోకి వెళ్లిన వెంటనే ఓఎంఆర్షీట్లోని మీ వ్యక్తిగత వివాలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలి. కష్టపడి చదివితే ఫలితాలు అవే వస్తాయి అని ఇంటర్బోర్డు కార్యర్శి రంజిత్ భరోసా ఇచ్చారు. ఇన్విజిలేటర్లు, పోలీసులు విద్యార్థులకు స్నేహపూర్వకంగా ఉండాలని, నిబంధనలు మాత్రం కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
హెల్ప్లైన్ నెంబర్
పరీక్షల సమయంలో విద్యార్థులకు లేదా తల్లిదండ్రులకు ఏదైనా అత్యవసర సమస్య తలెత్తితే సహాయం కోసం బోర్డు ఒక టోల్ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది. 1800 425 1531 నెంబర్కు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్ర ఐదు గంటల వరకు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను, రూమర్లను నమ్మొద్దని ఇంటర్ బోర్డు విజ్ఞప్తి చేసింది. ఏదైనా సమాచారం ఉంటే అధికారిక ప్రకటనల ద్వారానే తెలుసుకోవాలని సూచించింది.























