Srikakulam Crime News: రైలు కింద పడి తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య.. శ్రీకాకుళంలో విషాదం
శ్రీకాకుళం జిల్లా తాళభద్ర వద్ద కుటుంబ కలహాలతో గేదెల పూజ అనే వివాహిత ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Srikakulam Crime News | శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒక వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. పలాస మండలం తాళభద్ర గ్రామం సమీపంలో ఈ విషాదకర ఘటన జరిగింది. మృతులను కోటబొమ్మాలి మండలం చలమయ్యపేట గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురి మరణంతో చలమయ్యపేట గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
రైలు కింద పడి చనిపోయిన వారిలో తల్లి పేరు గేదెల పూజ (35) కాగా, ఆమె కుమారుడు గేదెల సుశాంత్ (8), కుమార్తె చిట్టీ (7) గా పోలీసులు గుర్తించారు. మరణించిన బాబు సుశాంత్ స్థానిక పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్నాడు. కుటుంబంలో తలెత్తిన గొడవలతో తీవ్ర మనస్తాపానికి లోనైన వివాహిత ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. ఈ క్రమంలో పూజ తన ఇద్దరు పిల్లలతో సహా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది.
సమాచారం అందుకున్న రైల్వే, స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు., కుటుంబ కలహాలు సహా ఇతర అన్ని కోణాల్లోనూ విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు























