Chevella Accident Tragedy: దయలేదా దేవుడా..! చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
Rangareddy Road Accident | రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతిచెందారు. వారి తల్లి రోదించడం చూసి ఇతరులను కన్నీళ్లు పెట్టుకుంది.

Chevella Road Accident Tragedy: చేవెళ్ల: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఒక కుటుంబాన్ని అంతులేని విషాదంలో ముంచింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు సహా మొత్తం 19 మంది చనిపోగా, వారిలోఒక కుటుంబంలోనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతిచెందారు. ఘటనా స్థలంలో తల్లి గుండెలు బాదుకుని ఏడుస్తుంటే చూసేవారికి సైతం కన్నీళ్లు వచ్చాయి.

ఆ కుటుంబంలో తీవ్ర విషాదం..
తాండూరులోని గాంధీనగర్కు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కుమార్తెలు ఈ దుర్ఘటనలో మరణించారు. ఒకే ఇంట్లోని ముగ్గురు అక్కాచెల్లెళ్లు తనూష, సాయి ప్రియ, నందిని చనిపోవడంతో ఆ కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది. వారి బాధను ఎవరూ తగ్గించలేరు. ఆ తల్లి కడుపుకోతకు ఎవరు సమాధానం చెబుతారు. అమ్మను వచ్చాను లేచి చూడండమ్మా అంటూ ఆ తల్లి రోదన అక్కడున్న వారిని కదిలించింది.

తాండూరు గాంధీనగర్ కు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కుమార్తెలు హైదరాబాద్లోని కోఠి మహిళా కళాశాలలో (Koti Womens College) చదువుతున్నారు. తనూష (ఎంబీఏ), సాయిప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), నందిని (డిగ్రీ ఫస్టియర్) చదువుతున్నారు. ఇటీవల బంధువుల పెళ్లి ఉండటంతో సొంతూరు తాండూరుకు వచ్చారు. సోమవారం తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా బస్సు ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు ముగ్గురు చనిపోయారు. ఆర్టీసీ బస్సు ప్రమాదం సమాచారం అందిన వెంటనే తల్లిదండ్రులతో పాటు బంధువులు ఘటనాస్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.
ఎల్లయ్య గౌడ్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. తన నలుగురు కుమార్తెలను కష్టపడి చదివించారు. పెద్ద కుమార్తెకు వివాహం చేయగా.. మిగిలిన ముగ్గురు కుమార్తెల్ని హైదరాబాద్లో చదివిస్తున్నారు. కానీ నేడు జరిగిన రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తూ ముగ్గురు కూతుళ్లు మృతిచెందడంతో, ఆ కుటుంబం, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

మరో యువతి దుర్మరణం
యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్కు చెందిన అఖిలరెడ్డి అనే యువతి కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. అఖిలరెడ్డి ఎంబీఏ చదువుతోంది. ప్రమాదం గురించి తెలుసుకుని అఖిల తల్లి, బంధువులు అక్కడికి వెళ్లారు. కుమార్తె మృతితో అఖిల తల్లి కన్నీటిపర్యంతమయ్యారు.






















