New scam: రీఫండ్ స్కామ్- రూ.5 కోట్లు కొల్లగొట్టిన టీనేజర్ - షాక్లో ఈ-కామర్స్ సంస్థలు
Fake refunds: ఈ-కామర్స్ దిగ్గజాలను బురిడీ కొట్టిస్తూ కేవలం రీఫండ్ లూప్హోల్స్ ద్వారా ఒక టీనేజర్ ఏకంగా 5 కోట్ల రూపాయలు సంపాదించిన ఉదంతం ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచంలో సంచలనంగా మారింది.

E commerce loophole New scam unlocked: సాధారణంగా ఈ-కామర్స్ సంస్థలు తమ కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవడానికి రిటర్న్ అండ్ రీఫండ్ పాలసీలను సరళంగా ఉంచుతాయి. దీన్నే పెట్టుబడిగా మలుచుకున్న ఓ టీనేజర్, ఖరీదైన గ్యాడ్జెట్లు, బ్రాండెడ్ దుస్తులు , ఎలక్ట్రానిక్ వస్తువులను ఆర్డర్ చేసేవాడు. వస్తువు డెలివరీ అయిన తర్వాత, టెక్నికల్ లూప్హోల్స్ ఉపయోగించి ఆ వస్తువు తనకు అందలేదని లేదా బాక్సులో వేరే వస్తువు వచ్చిందని నకిలీ ఫిర్యాదులు చేసేవాడు. తద్వారా వస్తువును తన దగ్గరే ఉంచుకుంటూ, చెల్లించిన నగదును తిరిగి తన ఖాతాలోకి మళ్లించుకునేవాడు. అయితే ఈ టీనేజర్ మన ఇండియా వాడు కాదు..చైనీయుడు.
టెక్నాలజీతో తెలివైన మోసం
ఈ స్కామ్ విజయవంతం కావడానికి అతను సోషల్ ఇంజనీరింగ్,స్క్రిప్టింగ్ పద్ధతులను వాడాడు. కస్టమర్ కేర్ ప్రతినిధులను బురిడీ కొట్టించడంలో ఆరితేరిన అతను, ఒకేసారి వందల సంఖ్యలో నకిలీ అకౌంట్లను సృష్టించేవాడు. విభిన్నమైన ఐపీ అడ్రస్లు, వేర్వేరు పేర్లు , అడ్రస్లను వాడుతూ ఈ-కామర్స్ సెక్యూరిటీ అల్గారిథమ్ల కళ్లు గప్పేవాడు. ఇలా వచ్చిన ఖరీదైన వస్తువులను డార్క్ వెబ్ లేదా లోకల్ మార్కెట్లలో తక్కువ ధరకు అమ్మి కోట్లాది రూపాయలు గడించాడు.
బట్టబయలైన లూప్హోల్
చాలా కాలం పాటు ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగినా, ఒకే ప్రాంతం నుండి అసాధారణంగా రీఫండ్ రిక్వెస్ట్లు రావడాన్ని గమనించిన కంపెనీ సెక్యూరిటీ టీమ్ దీనిపై నిఘా పెట్టింది. అంతర్గత విచారణలో ఒకే నెట్వర్క్ నుండి అనేక లావాదేవీలు జరుగుతున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో ఆ టీనేజర్ ఐటీ నైపుణ్యాన్ని చూసి పోలీసులు సైతం విస్తుపోయారు. కేవలం లాభం కోసమే కాకుండా, సిస్టమ్లోని లోపాలను వెతకడమే తన హాబీ అని అతను విచారణలో వెల్లడించినట్లు సమాచారం.
వినియోగదారులకు హెచ్చరిక - కంపెనీల మార్పులు
ఈ ఉదంతం తర్వాత అమేజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు తమ రీఫండ్ విధానాలను మరింత కఠినతరం చేస్తున్నాయి. ముఖ్యంగా హై-వాల్యూ వస్తువుల విషయంలో డెలివరీ సమయంలోనే ఓటీపీ వెరిఫికేషన్, వీడియో రికార్డింగ్ వంటి చర్యలు చేపడుతున్నాయి. ఈ తరహా మోసాలు పెరగడం వల్ల నిజాయితీ గల కస్టమర్లకు రీఫండ్ ప్రక్రియలో జాప్యం జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి నకిలీ రీఫండ్ గ్రూపులు టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లలో చురుగ్గా ఉన్నాయని, వాటికి దూరంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.





















