Students Protest: అర్ధరాత్రి విద్యార్థినుల బాత్రూమ్లోకి తొంగిచూస్తున్నారంటూ నిరసన, ఎమ్మెల్యే చెప్పినా పట్టించుకోని పోలీసులు!
Andhra Pradesh News | సెంట్రల్ యూనివర్సిటీలో అమ్మాయిల బాత్రూమ్ల్లోకి తొంగి చూస్తున్న ఘటన కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే ఆదేశించినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలున్నాయి.

Student protest at Central University in Bukkarayasamudram mandal | బుక్కరాయసముద్రం: అర్ధరాత్రి ఒక మహిళ స్వేచ్ఛగా రోడ్డులో తిరిగినప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్టని చెబుతుంటారు... కానీ స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు గడుస్తున్నా.. ఒక మహిళ రోడ్డుపై నడవటం సంగతి అటు ఉంచితే ఒక అత్యున్నతమైన యూనివర్సిటీలో వాష్ రూమ్ లో కూడా విద్యార్థినులకు భద్రత లేకుండా పోయింది. వినేందుకు ఇది ఆశ్చర్యంగా ఉన్నా.. అనంతపురం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఒక మహిళ ఎమ్మెల్యే ఇలాకాలో విద్యార్థినుల ప్రైవసీకి రక్షణ లేకుండా పోయింది.
బుక్కరాయసముద్రం మండలంలోని సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది. జంతులూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో గత కొన్ని రోజులుగా విద్యార్థినుల వాష్ రూమ్ లో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు తొంగి చూస్తున్నారు. గతంలోనే ఇది గుర్తించిన విద్యార్థులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే అప్పట్లో బుక్కరాయసముద్రం పోలీసులు దీనిపై చాలా నిర్లక్ష్యంగా వహించారని విమర్శలున్నాయి. పైగా ఎమ్మెల్యే అయిన బండారు శ్రావణి యూనివర్సిటీకి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే ఇప్పటివరకు ఆ మహిళా ఎమ్మెల్యే ఆదేశాలను పట్టించుకోలేదు. విద్యార్థులు అంతకంటే రక్షణ లేదని వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఆదివారం రాత్రి కూడా కొందరు గుర్తు తెలియని అగంతకులు తమ వాష్ రూములోకి తొంగు చూస్తుండటాన్ని విద్యార్థినులు గమనించారు. వెంటనే కేకలు వేయగా గుర్తుతెలియని వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే విద్యార్థినులు ఈ విషయాన్ని మరోసారి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వారి నుంచి నిర్లక్ష్యపు సమాధానం వచ్చిందంటూ అర్ధరాత్రి వేళ రోడ్డుపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఒక సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినులకు రక్షణ లేకపోవడం ఏంటని తీవ్రస్థాయిలో వారి తల్లిదండ్రులతో పాటు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుక్కరాయసముద్రం పోలీసులపై గత కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక యూనివర్సిటీలో విద్యార్థినులకు ఇలాంటివి జరుగుతున్నా.. కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే చర్యలకు ఆదేశించినా, ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.





















