Srikakulam Honor Killing: కుమార్తెను చంపి గుండెపోటుగా నమ్మించిన తల్లి - ఇలాంటి అమ్మలు కూడా ఉంటారా ?
Dumpala Harini Murder: శ్రీకాకుళం జిల్లా సొర్లిగాంలో దారుణ పరువు హత్య. గ్రూప్-1 ట్రైనీ హరిణిని కన్నతల్లే ఊపిరితిత్తలు నొక్కి చంపేసిన వైనం. శక్తి యాప్ ద్వారా వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో సంచలనం.

Tekkali Honor Killing Police Arrest: కన్నబిడ్డ ఏడుస్తుంటే గుండె కరిగిపోవాలి.. ఆకలి అంటుంటే అమృతం తినిపించాలి.. కానీ, ఆ తల్లి గుండె మాత్రం రాతిగా మారింది. కన్నప్రేమ కంటే కుల పరువు, సమాజపు మాటలే ముఖ్యం అనుకుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతల్లే యమపాశమైంది. కట్టుకున్న భర్త కాలయముడయ్యాడు. శ్రీకాకుళం జిల్లా సంచలనం సృష్టించిన సొర్లిగాం పరువు హత్య ఉదంతం, సమాజంలో మానవ సంబంధాలు ఎంతలా దిగజారిపోతున్నాయో చెప్పడానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
దుంపల హరిణి .. చదువులో ఎప్పుడూ ముందే ఉండేది. సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడాలన్న లక్ష్యంతో గ్రూప్-1 శిక్షణ తీసుకుంటోంది. ఆమె భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉండాల్సింది, కానీ కుటుంబ సభ్యులు బలవంతంగా చేసిన పెళ్లే ఆమె జీవితానికి ఉరితాడుగా మారింది. మనస్పర్ధల కారణంగా భర్తకు విడాకులిచ్చి, తను ఇష్టపడిన మరో వ్యక్తితో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంది హరిణి. కానీ, ఆ నిర్ణయమే ఆమె పాలిట మరణశాసనమైంది. భర్తకు విడాకులిచ్చి వేరే వాడిని చేసుకుంటే సమాజంలో మా ముఖాలు ఎక్కడ పెట్టుకోవాలి అనే అహంకారం ఆ కుటుంబంలో కక్షగా మారింది.
అర్ధరాత్రి వేళ.. జగమంతా నిద్రిస్తున్న వేళ.. ఆ ఇంట్లో మాత్రం ఒక మృగాల వేట సాగింది. కన్నతల్లి, భర్త, తాత ముగ్గురూ కలిసి హరిణిపై దాడి చేశారు. ఆమె గట్టిగా అరిస్తే బయట పడతారనే భయంతో, ఆ కన్నతల్లే స్వయంగా బిడ్డ నోరు నొక్కి పట్టుకుంది. ఊపిరి ఆడక, ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ కన్నకూతురు ఎంతలా కొట్టుకుందో, ఎంతలా విలవిలలాడిందో ఆ రాతి గుండెలకి అస్సలు కనపడలేదు. చివరకు ఊపిరితిత్తలపై బలంగా నొక్కి ఆమె ప్రాణాలను గాల్లో కలిపేశారు. అంతటితో ఆగకుండా, తెల్లారేసరికి గుండెపోటుతో చనిపోయిందంటూ కట్టుకథలు అల్లారు. ఎవరికీ అనుమానం రాకుండా అర్ధరాత్రికి అర్ధరాత్రే అంత్యక్రియలు కూడా కానిచ్చేశారు. సాక్ష్యాలను బూడిదలో కలిపేస్తే పాపం దాగిపోతుందని నమ్మారు.
కానీ, చనిపోవడానికి ముందే హరిణికి తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలుసు. అందుకే ఆమె ఒక సాహసోపేతమైన, తెలివైన నిర్ణయం తీసుకుంది. తన తల్లి, భర్త తనను ఎలా వేధిస్తున్నారో, తనను చంపేస్తారనే భయం ఉందో వాటన్నింటినీ వివరిస్తూ కన్నీళ్లతో ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసింది. ఆ వీడియోను తన అత్యంత నమ్మకస్తుడైన స్నేహితుడికి పంపింది. హరిణి చనిపోయిందన్న వార్త వినగానే నివ్వెరపోయిన ఆ స్నేహితుడు.. తక్షణమే రంగంలోకి దిగి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు చెందిన శక్తి యాప్ ద్వారా ఆ సెల్ఫీ వీడియోను పోలీసులకు చేరవేశాడు.
చావు నోట్లో ఉండి కూడా హరిణి పంపిన ఆ ఒక్క వీడియో.. నిందితుల పగటి వేషాలను బట్టబయలు చేసింది. హరిణి గుండెపోటుతో చనిపోలేదని, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని టెక్కలి పోలీసులకు అర్థమైంది. విచారణ చేపట్టిన పోలీసులు పక్కా ఆధారాలతో కన్నతల్లి, భర్త, తాతలను అదుపులోకి తీసుకున్నారు. లాకప్లో వారిని ప్రశ్నించగా.. తామే ఊపిరి నొక్కి చంపేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. చదువుకుని ఉన్నత స్థానానికి చేరాల్సిన ఒక యువతి, సొంత కుటుంబ సభ్యుల అహంకారానికి బలైపోవడం స్థానికంగా అందరినీ కన్నీరు పెట్టించింది. పరువు కోసం ప్రాణాలు తీసే ఇటువంటి మృగాలకు చట్టం కఠినమైన శిక్ష విధించాలని కోరుతూ టెక్కలి పోలీస్ స్టేషన్ వద్ద స్థానికులు, నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
ట్రెండింగ్ వార్తలు






















